Saturday, November 19, 2016

బ్రతుకు ... బ్రతికించు!


  బ్రతుకు ... బ్రతికించు
-----------------------------

జాలరి వాళ్ల   గాలానికి  చిక్కిన  చేపలు నల్లధనం  కట్టలు
గంగమ్మ తల్లి మింగిన  కాలకూట  విషాన్ని ప్రక్షాళన
చెయ్యడానికి  మోడీ  మంత్రం తంత్రం
కోట్లు మింగిన మొసళ్ళు
నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు
ఒక్క దెబ్బతో  కడిగేసిన కుళ్ళు
సమానత్వం ఉపన్యాసాలతో రాదు
కార్ల్ మార్క్స్ సిద్ధాంతం  బూర్జువా ఇనప్పెట్టెల్లో
తర  తరాలుగా  బూజు పట్టి ఉంది
సబ్బు పెట్టి ఉతికితే  మురికి పోతుందేమో  గానీ
మనిషి  ఉగ్ర స్వార్థ  ఉన్మాదం ఎలా సమసి పోతుంది ??
పనికి రాని కాగితాల్లా  నిన్నటి   పెద్ద కరెన్సీలు
ఎక్కడ గాని తక్కెడ కెక్కని  రంగుల కాగితాలు
ఎందుకు కొరగాని కొరివి దయ్యాలు
నల్ల ధనం  అవకాయ  ఊటలా  ఊరుతుంటే
ఎక్కడ  మెత్తుకొవాలో తెలియక
పిగిలి  పోయిన  నల్ల కుబేరుల  జాతకాలు
ఒక జాతి  హీనాతి హీన మయింది
ఒక నీతి  నిర్విర్వమై  పోయింది
కొన్ని వాదాలు  నిజమై  నిర్భాగ్యుల  ఉసురు తీసింది
మానవత్వం  నోట్ల కట్టల్లో  మాడి పోయింది
ఒక అభాగ్యుడు  డబ్బులేక  భార్య శవాన్ని భుజాల మీద మోస్తే
ఒక తల్లి పుట్టిన పేగు బంధాన్ని  పురిటిలోనే  తుంచేస్తే
ఒక తండా విష జ్వరాల బలి అయిపోతే
ఒక  చెల్లి  ఒక తమ్ముడు ఒక అన్న ఒక అక్క
డబ్బు లేని అసమర్థ యాత్రను  ఉరి  వేస్తుంటే
ఒక సామాన్యుడి  జీవనయాత్ర  నరకానికేనా ??
డబ్బు లేని  మనిషి  శవంతో  సమాన మేనా ??
కోట్లు మూగుతూ  మూల్గుతూ  తాగుతూ తూగుతూ  తేలుతూ
బడా వ్యాపారుల రాజకీయ నాయకుల లంచాధి కారుల
శకం ముగిసి నట్లేనా ??
నిర్భాగ్యుల నట్టింట్లో   నవ్వులు పండేనా ??
సమ సమాజం  రేపటి  సంధ్యలో  ఉదయించేనా ??
మనిషి  సామూహిక బ్రతుకు   సాగిస్తాడా ??



(On Demonetisation of Currency notes of  Rs.500 and Rs.1000 by Modi Government on 08.11.2016)


నదిగా మారింది !




నదిగా  మారింది !

నా  శరీరం మీద ఒక నది నిలువునా ప్రవహిస్తోంది
పాయలు పాయలుగా ప్రవహించినా
నది  ఒక  చోట కలిసి  ముందుకు ఉరుకుతోంది
గుండె బద్దలయిన చోట
 ఒక సుమాని గా  మారుతోంది
వికృత ధర్మాల్ని ఒంపుకొన్న వళ్ళు  
సుడిగుండమై   కంపించింది
కళ్ళు  కర్కశ దృశ్యాల్ని నమిలి నపుడు
జల ప్రళయమై  జ్వలించింది
నా శరీరమిపుడు
నదిగా మారింది!

Tuesday, October 25, 2016

మెయిల్ నాట్ డెలివెర్డ్ ( Mail not delivered )

మెయిల్ నాట్ డెలివెర్డ్ ( Mail  not  delivered )
---------------------------------------------------------

మరణించే దాకా తెలియదు అతనికి  ఒక జీవితం ఉండిందని
అతనకి  ఇంకొన్ని శ్వాసలు మిగిలాయి   బ్రతకడానికి
నూకలు ఎప్పుడో చెల్లి పొయ్యాయి గాని  అతి కష్టం మీద
వెంటిలేటర్ల  దయ మీద  ప్రాణం వేలాడుతోంది
అతని  ఆలోచనలు  ఎనభై ఏళ్ళ  జీవిత ప్రస్థానం  వైపు పాకుతున్నాయి
ఇంత  తొందరగా  చావు వస్తుందని అనుకోలేదు
మొన్నటికి మొన్న  నిప్పులు చెరిగి కొందరి  బ్రతుకుల్ని మసి చేసాడు
నిన్నటికి నిన్న  కోట్లాది నల్ల ధనాన్ని  బాత్రూం గోడల్లో దాచి  సున్నాలు కొట్టాడు
ఎప్పుడయినా  నవ్వడం  అంటే  అమ్మ  కడుపులోనే అనుకొంటా
బయట కొచ్చాక ఏడుపు ... మనుషుల్ని చూసి  ఏడ్పు....
కుక్కల్ని చూసి ఏడ్పు.. కోతుల్ని చూసి ఏడ్పు ...
ఏడవంది  దేనికి ??
తెల్లార్లు  ఎవడి కడుపు కొట్టాలో  అనే  ఆలోచనలు
రాత్రంతా  జాగారం చేసి  రాసుకున్న  చిట్టా
అమలు కోసం  పొద్దున్నే    విప్పదీసిన  నోట్ల కట్ట
భూమికి సమాంతరంగా  ఇంకొక భూమిని  తయారు చేసి
ప్లాట్లు  చేసి అమ్మెయ్య గల బడా  వ్యాపారి
గ్రహాల  మధ్య చిచ్చు పెట్ట గల  పెద్దమనిషి
అమృతం అమ్ముతారంటే  దేవలోకం వెళ్లి  కొన గల  సమర్థుడు
డాక్టర్లు  ఆ దేవతా మూర్తిని  బ్రతికించ డానికి  నానా  తంటాలు
కెనడా  నుండి కిడ్నీ , అమెరికా నుండి  గుండెకాయ
లివర్ లండన్ నుండి ,  బ్రెయిన్ బ్రెజిల్ నుండి
అయినా ఆ మనిషికి  అతకడం లేదు
రక్త దానం కోసం వేలాది  మంది రక్తాసురులు
కాళ్ళు పైన తల క్రింద పెట్టి నడుస్తున్నారు
ఆ మనిషి మరణాన్ని జయించడానికి  యముడికి  ఇమెయిల్ పంపిస్తే
నాట్ డెలివరెడ్ అని వచ్చింది
ఇన్ని ఏళ్ళు  బ్రతికి  ఏమి  సాధించాడని ?
గుట్టలు గుట్టలు గా పేరుకు పోయిన అవినీతి సొమ్ము తప్ప
తనకు తెలుసు ... గుండె ఆగిపోతోంది ... మరణం కొద్దీ సేఫుట్లో  ..
పల్స్ రేట్ జీరో  సర్ ... డాక్టర్ అనడం విన బడింది
నల్లని చీకటి కళ్లలో ... అంధకారం ...  గాఢాంధ కారం
ప్రాణం  లేని ఆ మనిషి శవం ...మార్చురీ  గదుల్లోకి ...







Sunday, October 23, 2016

పిల్లలు- తల్లి తండ్రులు

పిల్లలు- తల్లి తండ్రులు



కొందరు తల్లి తండ్రులు పిల్లల్ని ఎందుకు కంటారో అర్థం కాదు.  పిల్లల్ని వీళ్ళే  కన్నట్లు , వీళ్ళే గొప్పగా పిల్లల్ని పోషిస్తున్నట్లు  అనుకొంటారు.  కొందరు తల్లి తండ్రులు  క్రమశిక్షణ  పేరుతొ పిల్లలకి నరకాన్ని చూపిస్తారు.  నాకు తెలిసిన ఒక జంట  వాళ్ళ పిల్ల వాడికి కుక్కను బంధించినట్లు ఇంట్లో  పెట్టి బయట తాళం వేసి పోతారు , ఇంట్లో  ఆయాను  తోడుగా పెట్టి.  ఇంత కన్నా దారుణం   మరొకటి ఉందా ?  కొందరు  అది తినొద్దు ఇది తినొద్దు అని ఎన్నో conditions  పెడతారు . ఐస్ క్రీం  వద్దు, పిజ్జా , బర్గర్  తినొద్దు  అని  పిల్లల్ని  సతాయిస్తారు . ప్రేమ చూపిస్తూనే పిల్లల్ని  మానసికంగా  వేధిస్తూ ఉంటారు . ఏదయినా ఒక పార్టీ వెళ్లి నట్లయితే  , అక్కడికి వెళ్లొద్దు, అది తినొద్దు , disturb  చెయ్యవద్దు  అని గద మాయిస్తారు .

మాకు తెలిసిన  ఒక పెద్దాయన  పిల్లల్ని గొడ్డును బాదినట్లు బెల్ట్  తో కొట్టే వాడు.  ఏమయ్యా అంటే  'మొక్కై వంగనిది  మాను వంగుతుందా 'అనే వాడు. పిల్లల్ని అలా కొట్టడం ఎంత వరకు సబబు? స్కూల్ లో టీచర్లు  , ఇంట్లో  తల్లి తండ్రులు  పిల్లలకి  నరకాన్ని చూపిస్తున్నారు.

కొందరు  పిల్లల్ని బానిసల్లాగా  ట్రీట్ చేస్తారు. మంచినీళ్లు , పేపర్ అందుకో, టీవీ రిమోట్ ఇవ్వు , అని చెప్పిన పని  చెపుతూనే ఉంటారు.  పెద్ద వాళ్లకి  లేచి  నిలబడి పనులు చేసు కోవడం  బద్ధకం , అందుకే పిల్లలకి  పనులు పుర మాయిస్తూ ఉంటారు. సెల్ఫ్ డిసిప్లిన్ పేరుతొ  పిల్లలకి నరకాన్ని చూపిస్తారు.

మా చిన్నపుడు  మా  స్కూల్లో ,  పిల్లలు స్కూల్  కి రాకపోతే , ఒక పెద్ద  కొయ్య తుండు ని కాలికి గొళ్లెంతో  తగిలించి వారు. లేదంటే  ఎండలో  గోడ కుర్చీ  వెయ్యమని చెప్పేవారు. ఈ  శిక్షలు ఎంత వరకు  సబబో  ?

కొందరు తమ ఆఫీస్  టెన్షన్ అంతా పిల్లల మీద చూపిస్తారు . కొట్టడం , తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తల్లి తన భర్త మీద , అత్త మామల మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది.

మన దేశం లోనే గాకుండా , విదేశాల్లో సైతం పిల్లల మీద  అరాచకాలు ఎక్కువ  అయినాయి.  పిల్లల్ని  హ్యూమన్ షీల్డ్స్ గా వాడుకొంటూ పిల్లని చంపే నరహంతకుల వార్తల్ని చూస్తూ ఉన్నాము.

ఇటీవల ఒక  తల్లి తండ్రి  తమ బిడ్డని  కార్లో లాక్  చేసి  హోటల్ కెళ్ళి టిఫిన్ చేసారంట . ఇది ఇటీవల  జరిగింది . ఆ పిల్ల ప్రాణ వాయువు అందక  ఒకటే ఏడ్పు. బయటి వాళ్ళు చూసి ఆ పేరేంట్స్ కి తగిన  బుద్ది  చెప్పారు.  పిల్లల్ని కార్లో AC  on  చేసి , బయట షాపింగు  చేసి వచ్చిన పేరెంట్స్ బిడ్డ శవాన్ని చూసి లబో దిబో అన్న  కేసులు ఎన్నో ఉన్నాయి .

ఒక పది  సంవత్సరాల  పిల్ల  చిన్న పిల్లని చూసుకోవడానికి  పనికి కుదిరింది ఒక ఇంట్లో. ఆ పిల్ల పని పసివాడ్ని చూసుకోవడమే. ఒక హోటల్ కి వెళ్ళినపుడు, వాళ్లంతా బాగా మెక్కుతూ ఉంటె ఆ పదేళ్ల పిల్ల చిన్న పిల్ల ను చూసుకొంటూ , నిలబడే ఉంది. వాళ్ళు కూర్చోమని , టిఫిన్ తినమని చెప్పడం లేదు. నాకు కోపం వచ్చి , ఆ అమ్మాయిని  మీ ప్రక్క కూర్చో మని  చెప్ప వచ్చు గదా అన్నాను . 'నీ పని నువ్వు చూసుకో'  అని నన్ను కొట్టేంత పని చేశారు.

పిల్లల్ని బూచి , దెయ్యం అని భయ పెట్టి  వాళ్ళను  పిరికి వాళ్ళుగా  తయారు చేస్తున్నారు. బొద్దింక లను చూ స్తే భయం, బల్లుల్ని చూస్తే భయం. పురుగుల్ని చూస్తే భయం కొందరికి .
పెద్ద వాళ్ళే భయం , భయం అంటే పిల్ల వాళ్లకు భయం గాక  మరి ఏమౌతుంది ?

పిల్లల మీద దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి నేటి సమాజంలో . ఆరేళ్ళ పిల్లల్ని టీవీ రియాలిటీ  షోస్ లో హింస పెడుతున్నారు కొందరు. పసి వాడని పిల్లల్ని పెద్ద పనులకి పురమాయిస్తున్నారు. బాల కార్మికులుగా పడ  రాని పాట్లు పడుతున్నారు . చట్టాలు  ఎన్ని ఉన్నా అవి అన్ని తుంగలో తొక్కుతున్నారు.

పిల్లలు ఎదో  సాధించాలని , కరాట్టే , భరత నాట్యం , యోగ , కూచిపూడి , బాడ్ మింటన్, క్రికెట్ లాంటివి సాధన కోసం అందరి దగ్గర  కోచింగ్ కి డబ్బులు  కట్టి పిల్లల్ని  కట్టు  బానిసల్లా తయారు చేస్తారు.

పిల్లల  మనస్వత్తాన్ని  మనము సరిగా అర్థం చేసు  కోవడం లేదు అని నా  అభిప్రాయం. ఎందుకంటే  తల్లి తండ్రి ని చూసి  భయపడే పిల్లలు  నోరు  తెరచి  ఏమి   అడగ  గలరు ?   

క్రమశిక్షణ పేరుతో  పిల్లల్ని  హింసించ  వద్దని  నా మనవి.    అల్లాగే మన  బాధల్ని , టెన్సన్స్ ని వాళ్ళ మీద రుద్దడం  గూడా  భావ్యం గాదు . పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచితే అంత ప్రేమను మనము పొంద వచ్చు. 








Wednesday, September 28, 2016

కవిత్వం రాయడం అవసరమా ??


కవిత్వం రాయడం అవసరమా ??
---------------------------------------------

ఆకలి దప్పులు  మరచి  , ఆలు  బిడ్డలని  అరచి 
బంధు మిత్రులని వదలి , తల్లి దండ్రులను  మరచి 
ఏకాకినై  , నాలుగు గోడల మధ్య రాసితి  పలు  కావ్యముల్ ....  అన్నా డట  ఒక  కవి.

 కవి జీవితమే  ఒక ప్రవాహం లాంటిది. భావ ప్రవాహం లో కొట్టుకు మిట్టాడుతూ బాహ్య ప్రపంచాన్ని మరచి పోతాడు. తన అంతర్గత లోకంలో విహరిస్తూ ఒక ట్రాన్స్  లోకి వెళ్లి కవిత్వాన్ని రాస్తాడు.   పూర్వ కవులు  ఆనాడు ఎన్నో ప్రభందాలు , కావ్యాలు  రాసి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత గూడా మనల్ని అలరిస్తున్నాయి . ఆనాడు  రాజ పోషకులు , కళా రాధకులు ఉండే వారు. అలనాడు సామాన్య మానవులు  గూడా  ఎంతో కొంత ఆశు కవిత్వాన్ని  చెప్ప గలిగే  వారు. కవిత్రయం రాసిన  మహా భారతం  మన జాతిని ఎంత ప్రభావితం చేసింది అంటే భారతం చదవని వాడు , వినని వాడు  ఒక  చవట క్రింద లెక్కే అన్నట్లు ఉండేది. తిరుపతి వెంకట కవులు  రాసిన భారత పద్యాలు  ఈ నాటికి  పామరులు గూడా పాడుకొనే విధంగా  అలరించాయి. 

మరి ఈ  నాటి కవులు రాసిన  కవిత్వం ఎంత వరకు సజీవంగా ఉండగలదు అనేది ప్రశ్న ? నిన్న రాసిన కవిత ఈ  రోజు గుర్తు ఉండడం లేదు . మనం కవిత్వం పట్ల  చూపిస్తున్న  ఉదాసీనత  కారణమా ? ఈ నాడు  పుట్ట గొడుగుల్లా  కవులు ఉద్భవిస్తున్నారు. పండితుడు కానక్కరలేదు కవిత్వం రాయడానికి ఇప్పుడు . పామరులయినా  గీతాల్ని, కవిత్వాన్ని  అలవోకగా  చెబుతున్నారు, రాస్తున్నారు . 

రాసిన కవిత్వాలు  వేలాది రూపాయలు  పోసి  సంపుటిలుగా  ప్రచురిస్తే   పుస్తకాలు కొనే వాళ్ళే కరువయ్యారు.  ప్రతి కవిఇంట్లో అమ్ముడు కాని  పదార్థం పుస్తకాల రూపంలో  అటకల మీద కవిని వెక్కిరిస్తూనే ఉంటుంది . ప్రతి కవి హృదయ గవాక్షంలో తొంగి చూస్తే , కవి ఆవేదన అర్థ మవుతుంది . కవి గాని వాడు కవిత్వాన్ని ఏమర్థం చేసు కొంటాడు ? ప్రతి మనిషికి  కొంచెం కవిత్వపువాసనలు ఉంటేనే గానీ  కవులు రాసిన కవిత్వాన్ని  చదవ గలుగు తారు  .
పాశ్చాత్త్య దేశాలలో  కవిత్వానికి చాలా ఆదరణ  ఉంది. ప్రతి సామాన్య మానవుడి చేతిలో ఎదో పుస్తకం ఉంటుంది. వాళ్ళు తీరిక వేళల్లో పుస్తకాల్ని  బాగా చదువు తారు. అందుకే అక్కడి కవులు  రాసిన పుస్తకాలకు  మిలియన్ల  డాలర్ల  కొద్దీ  రాయల్టీ  వస్తుంది . అక్కడ సాహిత్యం గూడా  బాగా చదివే  వాళ్ళు ఉన్నారు. 

మన దగ్గర టీవీ లాంటి మాధ్యమాలు వచ్చిన తరువాత చదివే  నాథుడే లేడు . పెద్ద పెద్ద కవులు గూడా  స్వంత డబ్బా వాయించుకొని  మార్కెటింగ్ చేసుకొన్నా పుస్తకాలు అమ్ముడు పోవడంలేదు.  చెదలు పట్టి  గిడ్డంగుల్లో  అమ్ముడు కాని  పుస్తకాల్ని  ఏమి చెయ్యాలో  తెలియక తలలు పట్టుకొని కూర్చొన్న  పబ్లిషర్స్ ఉన్నారు . 

మహా భాగవతాన్ని  తెనిగించిన బమ్మెర పోతన  గారు అన్నట్లు  నరాధములకు నా కావ్య కన్నియను ఇవ్వను గాక ఇవ్వను అన్నాడు . 

కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

అలాంటి  కవులు  మనకు ఇప్పుడు గూడా ఉన్నారు. వాళ్ళ పని రాయడమే ! అలాంటి కవులకు నా జోహార్లు !

ఏమయినా   కవిత్వాన్ని   మళ్లి  సజీవంగా  పునరుద్ధించేందుకు కొన్ని కళా పీఠాలు , కల్చరల్ అసోసియేషన్స్ , ప్రభుత్వాలు కలిసి పని చేస్తే కవిత్వాన్ని , కవుల్ని  మనం కాపాడు కోవచ్చు . కవికి అవార్డు లతో పాటు  రివార్డ్ లు గూడా ముఖ్యమే గదా ! ఒక ప్రొఫెషన్  గా  తీసుకొన్న ఒక వ్యక్తి  కవి గా నిల దోక్కుగోగలడా అనేది ప్రశ్న ?  లేదనే , లేదనే సమాధానం వస్తుంది.  అందుకే  ఈ  సమాజంలో కవులు  నిత్య దరిద్రంతో  బాధ పడుతున్నారు . ఇప్పటి కయినా  మంచి కవులను ప్రోత్సహించడం మంచిది.


         భానుమూర్తి  వారణాశి 






Monday, September 26, 2016

పోనీ పోతే పోనీ !

పోనీ పోతే పోనీ !
----------------------------

తడి  ఆరని  గొంతులు
కన్నీటి సము ద్రాలయిన లోగిళ్ళు
నీళ్ల సమాధులయిన గుంతలు
మనిషి మనుగడ  ప్రశ్నార్థకం
నగరం సాగర మయిన రోజు

జవాబు దారితనం లేని
అధికారుల గుండెల్లో రైళ్లు
జవాబు లేని ప్రశ్నలు
ప్రశ్నించ లేని  ప్రజలు

మాయమై  పోయిన చెరువులమ్మల సాక్షిగా
నీటి తల్లికి ఏమి తెలుసు
తాను ఎక్కడ ప్రవహిస్తోందని ?

నీరు పల్ల  మెరుగు
నిజం దేవుడెరుగు

నాకిక్కడ ఒక నిజం తేలుతోంది
అధికారులు,  కబ్జా రాకాసుల  వేసుకొన్న పందెం లో
అమాయకులు  బలి  అవుతున్నారని...

 చెరువులమ్మలు గట్లను తెంపుకొని
కొల్లేరు లయిన  బజార్లు , బళ్ళు  , ఇళ్ళు

మృత్యు  కుహరాల్లాంటి  మాన్ హోళ్ళు
మరణ శాసనాలు రాస్తుంటే
మన స్మార్ట్ సిటీ  జీవితాలు నరక కూపాలు

ఏమున్నది చెప్పడానికి  గర్వ కారణం ?
ఏ ప్రభుత్వ మొచ్చినా   కనబడని  అభివృద్ధి  తోరణం

కాగితాల్లో  ప్రణాళికలు  కాగితం పడవలై
ఏ  తీరానికి  సగటు మనిషిని  తీసుకు  వెడతాయో ?

నిన్న వేసిన  రోడ్లు  కాంట్రాక్టర్ల  మోసానికి బలి  అయిన అబలలు
మొన్న కట్టిన ప్రాజెక్టులు ఇసుక తేలిన శిధిల  కళేబరాలు

ప్రజల నెత్తిన పెడుతున్న శఠగోపాలు
ప్రజా బ్రతుకుల్ని  లోపలికి లాక్కొనే  రక్త బిల్వాలు

''పోనీ పొతే పోనీ .... రానీ  రాక  పోనీ
చావనీ  జనాల్ ... చేరనీ నరకాల్ '' -
అని అనుకోవడం లేదు  నేను ...

రేపటి ఉదయం ఒక
అభ్యుదయ  గీతమై  మనల్ని  మురిపిస్తుందేమో !

కాగడాలు వెలిగించి  రండి
ఆ ఉదయం కోసం   వెతుకు దాం  !











Saturday, September 24, 2016

వానమ్మా .... ఇక రావమ్మా !!

వానమ్మా .... ఇక రావమ్మా !!
--------------------------------

కురుస్తున్న వానమ్మను వద్దనడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?
ఆకాశం  చిల్లులు పడేలా కుంభ వృష్టి  ఆపడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?

కట్టుకొన్న ఆకాశ  హర్మ్యాలు కూలి పోతున్నాయనా  నీ  బాధ ?
చెరువులు   మాయం చేసి  కట్టుకొన్న ఇళ్ళు  కూలి పోతున్నాయనా  నీ  ఆక్రోశం?
కబ్జా గాళ్ళ  కబంధ హస్తాల్లో   చిక్కుకొన్న  నేలతల్లి  కష్టాలు  తీరినాయనా నీ కోపం  ?
 దొంగ  దారిన  చేసుకొంటున్న  అవినీతి సొమ్ము రాదనా  నీ  బాధ?

మాయ మాటలు చెప్పి భూబకాసురులు
పచ్చని భూముల్ని లాక్కొని
 రైతన్న కడుపులో  మట్టి గొట్టి
బంగారు భూముల్ని  మసి చేసి  నుసి చేసి
కాంక్రీట్  జంగల్ని  ప్లాట్లు  చేసి
నేలమ్మ కడుపులో నిప్పులు బోసి
నాలాలు ,  కాల్వలు , చెరువులు , నదులు కబ్జాలు చేసి
ఒక పదును  వానకే  వాగులై వంకలై
నగరాన్ని  సముద్రంలో  ముంచి
సామాన్యుడి  జీవితాల్ని అతలా కుతలం చేసి
వానమ్మా  .... నువ్వు మాకు వద్దమ్మా....
వానమ్మా .... ఇక రాకమ్మా  అంటూ
దొంగ దండాలు  పెడితే పనికి రాదన్నా
నగరాలు  నిలువునా మునిగి పొయ్యే రోజు దగ్గరి  లోనే ఉంది
పంటలు పండే భూములు లేక ప్లాస్టిక్  బియ్యం తినే  రోజు  వస్తోంది
అన్నా ... రైతన్న ల ఉరిత్రాడులు  లెక్క బెట్టండి
నేల  తల్లి  శాపాలు   మనసు పెట్టి వినండి
చెరువు తల్లుల  ఏడ్పుల శోక గీతాల్ని  వినండి
నగరం  నడి బొడ్డున  హుస్సేన్  సాగర్  విష నురగలు కక్కుతోంది
ఇళ్లన్నీ  బురద కొంపలై  కంపు గొడుతున్నాయి
అపార్టుమెంట్లన్నీ  సెల్లార్  కొల్లేరులై  తేలి పోతున్నాయి
ఇక నైనా  కళ్ళు తెరవండి
చెర్వు గట్ల మీద ఇళ్ళు కట్టకండి
నాలాల్ని , కాల్వల్ని, ఏటి  గట్లను   వదలండి!!


(పది రోజులుగా ఎడతెగని కుంభ వృష్టి తో మన నగర జీవితం అతలా  కుతలమైన వేళ  రాసిన కవిత.  ఇదీ  మన నగర జీవన  వ్యధ  కథా  గీతం !!)



Thursday, September 22, 2016

పెద్ద కొడుకు

ఓం గణే శాయ  నమః

----------------------------------------------------------------------------------------

పెద్ద  కొడుకు    

రచన :  వారణాసి  భాను  మూర్తి  రావు 

---------------------------------------------------------------------------------------









అది  తిరుపతి   రైల్వే  స్టేషన్ .

ఎప్పటిలాగే  ప్రయాణీకులతో   రద్దీగా  ఉంది . ఇసుక వేస్తె  రాలనంత  జనం  హడావుడిగా  పరుగెత్తుతున్నారు .  కొండకు వచ్చే  భక్తులతో  రైల్వే  స్టేషన్  కిట కిట లాడుతూ ఉంది . రైలు ఇంజన్ల కూతలతో , మైకుల  ద్వారా అనౌన్సర్ల  ఇచ్చే  సందేశాలతో , లగేజీ  లు  మోసుకొని ' జరుగు , జరుగు ' అని  తోసుకొని  పోయే పోర్టర్లుతో   , వెంకన్నకు  తలనీలాలు  సమర్పించి బోడి గుండులతో  కన బడే  భక్తులతో , ముసలి  ముతకలతో , పిల్లా  జెల్లలతో  చాలా  కోలా హలంగా  ఉంది  .నేను గత ముప్పై  సంవత్సరాల  నుండి  చూస్తున్నా - తిరుపతి  రైల్వే  స్టేషన్ . అప్పుడూ అదే సందడి - ఇప్పుడూ  అదే  సందడి .

నేను బి కామ్ , ఎం  కామ్  చదివింది  తిరుపతి లోనే  ఇరవై  ఏళ్ల  క్రితం . తిరుపతి  రైల్వే  స్టేషన్  అంటే నాకు  వల్ల  మాలిన  అభిమానం . నేను  చదువు  కొనే రోజుల్లో  చాలా  సార్లు  అలా స్టేషన్ లో  వచ్చి కూర్చొని  వచ్చే  పొయ్యే  వాళ్ళను  చూస్తూ  టైం  పాస్  చేస్తూ ఉండే  వాడిని . వచ్చే  పొయ్యే   రైళ్ళను చూస్తుంటే   దైవ దర్శనానికి  తీసుకెళ్ళే  సర్ప రాజుల్లా  ఉంటాయి . కొండకి వద్దంటే  లక్షల్లో  జనాలు తిరుపతికి  వస్తారు . దేశ  విదేశాల నుండి  గూడా వచ్చి   నిరంతరం ఆయన దర్శించు కొంటూనే  ఉంటారు. తిరుపతి  వెంకన్న గొప్పతనం  అలాంటిది .

ఉద్యోగ  రీత్యా  హైదరాబాదు లో స్థిర నివాసమున్నా  , జన్మతః  రాయల  సీమ  వాసిని . తిరుపతి  దగ్గర ఒక పల్లెటూర్లో  పుట్టాను . చదువుకొనే  రోజుల్లో  నెల కోక్కసారి  కాలినడకన  అలిపిరి  గుండా కొండకు  వెళ్ళే  వాళ్ళం . పరీక్షల్లో  పాస్  అయితే తప్పని  సరిగా  తలనీలాలు  సమర్పించు  కొనే  వాణ్ని . దాదాపుగా  ఇరవై  సంవత్సరాల  తర్వాత మళ్లీ  గుండు  చేయించు  కొన్నాను . కళ్యాణ కట్టలో  తల నీలాలు సమర్పించిన  తర్వాత  ఎంతో  ఆత్మ సంతృప్తి కలిగింది  నాకు . నారాయణాద్రి  ఎక్స్ ప్రెస్ రావడానికి ఇంకా ఒక గంట  టైం  ఉంది . శ్రీమతి  నా ప్రక్కనే కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుతొంది. థర్డ్ ఎ సి బోగీ  ఎదురుగా  కూర్చొన్నాము.

వాచీలో  టైం  ఐదు  గంటలు  అవుతోంది .

అంతలో ఒకాయన  పిగిలిపోయి , మాసి పోయిన  తెల్ల పంచె , చిరుగులు  పడిన  తెల్ల  చొక్కా వేసుకొని నా  వైపే  తదేకంగా చూస్తున్నాడు . ఎవరో  బిక్ష  గాడనుకోన్నాను . ఆయన  ముఖం లొట్టలు పోయి  , కళా విహీనంగా  ఉంది . పెదాలు ఎండి  పోయి , చీలి పోయి  నిర్జీవంగా  ఉన్నాయి . క్షుర కర్మ గూడా చేసుకొన్నట్లు లేదు . తల స్నానం లేక తల వెంట్రుకలు దుమ్ము పట్టినట్లుంది . సుమారు అరవై ఏళ్ళ వాడిలా  ఉన్నాడు . కాళ్ళకు  చెప్పులు  లేవు . ఏదో బాధలో ఉన్నట్లు ఉన్నాడు . నన్ను చూస్తూ  అలా ఇలా పచార్లు చేస్తున్నాడు . నేను  అతని వైపే  చూస్తున్నాను .  అతన్ని ఎక్కడో  చూసి నట్లు అన్పిస్తోంది .

'' టైం  ఎంత  సార్ ? '' అన్నాడు  అతను .

'' ఐదు అయింది   '' అన్నాను  నేను  నా ఐదు చేతి  వేళ్ళను  చూపిస్తూ

''హైదరాబాదు  వెళతా  ఉండారా ?''

''అవును ''

''నీ  పేరు  ... నీ  పేరు  మూర్తి  గదూ ? మీ ఊరు  రాస పల్లి  గదూ ? ''సంశయంగా  అడిగాడు  అతను .

''అవును .. నీ  కెట్లా తెలుసు ?'' అన్నాను నేను  ఆశ్చ్యరంగా .

''మీరు కరణాలు ....  సాములు  గదూ ? మీ  నాయన  పేరు కిట్ట  మూర్తి  గదూ ?'' అన్నాడు అతను . అతని ముఖం లో  నవ్వు కన బడింది  నాకు .

నేను  చాలా  ఆశ్చర్యంగా  '' అవును .. అవును '' అన్నాను .

''నేను ... నేను  .. గోవింద  రెడ్డిని  .. సామీ .. గుర్తు పట్టలేదా  ? ఇందాకట్ని  నిన్ను  సూస్తానే   ఉండాను . ఓరి  నీ  ఫాసుంగులా ! గుర్తు బట్ట లేక  బోతా ఉండాను. తమ్ముళ్ళు  , సెల్లెల్లు అంతా  బాగా ఉండారా  సామీ !''అన్నాడు  ఆప్యాయంగా ఆ  ఆసామీ .

 నా దగ్గర కొచ్చి  నా రెండు  చేతులూ  పట్టు కొన్నాడు  పట్టలేని సంతోషంతో

''నువ్వు ... గోవింద రెడ్డివా ..ఇక్కడ  ఏం  చేస్తున్నావు ?'' అన్నాను నేను  లేచి  నిలబడి .

''నేనా ...నేను .. ఈ  టేషన్ లో  అడుక్కొని  బతుకు  తుండాను   సామీ !'' అన్నాడు  అతను  వచ్చే  దుఃఖాన్ని  ఆపుకోంటూ .

''ఎమిటి ...  యాభై  ఎకరాల  భూస్వామి  అడుక్కొని  తింటున్నావా ?నీ  కెందుకీ  అగత్యం పట్టింది ?'' అన్నాను  నేను  చాలా ఆశ్చర్యంగా .

అతని  కళ్ళల్లో  కన్నీళ్ళు  సర్రున క్రిందకు  జారాయి .

''సామీ ! మీరంతా సదువు కొనేటప్పుడే మనూరు బాగుండే ! మీ తాత కరణం పని  సేసేటప్పుడే మనూరు  సల్లగా ఉండేది .ఎవరికి అన్నాయం  సేసే వోడు  గాదు  మీ  తాత . కరణాల పని మీ దగ్గర నుండి పీకేసి నప్పటి నుండి మన  ఊరికి దరిద్రం సుట్టుకోనింది .  ఇప్పుడుండే  కరణానికి లెక్కలు రావు . గొలుసు పట్టుకోని  సర్వే సేసే దానికి  రాదు . ఏ  భూమి  ఏ  సర్వే నంబర్ లో ఉండేది  అసలు  తెలీదు . మళ్ళి  కరణం  సాముల్నే  పిలిపించు కోవల్ల . మన పబుత్వం  చాలా తప్పు పని చేసింది  కరణాలను  ఊడబెరికి .'' అన్నాడు  గోవింద  రెడ్డి  ఆవేశంగా .

అవును , అప్పటి  ప్రభుత్వం  మండలాలుగా  విభజించి , అధికార  వికేంద్రీ కరణ  చేసింది  కొన్ని నూతన సంస్కరణలు  చేబట్టింది . ఆ  దశలో కరణీకాల్ని , మునసబుల్ని  రద్దు  చేసి  చాలా  కాల మయింది . ఇప్పుడు  కరణాలుగా ఎవ్వరూ లేరు . ఉన్న కరణీ కాలను పోగొట్టుకొని చాలా  మంది అగర్భ  దరిద్రంతో  మరణించారు . కొంత  మంది  కొత్తగా నియమింప బడ్డ ఆఫీసర్ల  దగ్గర జీతానికి  పని  చేస్తున్నారు .అదంతా పాతికేళ్ళ ముందు మాట . మా తాత గారు గూడా కరణీకం పోయిందనే  దిగులతో మరణించారు  . అదృష్టం గొద్ది మా  నాన్న  చదివించాడు  గాబట్టి , నేను  పెద్ద  ఉద్యోగంలో  ఉన్నాను

''సరే... .గతం గతః .. గోవిందరెడ్డి .. నువ్వు బాగా బతికిన రైతువు  గదా .. ఎందుకిలా  ఈ  రైల్వే స్టేషన్  లో  అడుక్కొంటున్నావు ?''అన్నాను  నేను .

గోవింద రెడ్డి ఈ సారి రెండు చేతులు ముఖానికి కప్పుకొని ఏడ్సేశాడు .

'' నీకు తెలుసు  గదా  సామీ ... నాకు ముగ్గురు కొడుకులు , ఇద్దరు  కూతుళ్ళు . అందర్నీ  నా సక్తి  కాడికి బాగా  సదివించా . కూతుళ్లకి  లచ్చల్లొ  కట్నాలిచ్చి  పెళ్ళిళ్ళు  సేసినా ! పెద్దోడు  అమెరికా పోవల్లని  పది ఎకరాలు అమ్మేసి  ఎల్లిపాయే . రెండవ  కొడుకు  పది ఎకరాలు  అమ్మేసి  దుబాయి  లో  యాపారం  సెయ్యల్లని ఎల్లిపాయే . ఇగ మూడవ వాడు  పెళ్ళాం మాటలు ఇని పది  ఎకరాలు  రాయించ్కొని మదన పల్లి లో వేరే కాపురం పెట్టినాడు . ఇగ  ఉండే  ఇరవై ఎకరాలు దస్తావేజులు బాంకులో పెట్టి  ఐదు  లక్షలు అప్పు  చేసి  కూతుళ్ళ  పెళ్లి  సేసినాను . ఆ అప్పు  తీర్చే  స్తోమత  లేక బాంకొల్లు వేలం ఏసి భూముల్ని  అమ్మేస్తా మంటా ఉండారు సామీ ! ఆ  దిగులతో  నా  బార్య  సచ్చెపాయ . కొడుకు  లెవ్వరూ  ఒక రోజు పిలిసిన  పాపాన  పోలేదు . ఒక రోజు అయినా పిలిచి  అన్నం  పెట్టలేదు . ఈ  వయసులో  ఇంత  బతుకూ  బతికి అడుక్కొనే స్తితికి  దిగజార్సినారు సామీ నా కొడుకులు... దొంగ  నా  కొడుకులు .. థూ .. వాళ్ళది ఒక బతుకేనా ?'' అన్నాడు  గోవింద రెడ్డి  చాలా బాధగా .

''బాంకులో తీసుకొన్న పైకం  ఏమైనా  తిరిగి  చెల్లించావా ?'' అడిగాను నేను .

''నాకు  ఆదాయం  ఎక్కడిది  సామీ ? ఏసిన పంటలు  అట్లనే ఎండిపోతాయి . వానలు  లేవు . పంటలు  లేవు . రాయల సీమ లో రైతులు చాలా  కట్టాల్లో  ఉండారు . సేనిక్కాయల  పంట  సరిగా  జూసి  పదేళ్ళు  అయితా ఉండాది . మళ్ళు  సుద్దామంటే నీళ్ళు  ఉంటే  గదా పండే దానికి . బాంకోళ్ళు  అసలు , వడ్డీ  కట్టక పొతే  భూముల్ని జప్తు  చేసి , అరెస్ట్  గూడా సేస్తామంటున్నారు . ఎకరా  భూమి  అమ్ముదామంటే  కొనే  నాథుడే  లేడు . ఊరికే  ఇస్తే  గూడా తీసు కోనే  వోళ్ళు  లేరు సామీ ''  అన్నాడు  గోవింద  రెడ్డి .

అవును  . గోవింద  రెడ్డి  చెప్పింది  అక్షరాలా  నిజం . వర్షాలు పడక , భూమిలో నీళ్ళు లేక  భూములన్నీ  బీడు బట్టి  ఎడారుల్లాగా  మారి పోయినాయి . గిట్టుబాటు  లేక రైతులు  సేద్యం  చెయ్యడం  మానేశారు .పిల్లలు  కాస్తో  కూస్తో  చదువుకొని  ఊరొదిలి  వెళ్ళి పొయ్యారు . ఇప్పడు  ముసలి ముతక తప్ప  పల్లెల్లో  ఎవరూ  ఉండడం  లేదు . పల్లెలన్నీ స్మశానాల్ని తలపించే  విధంగా  ఉంటాయి  రాయల  సీమ లో .

'' బాధ పడితే  మనం  చెయ్యగలిగింది  ఏమి లేదు  గోవింద  రెడ్డి '' అంటూ మా  శ్రీమతికి  గోవింద  రెడ్డి ని పరిచయం చేశాను .

''బాగున్నారా ?''  అంది  మా  శ్రీమతి .

''ఏమి  బాగో  ఏమో అమ్మా ... సామికి  తెలుసు  మా బాగు ..పిల్లొల్లంతా  బాగుండారు  గదా అమ్మా ?''


గోవింద  రెడ్డి కథ  విన్న తర్వాత ఆయన దైన్య స్థితికి నా మనస్సు అల్ల కల్లోలం  అయింది . అలజడి తో నా కళ్ళళ్ళొ నీళ్ళు సుడులు  తిరుగుతున్నాయి . పైకి  ఉబికి  వచ్చే కన్నీళ్లను  ఆపుకొనే  ప్రయత్నం  చేస్తున్నాను .

గోవింద రెడ్డి నన్ను చిన్నపుడు వీపు మీద ఎక్కించుకొని ఆట లాడించే  వాడు . నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం .
మహల్ కో , కలకడ కో వెళ్ళితే నా కోసం  స్వీటో , ఫలమో  తీసుకోని  ఇచ్చే వాడు . మా నాయన  క్లాస్ మేట్ గోవింద రెడ్డి .
అందుకే నేనంటే అంత ఇష్టం ఉండేది . వాళ్లింట్లో కారాలు , సుట్టలు , పప్పు బిళ్ళలు , పాగం పప్పు  లాంటి   అప్పచ్చులు చేసినా నా  కిచ్చే  వాడు . కనుమ పండుగ  రాజయితే  దోసెలు , సేనిగ్గింజల ఊరిమిండి వేసి ఆప్యాయంగా  తిని పించే వాడు .


భగవంతుడు  ఎంత పక్ష పాతి ? రెక్కలు ముక్కలు  చేసుకొని  ప్రతి క్షణం కన్న బిడ్డల కోసం  ఆరాటపడి , వాళ్ళ  అభ్యున్నతి  కోసం  పాటుపడే తల్లి తండ్రులను నిర్దాక్షిణ్యంగా  వదిలేస్తారే  కడుపున  పుట్టిన  పిల్లలు. పసివాళ్ళుగా  ఉన్న  పిల్లలు  పెద్దయ్యాక  తల్లి తండ్రులకే పగ వాళ్ళుగా  ఎందుకు  మారుతారో ?

చదువు  ఉన్నదనే  ఆహంకారమా ?డబ్బున్నదనే  అహంభావమా ?తల్లి తండ్రి  నిరక్ష రాస్యులే కావచ్చు . భూమిని నమ్ముకొన్న  రైతు  బిడ్డలే  కావచ్చు . మొరటు  వాళ్ళే  గావచ్చు .  కాని  రక్తం పంచుకొని  పుట్టిన  బిడ్డలే  ఈసడించు కొంటే  వారి  గతి  ఏమి  కావాలి ? ప్రతి  రక్తపు  బొట్టు  వారి  శ్రేయస్సు కే  ధారపోసిన  తల్లి తండ్రులకా  ఈ  దురవస్థ ? నడి  రోడ్డులో  అనామకుడిగా , నా అనే వారు లేక , దిక్కు మొక్కు లేక  యాచకుడిగా  మారిన  గోవింద రెడ్డి లాంటి వారి  పరిస్థితి  ఏమిటి ? జన సంబంధాలన్నీ  ధన  సంబంధాలేనా ??

నా గుండె వేగంగా కొట్టు కొంటుంది  .  నా కళ్ళల్లో  నీళ్ళు  తిరుగుతున్నాయి . గోవింద  రెడ్డి ని పిలుచుకొని పోయి పళ్ళు , బిస్కేట్లు , నీళ్ళ  బాటల్  కొనిచ్చాను . పర్సు  లోంచి  తీసి  ఒక  ఐదు వందల  రూపాయల  నోటు  చేతిలో  ఉంచాను . మొహమాటంగా  అతను  వద్దన్నా  జోబిలో  నోటును  కుక్కినాను .

'' గోవింద  రెడ్డి ! నువ్వేమీ  భయ పడ  వద్దు . బాంక్  వాళ్ళతో  మాట్లాడి , నీ  భూమిని  విడిపించే  మార్గం  ఆలోచిస్తాను .
హైదరాబాద్  కెళ్ళి డబ్బు  విషయం  చూస్తాను . నిన్ను  మళ్లి పాత  గోవింద రెడ్డి గా  చేస్తాను '' అన్నాను నేను .

''సామీ .. నా  పెద్ద కొడుకు గూడా  ఇంత  దైర్నం  చెప్పలేదు  నాకు ''అని నా  రెండు  చేతులు పట్టుకొని ఏడ్చినాడు  గోవింద  రెడ్డి .

                                                          ******************

ఆంధ్రా  బాంక్  హెడాఫీసు లో  నా  ఫ్రెండ్ ఒకడు  జిఎమ్  హోదా లో పని చేస్తున్నాడు . వాడితో మాట్లాడి కలకడ  బ్రాంచి కి  ఫోన్  చేయించి నాను . గోవింద  రెడ్డి  కట్ట వలసిన అప్పు వడ్డీతో  సహా  అన్ని మినహాయింపులు పోను రూ . 268311/- అన్నారు. నేను  నా అక్కౌంట్ నుండి  డ్రా చేసి  డిమాండు డ్రాఫ్టు ద్వారా కలకడ  బ్రాంచ్ కి పంపించాను .  గోవింద రెడ్డి అప్పు  క్లియర్  అయింది .

ఇరవై  రోజుల తర్వాత గోవింద  రెడ్డిని కలకడ కి రమ్మని చెప్పి , నేను  బస్సులో  కలకడలో  దిగినాను . గోవింద  రెడ్డి కి  సంబంధించిన తనఖా  పత్రాలన్నింటిలో సంతకాలు  చేయించి , భూమికి  సంబంధించిన  దస్తా  వేజులన్నింపంటలు టిని విడిపించి ఇప్పించి నాను . గోవింద  రెడ్డి  సంతోషానికి అవధులు లేక పోయింది . ఇరవై  ఎకరాల  భూమి  అతని  స్వంతమయింది .
'' గోవింద రెడ్డి .. నువ్ ఇక  తలెత్తు కొని ఊర్లో తిరగాలి . మునపటి లాగా  పెద్ద రాయుడి లా బతకాలి . నేను వ్యవసాయాధి కారులతో మాట్లాడి  నీకు విత్తనాలు వగైరా  సబ్సిడీ తో ఇప్పిస్తాను . అలాగే  స్ప్రిం క్లర్ ఇరిగేషన్ తో నువ్వు  సేద్యం
 చేద్దువు  గానీ !'' అన్నాను నేను .

''నువ్వు  వెయ్యేళ్ళు బతకాలి మహారాజా '' అని దీవించాడు  గోవింద రెడ్డి

                                                           *****************

అనుకోన్నట్లుగానే  గోవిందరెడ్డి  తన పొలంలో టమోటా ,వంకాయ , బెండ కాయ , గుమ్మడి  లాంటి  కూరగాయలు , తమల పాకులు , అరటి తోటలు పెంచ సాగాదు.  బోర్ వేసిన  వేళా  విశేషమో  ఏమో గాని , నీళ్ళు  బాగానే పడ్డాయి .  సూక్ష్మ సేంద్రియ  విధానంతో మంచి వాణిజ్య పంటలు పండించ సాగాడు . ఊర్లో  మళ్ళి  గోవింద రెడ్డి  పరపతి  బాగా పెరిగింది . పది మంది  కూలీలు వద్దంటే  పలుకు తున్నారు . అంతా డబ్బు మహిమ . నేను అప్పుడప్పుడు  వ్యవసాయ  అధికారులతో మాట్లాడి సాగు లోని  మెలుకువ లన్ని తెలుసుకొని , తగిన జాగ్రత్తలు  అన్ని చెప్పి,  మంచి దిగుబడి వంగడాలను  చెపుతూ  గోవింద  రెడ్డిని ఒక  ఆదర్శ రైతు గా తీర్చి దిద్దినాను ఒక్క సంవత్సరంలో . మదన పల్లి, తిరుపతి ,బెంగుళూరు  మార్కెట్  లలో  వచ్చిన  దిగుబడి నంతా  అమ్మ వలసిందిగా , దానికి  కావాల్సిన  వనరులన్నీ  సరి  చేసి పెట్టాను .  ఒక చిన్న ఆటో ట్రాలీ కొనుక్కోవడానికి  పాతిక వేలు పంపించాను .
                                                          ****************
ఒక్క సంవత్సరం తర్వాత
ఆ రోజు  శని  వారం . ఉదయం  ఏడు  గంటలు
హాల్లో  కూర్చొని , పేపర్  తిర గేస్తూ  , కాఫీ  తాగుతున్నాను .
ఇంతలో  కాలింగ్  బెల్లు  మ్రోగింది . తలుపు తెరచి  చూశాను .
చక్కని నాణ్యమైన గ్లాక్సో పంచె , కద్దరు  చొక్కా , మీద ఒక  కండువా   , కొత్త  చెప్పులు వేసుకొని ఆకర్షణీయంగా పరిశుభ్రమైన  శరీరంతో వాకిట్లో  ప్రత్యక్ష  మయ్యాడు  గోవింద  రెడ్డి .

గోవింద  రెడ్డి  ని  చూసి  ఆశ్చర్య  పొయ్యాను  నేను . అనుకోకుండా  వచ్చిన  అతిధి ని  చూసి  లోపలికి రమ్మన్నాను .
'' సామీ .. బాగుండారా !'' అన్నాడు .పెద్ద  సిమెంట్ గోనె  సంచి  నిండుకు కూరగాయలు , అరటి గెల , పూలు , పళ్ళు ,   స్వీట్లు  బాక్స్ తో ప్రత్యక్ష  మయ్యాడు  గోవింద రెడ్డి .

'' ఇవన్నీ  మన  తోటలో  పండినవే !'' నవ్వుతూ  అన్నాడు  గోవింద రెడ్డి .

శ్రీమతి  ఆశ్చర్యంతో  గోవింద రెడ్డి వంకే  తదేకంగా  చూస్తూ  ఉండి పోయింది .

'' నీ  దయ  వల్ల  మళ్ళి నేను  నిల  దొక్కు  కొన్నాను  సామీ !'' 

'' సరే .. ఇలా సడెన్  గా   వచ్చేసావేమి ? '' అని అడిగాను .

''నిన్ను  సూడల్లా అని అన్పించింది .వచ్చేశాను . '' అన్నాడు  గోవింద రెడ్డి .

ఇంతలో  గోవింద  రెడ్డికి కాఫీ  తెచ్చి  ఇచ్చింది  శ్రీమతి .

గోవింద రెడ్డి వెంటనే  ఇంకొక  మూట  విప్పి , అందులోని  కాగితాల  సొరుగులో  దాగిన  నోట్ల  కట్టల్ని  బయటకి  తీసి టీ పాయి మీద  ఉంచాడు .
'' ఏమిటది  గోవింద రెడ్డి ?'' అన్నాను నేను .

''ఈ సారి అరటి కాయల పలసాయం  బాగా కలిసొచ్చింది . రేటు గుడా  బాగా పలికింది . బెంగుళూరు లో అరటి లోడ్లు అమ్మేసి వస్తా ఉండాను . నాలుగు లక్షలు వచ్చింది . నీకు  ఇవ్వాల్సిన పైకం వడ్డీ తో సహా ఈ నాలుగు లక్షలు  తీసుకోండి.''
అన్నాడు కృతజ్ఞతా  భావంతో  గోవింద రెడ్డి .

నా ఆశ్చర్యానికి  అంతే లేకుండా పోయింది . భూమి తల్లిని నమ్ము కొన్న  వాడు  ఎన్నటికీ  చెడిపోడని పెద్ద  వాళ్ళు  ఊరికే  అనలేదు .
'' నువ్వు నా కివ్వ వలసిన  పైకం 268311/- రూపాయలు మాత్రమే . వడ్డీ   నేను  తీసుకొను  '' అని అన్నాను  నేను .
అతనిచ్చిన డబ్బు నంత వరకే  లెక్క బెట్టి , మిగిలిన దంతా  జాగ్రత్తగా  కాగితాల్లో  చుట్టి పెట్టి గోవింద రెడ్డి కి  వాపసు చేసినాను .
గోవింద రెడ్డి  ఏమనుకోన్నాడో  , ఏమో గానీ  నా పాదాలకు  నమస్కరించ బోయ్యాడు .
'' నా తండ్రి  లాంటి  వాడవు , నా కేల  నమస్కారం  చేస్తావు ?'' అన్నాను నేను  అతన్ని  వారిస్తూ .

'' ఈ  రోజు నుండి  నువ్వే  నా  పెద్ద  కొడుకువి సామీ  !' అన్నాడు
.
ఆయన  గొంతులో మాటలు పెగలడం  లేదు . రుమాలుతో  కళ్ళను  ఒత్తుకోంటూ  బయలు  దేరాడు  గోవింద రెడ్డి .
---------------------------------------  The  End ---------------------------------------------------------------------


pratilipi  bhavagiti kathala poti-- got a special prize. 6000 readers and  100 comments stood highly regarded by readers as the best social story.




Tuesday, September 13, 2016

మనం కవులమా ?

మనం  కవులమా ?

------------------------------------------------------------

మనం మనుషులమా ?
మనం  కవులమా??


భార్య  శవాన్ని  పది మైళ్ళు  మోసుకెళ్లిన  నిర్భాగ్యుని   అసహాయతను చూసి గూడా
ఉలిక్కి పడని  ప్రజా స్వామ్య దేశపు  బూటకాన్ని  ఎండ గట్టే కవిత్వం  రాదేంటి  ? ?

డబ్బుల్లేని  గర్భిణీ    కాలి  నడకన  చేరి  ఆసుపత్రి గేటు బయట
ప్రసవిస్తే  ఆ మాతృ మూర్తి  వేదన కవిత్వమై బయటకు రాదేంటి ??

మృగాలాంటి మనుషులకు  వత్తాసు పలికే
రాజకీయ నాయకుల  ద్వంద వైఖరిపై  దుమ్మెత్తి పొసే  కవిత్వం రాదేంటి ??

మతం ముష్కరుల  మరణ హోమం లో  సమిధలై పోతున్న
నానా జాతీయుల బాధా  సర్ప ద్రష్టల  ఆక్రందనలు  కవిత్వమై రాదేంటి ??

అడ్డమైన లెక్కలతో  కోట్లాది జనాల కష్టార్జితాన్ని బడా బాబులు  దిగ మింగుతుంటే
కడుపు నిండని అన్నార్తుల ఆకలి మంటల మీద కవిత్వం రాదేంటి ??

కవుల్లారా
కనులుండి నిజాల్ని  దాచి
అబద్దాలను  రాస్తున్నారా ??

సన్మానాలకోసం , శాలువలకోసం , చప్పట్ల  కోసం
అడ్డమైన  కవిత్వాల్ని    రాస్తున్నారా  ??

ఒక్క సారి  జనం కోసం జన్మ నెత్తిన
మహా కవులు  ఏమన్నారో  వినండి !

కవులు నిజాల్ని రాస్తారు
కవులు  జీవితాల్ని  రాస్తారు
కవులు  కన్నీళ్ల  సిరాతో  కవిత్వాన్ని రాస్తారు
కవులు  దరిద్రులయినా  మంచి కవిత్వం రాసి  మహా రాజులవుతారు
కవులు  జనం కోసం  మరణిస్తారు !!



12. 09. 2016








Thursday, July 28, 2016

ప్రస్థానం

ప్రస్థానం
---------------------

నలిగిన , నలిపిన
చింపిన, చించిన
పగిలిన , పిగిలిన
ఒక  వస్తువు ...   విపణి వీధిలో ....
ఒక అంగడి బొమ్మ
నిన్నటి వరకు
ఆడుతూ , తూలుతూ
అందమైన  లోకాన్నీ
అందులోని  ఆర్ణవాన్ని
మాత్రమే  తెలుసు కొన్న  పిచ్చిపిల్ల !
రంగుల  అద్దాల  వెనుక
దాగిన  కలల  ప్రపంచం
రేపటి తన  ఆశల్ని  విస్కీలో  కలిపేసింది
తనకు' రేపు '  గురించే  తెలుసు !
'రేప్'  గురించి అసలు తెలీదే !
కొంత మంది  అమ్మలకు పుట్టిన వాళ్ళు గాదు
కొంత మందికి అప్ప చెల్లెళ్ళ  గురించి అసలు తెలీదు
ఆ  రాక్షసులు   అమ్మ స్తన్యం లో  కామాన్ని తాగి బతికారు
అప్ప చెల్లెళ్ళ  అనురాగాలు మరచి  రొమాన్స్ రౌడీల్లా  తెగ బలిశారు
ఆడతనానికి  వక్ర  భాష్యాలు చెపుతూ  వీధి కుక్కల్లా  విర్ర వీగారు
అన్నయ్య  ల  అనుబంధమే తెలిసిన   ఆ చిన్న తల్లి
గ్యాంగ్ రేపుల  సైకో గాళ్ళ కాళ్ళ  క్రింద  పువ్వై  నలిగి పోయింది
ఇపుడు  చిన్నారులకు కావాల్సింది  కాన్వెంట్ పాఠాలు గాదు
సాఫ్ట్ స్కిల్స్  గాదు , సరిగమలు గాదు  , కూచి పూడి  గాదు
పులి తోలు కప్పుకొన్న నల్ల నక్కల  బిహేవియర్  స్టడీ చెయ్యాలి
అర్థ రాత్రి బెడ్ రూమ్ లో  తన వంటి  మీద పారాడు తున్న మగ  చేతుల్ని నరకాలి
వావి వరసులు మరచి మర్మ స్థానాన్ని  తడుముతున్న మామయ్యల ముఖం మీద ఆసిడ్ పొయ్యాలి
తొడ పాయసాలు పెట్టే  గురువుల  కళ్ళు పొడవాలి
స్నేహం పేరుతొ  బాడీ మాసాజ్ లు చేసే బాయ్ ఫ్రెండ్స్ ని చర్ల పల్లి జైలు  కి చేర్చాలి
వెకిలి చేష్టలు చేసే అంకుళ్ల  బట్ట తల మీద నిప్పుల కుంపటి బోర్లించాలి
ప్రతి  చిన్నారీ  అఘోరాలా  మదాంధుల  శవాల మధ్య  తపస్సు చెయ్యాలి
తల్లు  లారా !  ప్రతి  అమ్మాయికి  అ , ఆ  లతో పాటు అకృత్యాలు , అఘాయిత్యాలు  గురించి చెప్పండి
ఏబీసీడీ  తో పాటు  మృగాళ్లను  కని  పెట్టడం ఎలా  అని  నేర్పించండి
అందమైన  లోకంలో  బ్రహ్మ  జెముడు చెట్లున్నాయని చెప్పండి
అమాంతం నోట్లోకి  లాక్కొనే  విష పుష్పాలు  ఉన్నాయని  చెప్పండి
అంతే  గాదు  ...   కార్నివోరౌస్  లాంటి చెట్లు  మన మధ్య తిరుగుతూ ఉంటాయని చెప్పండి !
ఒక  నవ ప్రస్థానానికి  దారి  చూపండి !!








Saturday, July 16, 2016

కవి హృదయం

కవి  హృదయం


కవి అన్న వాడు సర్వములు తెలిసిన వాడు.  విశ్వ మానవుడు.  విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణినీ , మనుషులయినా , జంతువు అయినా,  చెట్లు చేమ లయినా  ప్రేమించే  మనస్త్వత్వం  కలిగిన   విశ్వ ప్రేమికుడు.  అపుడే జరిగినసంయోగంలో ఫలదీకరణం చెందిన చిన్న అణు మాత్రమయిన పిండాన్ని , తొమ్మిది నెలలు అది పడే బాధల్ని , ఆనందాల్ని  గురించి రాయ గలిగిన వాడు కవి . చెట్టు కొమ్మల్లో ఎక్కడో విరగ బూసిన  పుష్పాన్ని , అందులోని మకరందాన్ని  జుర్రు కొనే  భ్రమరాన్ని , పర పరాగ  సంపర్కాన్ని  రాయ  గలిగిన  వాడు కవి. వెయ్యి సంవత్సరాలకు ముందు , వెయ్యి సంవత్సరాల  తరువాత  గూడా , తన అంతః  దృష్టి  తో  భావ ప్రకంపనాల్ని  కురిపించగలిగిన   మహాత్  భాగ్యాన్ని  కలిగిన  మహా జ్ఞాని  కవి. మట్టి మనసులో దూరి  మట్టి ఆవేదనను విన గలిగే  శక్తి ఉన్నవాడు కవి. రంపపు కోతకు బలి అయ్యే చెట్ల  తపనను , మానవుల  స్వార్థానికి బలి అయ్యే జంతువుల  ఆవేదనను  విని కవి హృదయంతో  దుఃఖించే వాడే కవి. పుష్ప విలాపం , జంతు విలాపం, అభాగ్య జీవుల విలాపం....  ప్రపంచంలో  పీడిత తాడిత బాధా సర్ప ద్రష్టల  విలాపాన్ని  ఎపుడు విన గలిగిన వాడే కవి..

నేను పబ్బుల్లో  తిరుగుతున్నా
నేను  క్లబ్బుల్లో  తిరుగుతున్నా
విచ్చల విడి శృంగార  చేష్టలల్లో పాల్గొన్న గుంపుల్ని  చూస్తున్నా !
కానీ నా కంటికి   కనిపించేవి అవి ...
నా  కవి కంటికి కనిపించే  బొమ్మలు వేరే ...
ఎండిన పెదాలను లిప్ స్టిక్ తో పూసుకొని రసిక ప్రియులకు
క్యాబరే డాన్స్ లు చేస్తూ  బలుపెక్కిన    బండ రాళ్లకు బలి అవుతూ
స్తన్యం కోసం బరువెక్కిన  బ్రాలు   ముక్క లవుతున్నా
సొమ్ము సిల్లి , కళ్ళు తిరిగిన  గుక్క పెట్టి ఏడుస్తున్నచిన్నారులకు
 ఏమని జవాబు చెప్పగలదు ఈ  డాన్సర్  అమ్మ ?
అమ్మ కాదు ...  అందాల బొమ్మ
జీతాల మాటున దాగిన జీవితాలు
అసత్యాలు మాటున దాగిన సత్యాలు
లేరా  మీకు అమ్మలు ?  లేరా మీకు అక్కలు ??
అయ్యల్లారా  ! వదలండి ...
చిన్నారులకు  చను  బాలు  త్రాగించి  వచ్చే వరకు ఆగండి !

ఇలా  కవి హృదయం  ఆక్రోశిస్తుంది ! కవి హృదయం మీద  మళ్ళీ ఎప్పుడయినా రాస్తాను

Tuesday, June 28, 2016

ఆమె ఒక సంచలనం !

ఆమె ఒక సంచలనం !
---------------------------------

ఎన్ని సంచలనాలో!ఎన్ని పరివర్తనాలో!!
కాస్సేపట్లో  సూర్యుడు  దుకాణాన్ని మూసేస్తాడని
చీకట్లో  అలిగిన  రాత్రి  ఆమె కౌగిట్లో  కరిగి పోయింది
ఆమె నవ్వుల కాంతిలో  వసంతం వాడి పోయింది
ఆమె కురుల నుండి  విరుస్తున్న  సుగంధికా  వీచికలు
మలయ మారుతాల లయ మార్చి వాకిట వెను  తిరిగాయి
ఆమె  కుచ ద్వయం  పూర్ణ కుంభాన్ని వెనక్కు నెట్టింది
ఆమె తనువు  సంచలనాల హరి విల్లు
ఆమె  చుట్టూ పరిభ్రమిస్తున్న వినీల కాంతులు  చంద్ర కాంతిని కరిగించాయి 
ఆమె  ముగ్ధ  , మధ్య , ప్రౌఢ 
ఆమె  ధీర , లలిత , ఉదాత్త , నిభృత 
ఆమె  స్వాధీన పతిక , వాసవ సజ్జిక , విరహోత్కంఠిక, విప్రలబ్ద , ఖండిత 
కలహాంతరిత , ప్రోషిత భర్తృక , అభిసారిక 
ఆమె శృంగార  రసాలంభన  విద్యుల్లత ! 










Monday, June 6, 2016

డెత్ మాట్రిక్స్

డెత్ మాట్రిక్స్
-----------------------------------------

నాకు తెలియక  నన్ను నేను
ఒక  సూర్యాస్తమయం   ఆపాలని
సముద్ర కెరటమై  ఎగురుతున్నా
గుల్లలై      గవ్వలై
ఆ మెడిటేరియన్  మహా సముద్రం బీచ్ లో
నా ఆశల్ని  ఆసాంతం  ఏరుకొంటున్నా
బిందువు లా  ముందుకు వస్తున్న
ఆ నావ    ఎన్ని జీవితాల్ని  మోసుకోస్తుందో
ఒక జాతి  వేదన  తుప్పు  పట్టిన  ఓడ లా
దేశపు  హద్దుల్ని దాటి
పరాయి దేశపు  గడ్డ వైపు  కాళ రాత్రిలో ప్రయాణిస్తూ
సముద్రమే  భీకర జీవన సమరమై
అంతు లేని  బాధా సర్ప  ద్రస్టులై
ఒక్క సారి  పడి  లేచిన  కెరటం ఆ  నావను లాక్కొని
సాగర గర్భాన్ని  చేర్చిన వేళ
విగత  జీవులై  చిన్నారుల  ఆక్రందనలు
చెల్లా చెదురైన  శవాలు
కకా  వికలమైన  జీవితాలు
తీరానికి  చేరలేని  నిస్సహాయ  నిర్భాగ్యులు
కలల సౌధాలు ఒక్కసారిగా కూలిపోతే
ఇది ఏ దేశం చేసుకొన్న కర్మ ?
ఇది  ఏ దేశం  రాసుకొన్న  మరణ వాజ్ఞులమ్ ?
ఇది  ఏ దేశం  రచించిన  ద్వంస కాండ ?
హింస రచన లో  బలి  అయిన  అమాయకులకు
ఏ తీరం  జవాబివ్వగలదు ?
తీరానికి  కొట్టుకొచ్చిన  పసి పిల్లాడి శవాలకు
ఏ మతం జవాబివ్వగలదు ??

06.06. 2016



Sunday, May 15, 2016

కొనకంచి గారి తో కొన్ని క్షణాలు

కొనకంచి  గారి తో  కొన్ని  క్షణాలు
----------------------------

''గుడ్  మార్నింగ్  సర్ ''

ప్రొద్దున్నే  మా ఇంటి దగ్గరే ఉన్న పార్కులో  వాకింగ్  చేస్తున్నపుడు , ఒక  సన్నని  స్వరం  పలకరించింది . ఆశ్చర్యంగా  ఆ వ్యక్తీ వైపు చూశాను  . మృదువైన  కంఠం , కళ్ళల్లో  ప్రస్పుట మవుతున్న వెలుగు , సాదా సీదా  గా  కన బడుతున్న విగ్రహం , తెల్లని  గుబురు గడ్డం   , సంస్కారం  ఉట్టిపడుతున్న  ఆయన  బాడీ లాంగ్వేజ్  కన బడు తున్నాయి . నాకు అతనిలో  ఒక రవీంద్ర  నాథ్  టాగోర్  ని  చూసి నట్లుంది

''మీరు ... మీరు... ''

ఒకే ఒక్కసారి  కలిసి నట్లు గుర్తు .  కవి సంగమం లో కలిసి నట్లు  లీలగా  జ్ఞప్తికి  వచ్చింది .

''నేను  కొనకంచి ని అండీ ''

నా ఆనందానికి అవధులు లేవు .

''గ్లాడ్  టు  మీట్  యు  సర్ . నేను  భాను మూర్తి  ని ''

పరిచయాలు  అయ్యాక , అయన  తన కవితా  ప్రస్థానం  వైపుకు వెళ్ళింది  చర్చ . ఆయనకు  ఉన్న   జ్ఞానానికి , కవిత్వం పట్ల  ఉన్న  ఆయనకు  ఉన్న మక్కువ , ధ్యాస,  commitment , dedication  అన్ని  నాకు  కొన్ని  క్షణాల్లో   నే  అర్థం  అయ్యింది .

''నేనేమీ   మాట్లాడను ''అంటూనే  అనంత మైన  ఎన్నో తెలియని విషయాలను  అతని మాటల్లో  తెలుస్తుంది  మనకు. అయనకు  ఒక  సబ్జెక్టు మీద  వున్న నిర్దిష్ట మయిన , కచ్చిత మైన అబిప్రాయం  , ముక్కు సూటిగా  పొయ్యే  మనస్తత్వం  ఉండడం  వల్ల నిజంగా అతన్ని ఒక  విశిష్ట మైన వ్యక్తీ  గా నిలబెడతాయి .

' రెక్కల పులి '  తన  కవితా ప్రస్థానం లో  ఒక  మైలు  రాయి  వంటిది  అని ఆయన  అన్నపుడు  నాకు వొళ్ళు పులకరించింది . ఎందు కంటే  ఒకే  సబ్జెక్టు మీద  దీర్ఘ కవిత  రాయడం  నిజంగా  గొప్ప విషయం  .

''మీ ' మంత్ర లిపి ' పుస్తకం చాలా  బాగుందండి .పాఠకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది '' అన్నాను నేను .

ఆ మరుసటి రోజు  తన పుస్తకాన్ని నాకు ప్రెసెంట్ చేసారు కొనకంచి గారు. నేను నా ' సముద్ర ఘోష ' ,' సాగర మథనం ' తనకు ఇచ్చాను .

గానీ  నేనా పుస్తకాన్ని ఇది వరకే  బుక్ ఎక్సిబిషన్లో కొన్నాను . చదవడం గూడా  జరిగింది .

మన రెండు తెలుగు  రాష్ట్రాల్లో  ను  ' కొన కంచి గారి కవిత్వానికి  హారతులు పట్టే  పాఠకులు  కో కొల్లలు ఉన్నారు .

కొన  కంచి గారికవిత్వాన్ని  అర్థం చేసుకోవడం చాలా కష్టం . పది వాక్యాల్లో  కవితల్ని ముగించేసి  కవిత్వాన్ని చేసే వాళ్లకు విభిన్నంగా  కొన కంచి గారి   కవిత్వం  ఒక ప్రవాహం లా  ముందుకు  వురికి పోతూనే  ఉంటుంది . ఒక్కొక్క సారి  ఉప్పెన  వచ్చిన  కెరటాల్లాగా , ఇంకొక సారి జల పాతం  లోకి ఉరుకు తున్నట్లుగా  పాఠకుల్ని   ఉరుకులు , పరుగులు  పెట్టిస్తుంది .

కొనకంచి గారి  కవిత్వాన్ని  గురించి  చెప్పడం  నాకు ఒక సాహసమే  అని చెప్పవచ్చు.   వారు నిత్య  అగ్నిహోత్రుడు లాగా , నిత్య కవితా సాగర  మథనాన్ని  చేస్తూ , నూతన  కవితా అగ్ని పూలను  పూయిస్తారు తన కలం చేత . మనసు భావాలన్నీ , ఒక్క సారిగా  అక్షరాల  విస్ఫోటనాలై   మన ముందు  ప్రజ్వరిల్లి మనల్ని , ఈ  సమాజాన్ని  ప్రశ్నిస్తాయి .

 ' గ్రహణం ' పట్టిన  ఈ  సమాజం కోసం  , ' అశ్రువు ' ఒక్కటి ధార పోసి , ' పూర్ణిమ ' ని చిగురింప  చేసారు  కొనకంచి గారు . 'చూపులు  వాలిన  చోట ' 'మంత్రలిపి 'ని కవిత్వం  చేశారు .

Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. - William Wordsworth .

కోన కంచి గారి కవిత్వం  powerful  feelings  వల్ల  ఉబికి వచ్చిన  spontaneous  over flow  అని  నిక్కచ్చితంగా చెప్పవచ్చు .

 త్వరలో  విడుదల  అవుతున్న ' నేనేమీ  మాట్లాడను ' సందర్భంగా , కవి గారికి శుభా  కాంక్షలు  తెలుపు తున్నాను .

భానుమూర్తి / 15.05.2016

Tuesday, May 10, 2016

ముఖ పుస్తకం ( face book )

ముఖ పుస్తకం ( face book )


లంఖణాలున్నా
లైక్  లే చాలు  కడుపు  నిండి పోతుంది
పస్థులున్నా
కామెంట్లే  చాలు  పండుగ  అయి పోతుంది
ముఖ పుస్తకం చేస్తుంది  గారడీ
అందరం   కావాలి  ఇక  రెడీ  రెడీ

కొందరు  కవులు
గేయాలతో  గాయాలు చేస్తారు
మరి కొందరు  కవులు
కవనాలతో  వనాలు  పూయిస్తారు

కొందరు  చిత్రాలతో
విచిత్రాలను  చూపిస్తారు
మరి కొందరు  తమ రాతలతో
టెన్షన్  పెట్టేస్తారు

ముఖ పుస్తకం  లో  ముఖ పరిచయం  లేకున్నా
అందరు  హితులే  , సన్నీ హితులే !

పుస్తకాలు చదవడం  కన్నా
బతుకు  పుస్తకం  చదవడం  మిన్నా 
ముఖ పుస్తకం లో  బతుకు పేజీలున్నా
అవి చదవడం  ఇంకా  గొప్పన్నా !!
 

Saturday, May 7, 2016

కవితాంతరంగం

కవితాంతరంగం




కవితాంత  రంగం  అనే శీర్షికలో - కవి సంగమం  అనే పేస్ బుక్  గ్రూప్ లో , నా  'సాగర మథనం ' అన్న  కవితా సంపుటి  గురించి  06. 05. 2016  నాడు  వచ్చిన  విశ్లేషణ గురించి  నా  మాటలు కొన్ని .

ఒక కవిగా  నా జీవితం ధన్య మయిందనే భావిస్తాను , కవితాంత  రంగంలో  మీ విశ్లేషణ  చదివాక . ఒక కవి అంతరంగాన్ని , అతని కవితల ద్వారా  అవిష్కరించడం , ఆతను  రాసిన  కవితల్ని క్షుణ్ణంగా  పరిశీలించి ఒక సమగ్ర మైన  నివేదికను  రాయడం అనేది  అసమాన్యమైన  క్రియ గా నేను అనుకొంటున్నాను . రాజా రామ్  తూముచర్ల  గారి కలం నుండి జారి పడుతున్న ఆణి  ముత్యాల్ల్లాంటి  కవితాంతరంగమ్ శీర్షికలో  నా పేరు చోటు  చేసు కోవడం  నిజంగా నేను ఏ జన్మలో  చేసు కొన్న అదృష్టమో ! అవును ... కవుల గురించి , వారి కవితల గురించి , వారి  ప్రతిభ  గురించి   కవి సంగమం  లో చేరిన  తర్వాతనే  నాకు తెలిసింది . ఇక్కడ  ఏంతో  మంది  ప్రతిభా వంతులు , కవిత్వాన్నే  ఉపిరిగా  చేసుకొని  బ్రతుకు తున్న మహాను భావుల  కవితల  గురించి  చదవడం, ముఖ  పరిచయం  లేక పోయినా  , ముఖ పుస్తకం ద్వారా  పరిచయం గావడం  నా అదృష్టం  గా భావిస్తున్నాను . అత్యంత  ప్రతిభాశాలి  , కవి సంగమం  అనే చెట్టు మీద  వాలుతున్న  పిట్టల్ని  ఒక్క చోట  చేర్చిన ఘనత  శ్రీ యాకుబ్  గారిది , అతనితో  పాటు పని చేస్తున్న వాహెద్  మరియు  సతీష్ లాంటి  యువ  కవులది గూడా . ఈ  సందర్భంగా  వారందరికీ  పేరు పేరునా  కృతజ్ఞతలు  తెలుపు కొంటున్నాను . 2000 సంవత్సరంలో , నేను  హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా లో  సి జి  ఎం ( ఫైనాన్సు ) గా పని చేస్తున్నపుడు  Dr  గోపి , తెలుగు  విశ్వ విద్యాలయం  వైస్  ఛాన్సలర్ గారి ఆశీస్సులతో ,నా  మొదటి పుస్తకం ' సాగర మథనం ' కవితా సంపుటిని రిలీజ్  చెసాను. తరువాత  2005 లో ' సముద్ర ఘోష ' అనే పుస్తకాన్ని  Dr రాము , రసమయి  మరియు Dr సినారే గారి చేతుల మీదుగా రిలీజ్ చేసాను . ఈ పుస్తకం  Dr అక్కినేని నాగేశ్వర  రావు  గారికి అంకితం ఇవ్వడం  జరిగింది .  అదే  విధంగా , ముఖ పుస్తకం  లో వస్తున్న   కవి సంగంమం  మరియు మిగిలిన గ్రూప్  లలో  125 కవితల్ని ఇంత  వరకు రాయడం  జరిగింది . శ్రీ   రాజా రామ్  గారు  నా కవితల  పట్ల  వెలిబుచ్చిన అబిప్రాయాలని సహృదయంతో  ఆదరిస్తున్నాను.  మున్ముందు మరింత  గాఢమైన , సాంద్రత కలిగిన  కవితల్ని రాయడానికి  ప్రయత్నిస్తాను . ఈ  కవితాంత రంగం  లో నాకు  చోటు  కల్పించి నందుకు  రాజా రామ్  తూముచర్ల గారికి , కవి సంగమం  నిర్వాహకులకు మరియు నా తోటి  కవి సోదరులకు  అందరికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను - వారణాసి భానుమూర్తి రావు 

Friday, May 6, 2016

మేధావుల్లారా !


మేధావుల్లారా !



ఈ  దేశంలో  మేధావులంతా
నోరు విప్పని  నాడు 
వానపాము గూడా  విషసర్పమై  కాటేస్తుంది

మేధావులంతా  గబ్బిలాల్లా
తలక్రిందులై  తపస్సు చేస్తున్నంత  వరకూ
వితండ వాదమే  మహా వేదమై పోతుంది

మేధావుల్లారా
రండర్రా  రోడ్ల మీదకు

ద్వంద నీతులు  కొందరు  పలుకుతున్నా
నోరు మెదపని  సజ్జనుల్లారా
రండర్రా  దండోరా  వేయడానికి

న్యాయ దేవత కళ్ళల్లో  కన్నీళ్ళు
భరత  మాత  ఒంటి నిండా  రక్తపు  మరకలు
మూడు హత్యలు , ఆరు  మాన భంగాలు
కుల మతాలు కట్టుకొన్న  కుళ్ళు ఆన కట్టలు
ఎవడికి వాడే  రాజ్యాంగాన్ని  రచిస్తున్నారు
ఎవడికి వాడే  చట్టాల్ని నిర్వచిస్తున్నారు
వేదాలకు  అవేదాలు
అవేదాలకు వేదాలు వల్లిస్తున్నారు
దేశం  బ్రష్టు పట్టిపోతోంది
ఈ దేశంలో  మట్టి  కల్మషం
గాలి కల్మషం , నీరు  కల్మషం
మనసులు  కల్మషం , మనుషులు  కల్మషం

ఒప్పుకోండి  మేధావుల్లారా
ఓడి  పోయ్యామని .....
కుళ్ళిన  వ్యవస్థను  మార్చలేమని  !


పాము కుబుసం  వదలినట్లు
కొత్త  చర్మాన్ని  తగిలించు కొని రండి
మీ కళ్ళల్లోని  రేటినాలు  మార్చి చూడండి
బానిస  మనస్త్వత్వం  నుండి బయట పడండి


మీ భయాన్ని , అసమర్థతను
మీ బ్లేజేర్ కిందనో  , రేబాన్  గ్లాసుల  వెనకనో
దాచేసి  తప్పుని ఒప్పుగా , ఒప్పుని తప్పుగా చెప్పకండి!

రండి  మేధావుల్లారా !
అందరం కలిసి  కొత్త దేశాన్ని నిర్మిద్దాం
మట్టి వాసన  మనుషుల్లో నింపడానికి...



“The fundamental cause of the trouble is that in the modern world the stupid are cocksure while the intelligent are full of doubt.”
Bertrand Russell






Sunday, April 24, 2016

వానమ్మ వానమ్మ వానమ్మా!



పల్లవి :
 అమ్మ  వానమ్మ  వానమ్మ  వానమ్మా
దివి నుంచి  భువికి  దిగి రావమ్మా                     // అమ్మ //

చరణాలు :

తప్పులెన్నో  చేసినామమ్మా
మమ్ము క్షమియించి  కిందికి  రావమ్మా          // అమ్మ //

వాన సుక్కల్ని ఒడిసి పట్ట  లేదమ్మా
ఇంకుడు  గుంతల్ని  తవ్వ లేదమ్మా            // అమ్మ //

అడవుల్ని  నరికి వేసినామమ్మో
చెట్లన్నీ తగల బెట్టి నామమ్మో                   //అమ్మ //

దోసిళ్ళతో  నీరు   నింపుతామమ్మా
లోగిళ్ళలో  చెట్లు  పెంచుతామమ్మా           // అమ్మ //

దయ చేసి  కిందకు  రావమ్మా
నీకు  చేతులెత్తి  మొక్కుతామమ్మా          // అమ్మ //

మేఘాలు  మా పైకి తోలమ్మా
మా ఊర్ల చెరువులు  నింపమ్మా            //అమ్మ //

గుంత లన్నీ తవ్వి నామమ్మా
చుక్క  నీరు   ఇక వదల బోమమ్మా    // అమ్మ//


భానుమూర్తి
24. 04. 2016








Tuesday, April 19, 2016

చెరువు

చెరువు
----------


అలా  ఎంత సేపు  నడుస్తున్నానో  నాకే తెలియదు
సాయంకాలపు  నీరెండ  నన్ను చుట్టేసు కొనింది
మా వూరి  చెరువు గట్ల మీద
ఆమె ప్రవాహం లా నాకు ఎదురయింది
తీతవ పక్షులు పాడుతున్న  రాగాలు
చెరువు నీళ్ళల్లో  దోబుచులాడుతున్న  చేపల నక్షత్రాలు
ఆ సాయంకాలం  నా గుండెల్లో ఒక  పల్లె రాగమై  పలికింది
ఆమె  నా  ఎదురుగా  నిలబడింది
ఆకసాన  మేఘాలు  పన్నీటి తుంపర్లను  పంపించాయి
ఆమె కొంగు నా మీద  ఛత్రమై  గాలిలో ఎగిరింది
ఆమె వక్ష సంపద  నా   రెటినాలో  చిత్రమై నిలిచింది
ఆమె సిగ్గుల  మొగ్గయి బుగ్గలు నిగ్గయి
పసిడి కెంపుల కాంతిలో మెరుస్తున్నాయి
అప్పుడెప్పుడో  రెక్కల మనుషులు
గగనంలో  కనబడి మాయ మయి నట్లుగా
ఆమె  హటాత్తుగా  ఒక వసంతమై నిలిచింది
అవును ..... ఒక  పది  ఉగాదుల  తర్వాత
ఒక మహా యుగమై  ఆమె నన్ను పలకరించింది
అలా ఎంతసేపు ఆమె కళ్ళల్లో ని అమాయకత్వాన్ని
చూ స్తున్నన్నో నాకే తెలియదు
ఇళ్ళకు  వెడుతున్న పశువుల గంటల శబ్దం
ఎగురుతున్న గోధూళి  వాసన
సన్నని జల్లులు అందించిన కమ్మని మట్టి వాసన
కనుల ముందు బాపు  బొమ్మలా  ఆమె 
నా ఉచ్వాస  నిశ్వాసాల  సవ్వడిని  నియంత్రిస్తున్నాయి
తూరుపుదిక్కున  ఇంద్ర ధనస్సు దిగి వచ్చిన  దేవ కన్యలా
ఆమె  వదనం  సంధ్య కాంతిలో  మెరుస్తోంది
అవును ...
పది సంవత్సరాల్లో ఎంత  మార్పు?
పండక్కి వచ్చారా బాబు గారు?
చిగురు టాకులు తిని మదించిన కోయిల లా వుంది ఆమె స్వరం
ఆమె  గాలికి ఎగిరిపోతున్న పమిట సర్దుకొంటూ
మాటలు  గద్గద స్వరంలోంచి  బయటకు  రాలేక  కన్నీటిని  కురిపించాయి
నువ్వు వివాహితవా ? బాల్య  వివాహమా?
దక్షిణం దిక్కు ఉరుములు మెరుపులు
ఒక్క సారిగా ఉలిక్కపడ్డ పక్షులు
వలయా కారంలో తిరుగు తున్నాయి
పసి వాడని ప్రాయంలో పెళ్లి 
పదేళ్ళకే  వైధవ్యమా ?
ఎంతమంది  పూర్ణమ్మలు బలి అవుతున్నారో ?
ఆమె  చిటికెన వ్రేలు పట్టుకొని
ఏడు  అడుగులు నడిచాను
నాకు తెలుసు  .....
ఈ చెరువు గట్ల మీద మహా ప్రళయం  జరుగుతుందని
రెండు సమాధుల మధ్య  కత్తుల  యుద్ధం  జరుగుతుందని
రెండు పల్లెల  మధ్య  భీకర పోరు  జరుగుతుందని
రేపు తెల్లవారదు ...
చీకటి  కొన్ని సార్లు  ఉదయిస్తుంది
చీకటి కొన్ని  సార్లు  తెగిస్తుంది
కట్టు బాట్లు  ముళ్ళను తెంపి
సరిహద్దు కంచెల్ని దాటి
చీకటి చూపిన బాటలో
గమ్యం  చేరే వరకు  నడుస్తూనే ఉన్నాము

నాకు తెలియదు ....
పత్రికలో అక్షరాల సందేశం చదివే దాకా ...
వందల సంవత్సరాల  క్రితం  కట్టిన
ఆ పురాతన చెరువు  గట్టు తెగి పడి  పోయిందని
రక్త సిక్త మైన  చెరువు నీరు
రెండు పల్లెల్ని  ముంచే సిందని

మనిషి  కట్టుబాట్లకు
చెరువు బలి అయింది !
---------------------------------------------------------------------




 
వారణాసి భానుమూర్తి రావు
13.04. 2016











Sunday, April 10, 2016

నోబెల్ సోల్ !

నోబెల్ సోల్ !



 మా క్షురకుని  కత్తి
నా మెడ మీద  నుండి  పీక  వరకు వచ్చినా
లేశ మైన  భయం లేని నాకు
అతడి నోటి వెంబడి  వచ్చే 
సమస్యా లంకారా వ్యక్త అవ్యక్తా వ్యంగ చతురోక్తుల
సామాన్య ,రాజకీయ, సాంఘిక , చలన చిత్ర ఆవ్రతమై
నిరంకుశ  , నిర్మోహ  , నిరవధిక  వాగ్ధాటి పటిమకు
ఆశ్చర్య  పోతూ   భయ పడి పోతాను  నేను !

అతని క్షురకాలయంలో
పిల్లలు పెద్దలు  ముళ్ళ మీద
కళ్ళు పెట్టి   వాళ్ళు  కాలాన్ని నములుతూ
వార్తా పత్రికల  కథల  లోకి  విహరిస్తూ
కేశ   ఖండన  కాలాన్ని  బేరీజు  వెసుకొంటుంటారు

కులం , మతం  అడగని
ధనిక పేద తెలియని అపరిచిత , పరిచిత వ్యక్తుల
క్షురకర్మ  చెయ్యడమే అతని పని
నిజంగా  అతను  నాకు గొప్ప సంస్కర్త
మహాత్ముడు , మహితాత్ముడు

ప్రపంచాన్ని ఒక్క
ముక్కలో  విడమరచి  అర్థం చెప్పే మహా జ్ఞాని
ఆర్థిక  సంస్కరణలు
తమ  వృత్తికి  ఉరిత్రాళ్ళైనై
మల్టీ నేషనల్ కంపనీలు ఏసీ  గదుల్లో పెట్టిన
సలూన్లు  తమ పాలిట బలి  పీఠాలయినై
అని నాతొ అన్నప్పుడు  ఒక భయం
అతని  ముఖంలో  ప్రస్పుట మయింది


 కాలం తెచ్చిన  మార్పులు
ఇంటి అరుగుల మీద నుండి
లక్జరీ ఫైవ్  స్టార్  ఏసీ  సలూన్ల దాక
ఎలా ఎగబడింది కథ చెబుతూ
నా గుబురు గడ్డాన్ని ట్రిమ్ చేస్తాడు

వంద రూపాయలు ఉంచుకోమ్మన్నా
పనికి తగ్గ డబ్బు తీసుకోని
మూడు పదులు తో సరిపెట్టుకొన్న
మా బార్బెర్ నిజంగా నాకు దేవుడే !

దేశాన్ని కబళించే కింగ్ ఫిశర్లు  , 2జి రాజులు ,
కోట్లు మింగిన  రాజకీయ వాదులు
కబ్జా లు చేసే భూబకాసురులు
కల్తి  వ్యాపారం చేసే నకిలీ  వ్యాపారస్తులు
కిడ్నీ లు అమ్ముకొనే దొంగ డాక్టర్లు
పసి పాపల్ని  అమ్ముకొనే  నర్సులూ
ఇంతమంది రాక్షసులు  తిరుగుతున్న ఈ దేశంలో
మా బార్బెర్  ఒక  నోబెల్  సోల్ !



భానుమూర్తి  వారణాసి




Wednesday, April 6, 2016

అమ్మ - ఒక అమ్మాయి

అమ్మ - ఒక  అమ్మాయి


మనస్సును వివస్త్ర చేసి
అనుమానంతో  అవమానించి
చీర  కోంగుతొ వ్రేలాడ దీసిన  ఆమె శవాన్ని
అబద్దాల  పోస్ట్  మార్టం లో  ఖననం చేసి
రెండవ పెళ్ళికి  సిద్ద మయ్యే మగాసురులకు  వందనం !

బస్సుల్లో , రైళ్లల్లో
కార్లల్లో , సినిమా హాళ్లల్లో
హాస్టల్లో , కాలేజిలల్లో
స్కూళ్ళల్లో , షూటింగ లల్లొ
వెంట  బడి  , వెంట బడి
ఆమె  స్త్రీత్వాన్ని జుర్రుకోవాలని చూసే మగాధములకు వందనం  !

మామ , తాత , బాబాయి
నాన్న , అన్న , అంతా మనవాళ్ళే
ఎదురింటి అంకుల్ , పక్కంటి  టీచర్
సంగీతం నేర్పించే మాష్టారు
వాళ్ళ తిమ్మరి   చూపులు భరించే శక్తి లేక
మౌనంగా రోదించే  చిన్నారికి
గొప్ప వ్యవస్థ ను  అందించిన మగ సమాజానికి  వందనం !

నఖ శిఖ పర్యంతము
కళ్ళ తోనే అందాలను జుర్రుకొని
ద్వందార్తాలతో  ప్రేమను ఒలక బోసి
పని కంటే ప్రేమ పనులకు  ఇంక్రిమెంట్ ఇస్తూ
పరువాలను ఒలకబోసిన వారికి ప్రమోషన్ లిస్తూ
ఆఫీసుల్లో  రొమాన్సు డ్రామా లాడుతున్న మగ అధికారులకు వందనం !

మగతనం ఉన్నదని  విర్రవీగకు మగ మహారాజా !
'భూమ్మీద సుఖ పడితే  తప్పు లేదురా'  అన్న పాత పాట ను పాడకు
జంతువుకు మనిషికి తేడా లేదని నిరూపించకు
మన అమ్మ గూడా ఒక ఆడదేగా ?
ఉద్రేకంలో  తప్పు చేసి  ఊచలు  లెక్క బెట్టకు !





 

Saturday, April 2, 2016

చెట్టు - పక్షులు

చెట్టు - పక్షులు
----------------------
ఆ  చెట్టు మీద 
వేలాది  పక్షులు 
సాయంత్రం కాగానే  
చిరు చిరు నక్షత్రాలయి
 కొమ్మల రెమ్మల మీద దాక్కొంటాయి

పగలంతా ఎక్కడో  తిరిగి తిరిగి
మళ్లి  ఆ చెట్టు  గూటికే చేరి
కబుర్లను  కడుపు నిండా పంచుకొంటాయి

రెక్కల్ని   రెప రెప లాడిస్తూ
కొమ్మల  చిగురు టాకుల  పరుపుల మీద
రాత్రి నిద్రకు సిద్ద మవుతాయి

ఒక్కొక్క సారి  చల్లని గాలి
స్పృశించిన  పక్షులు
కొత్త  రాగాలు పాడు కొని
మురిసి పోతుంటాయి

కొన్ని అమ్మ పక్షులు
బిడ్డల కోసం  కట్టుకొన్న
పొదరిల్లులో దూరి
పిల్లల నోటిలో
గోరు ముద్దల్ని తినిపిస్తాయి

చిరు జల్లులు  కురిస్తే
రెక్కల్ని విదిలిస్తూ
 ఆనంద నృత్యాల్ని  చేస్తాయి

ఆ చెట్టు మీద  వేలాది పక్షులు
సుప్రభాత గీతాల్ని పాడుతాయి
ప్రభాత వేళలో
గుంపులు గుంపులు గా
ఆకాశంలో  ఎగిరి  నాట్యాలు  చేస్తాయి

ఇన్ని వేలాది పక్షుల్ని మోస్తున్న
ఆ చెట్టు  నాకు ఒక గొప్ప మాతృదేవతే !

అన్నం కోసం  ఆరాట పడినా
ఒకరి కడుపు కొట్టి  బ్రతికే స్వార్థం లేక
సహ  జీవనం చేస్తూ
మానవత్వాని చాటుతాయి పక్షి జాతులు

ఒక కాకి మరణిస్తే
వేలాది కాకులు ఆకాశం లో తిరిగి  చింతిస్తాయి

గాలి పటం మాంజా లో చిక్కుకొని
ప్రాణాల్ని పోగోట్టు కొంటున్న కాకిని చూసి
వేలాది కాకులు ఆకాశంలొ గోల పెడుతున్నాయి

బాల్కొనీ లో కూర్చొని   'చెట్టు పక్షుల' కవిత రాసుకొంటున్న నాకు
మా  పదేళ్ల అమ్మాయి చెప్పే వరకు
ఆ  కాకి  పడుతున్న అవస్థ గుర్తుకు రాలేదు

పొడుగాటి కర్ర తో మా బాల్కనీ గోడ ఎక్కి
మాంజా  దారాన్ని లాగి రెక్క లెగరక
విల విల లాడుతున్న  కాకిని  కాపాడాను

మా అమ్మాయి కళ్ళల్లో  ఆనంద బాష్పాలు
నన్ను మళ్ళి మనిషిని  చేశాయి !


భాను వారణాసి / 02. 04. 2016
 

Friday, January 1, 2016

స్వర్గం చేజారి పోయింది !

స్వర్గం  చేజారి పోయింది !
--------------------------------------

ఏయ్ 
మిస్టర్
నువ్వు  స్వర్గాన్ని  చూశావా ?
నీ కళ్ళల్లోంచి  జారి  పడిందిప్పుడే !

నువ్వు ఏ  స్వర్గం కోసం కలలు కన్నావో
అది  నీ కళ్ళ ముందే  జారి పోయింది
ఇన్నాళ్ళూ  స్వప్నాల్ని నంజుకొని  తినే వాడివి
ఈ వేళ నిజాల్ని  కక్కుతున్నావ్ !
నువ్వు స్వర్గాన్ని  చూసావో  లేదో ...
చూడాలని  వుందో  లేదో ..  కానీ  ఒక  స్వర్గం  చేజారి పోయింది !

నరకాన్ని మటుకు మహా నగరంలో  చూస్తున్నావు
పసి పిల్లల ప్రాణాలు బస్సు చక్రాల  క్రింద వదిలినా
రోడ్ల మీద గుడులు , దర్గాలు  రాత్రికి రాత్రే  మొలుస్తున్నా
నోరు తెరచిన మాన్  హొల్లు  మనుషుల్ని మింగినా
బద్ధకం రాయుళ్ళు  రోడ్ల  మీదనే  రొచ్చు  రొచ్చు చేస్తున్నా
మనకేం గాదు ...

స్వర్గం  సిటీ లల్లోనే ఉంది
మెట్రో  రైళ్ళు  మన తలకాయల మీద  నడుస్తాయి
ఇగ కాస్సేపట్లో  ఇసిత్రంగా  ప్రజలు ఆకాశం మీద  నడుస్తారు
ఇరుకు రోడ్ల మీద  నరకానికి  బారికేడ్లు  సిద్దంగా  ఉన్నాయి
కొమ్మలు నరికిన చెట్లు  సిమెంటు  దిమ్మెల మీద  పురుడు పోసు కొంటున్నాయి
వాన చుక్కలు ఇంకుడు  గుంతల్లేక  తారు రోడ్ల మీద వాగులయ్యాయి
ఎండి పోయిన  భూగర్భ  కుహరాల్లో  స్మశాన వాటిక లున్నాయి
విరామమే  లేని  రోడ్లు  చచ్చిన  పాముల్లా పడి ఉన్నాయి
ఈ నగరంలో  పీల్చే గాలి విషం  అవుతుంది
ఈ నగరంలో త్రాగే  నీరు  గరళం అవుతుంది
ఈ నగరంలో  తినే తిండి  పాషాణం అవుతుంది
మార్చురీ లలలో  శవాలు  కాటిక కాపరి  అడ్రస్సు కోసం  వెతుకు తున్నాయి
నగరంలో  దయ్యాలు  పారాడుతూనే  ఉంటాయి
ఔటర్ రింగు  రోడ్డులో  మరణ మృదంగాల  ట్యూన్ విన బడుతూనే ఉంటుంది
సిటి లో పచ్చ దనం  ప్లాస్టిక్  కొమ్మల్లో విరగ బుస్తోంది
నడిజామున  నగరం లో   ఆమ్ల  తుంపర కురుస్తోంది
పర్యావరణం  బాలన్సు  తప్పి   కుంటి నడక  నడుస్తోంది
అభివృద్ది పేరుతో   భూమాతకు  అబార్షన్లు  చేస్తూనే ఉన్నారు
నగరంలో  పచ్చ దనం పరారై పోయింది
నగరం గరం గరం లా  గరం చాయ్  లా ఉంది
నాకు   కావాల్సింది  ఈ  నగరం గాదు
అంబలి  తాగిస్తూ  ఎదకు హత్తుకొనే  అమ్మ గావాలి
పచ్చ దనం  కప్పుకొన్న  పల్లె పందిరి  గావాలి
పీల్చ డానికి  చల్లని గాలి గావాలి
తాగడానికి  దోసెడు  నీళ్ళు  గావాలి
జీవించ  డానికి  నాకు  ఒక్క  స్వర్గం  కావాలి
బ్రతక డానికి  నాకు ఒక్క పల్లె గావాలి !!