Tuesday, April 30, 2019

ఉత్తమ శిష్యుడు

ఉత్తమ శిష్యుడు 
----------------------
రచన : వారణాసి  భానుమూర్తి రావు 

----------------------------------------------------------------------------------------------------------------
పూర్వం నందవరం అనే గ్రామంలో  ఒక ఆచార్యుడు ఉండే వారు. అయన పేరు విష్ణు శర్మ . వారు సకల వేద వేదాంగ  పారంగతులు   . ఆయన దగ్గర చిన్నతనంలోనే శిష్యులుగా చేరిన ఎంతో   మంది   ప్రముఖ పండితులుగా , విద్వాంసులుగా  వివిధ రాజ్యాలలో రాజుల దగ్గర కొలువులు సంపాయించే వారు . అందుకే ఆ ప్రాంతమంతా  ఆయనంటే ఎనలేని గౌరవం. భక్తి.
అయన ఆశ్రమంలో ఎప్పుడూ  విద్యార్థుల వేదఘోషతో  శ్రవణానందంగా  ఉండేది .

ఒక నాడు వేకువ జామున  బ్రాహ్మి  ముహూర్తంలో  స్నానాదికాలు ముగించుకొన్న తన కిష్టమైన ఇద్దరి శిష్యులను  పిలిపించుకొన్నారు  గురువు గారు.    వినీలుడు  అనే  శిష్యుడిని పిలచి , వెంటనే పట్నం కు  వెళ్లి  యాగానికి కావాల్సిన సామానులన్ని   తీసుకుని రమ్మని  పురమాయించారు   గురువు గారు. తరువాత  సునీలుడు  అనే  శిష్యుడిని  పిలచి , అడవికి వెళ్లి యాగానికి   కావాల్సిన దర్భను కోసుకురమ్మని పురమాయించారు .

ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొంటూ కాలి బాటన నగరానికి బయలు దేరాడు వినీలుడు.
సునీలుడు దర్భ కోసం అడవి బాటను పట్టాడు .

కొంచెం దూరం వెళ్ళాక   సునీలుడుకి  ఎవ్వరో పిలిచి నట్లయింది. వెనక్కి  తిరిగి  చూస్తే , వీరభద్రుడు రొప్పుతూ వస్తున్నాడు.

'' సునీలా.. ఆగు. '' అని గట్టిగా అరిచాడు  వీరభద్రుడు .

సునీలుడు ఆగి పోయి ' ఏమని ?' తల పంకించాడు .

'' సునీలా.. గురువుగారు దర్భ నన్ను కోసుకు రమ్మన్నారు . నీకొక ముఖ్య వార్త  చెప్పాలి''  అన్నాడు ఆయాసంతో.

'' ఏమా వార్త? '' సునీలుడుకి  ఏమీ  బోధ పడ్డం లేదు .

'' గుండె దిటువుచేసుకొని విను. గురువు గారు నీకీ  వార్త చెప్పమని,  ధైర్యంగా ఉండ మని చెప్పారు. మీ అమ్మ గారు స్నానం చేస్తూ  ......  నదిలో.... ''

అని చెబుతూ వెక్కిళ్లు  పెట్టి ఏడవసాగాడు వీరభద్రుడు.

''  ఏమైంది   మా అమ్మ గారికి? నదిలో  ... '' సునీలుడు ముఖమంతా స్వేదంతో నిండి పోయింది.

''ఏమని చెప్పను  సునీలా . అమ్మ గారు నదిలో పడి  కొట్టుకొని పోయిందట '' అన్నాడు వీరభద్రుడు .

'' ఆ .. శివ శివ ... నా  కెందుకీ శిక్ష విధించావయ్యా ' అని కూల బడి పొయ్యాడు సునీలుడు .
అతని శరీరమంతా వణుకు పుడుతోంది .

వీరభద్రుడు  ధైర్య  వచనాలు చెబుతూ సునీలుడిని  ఇంటికి వెళ్ళమన్నాడు . అడవికి తాను వెళ్లి దర్భలు కోసుకు వెడతానన్నాడు .

సునీలుడు వెను  తిరిగి పోలేదు .

'' గురువు గారి ఆజ్ఞ లేనిదే నేను వెను  తిరిగేది  లేదు . శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా  చిటుక్కు మనదు . గురువు గారు నాకు దేవుడుతో సమానం . అయన పని పూర్తయిన వెంటనే నేను ఇంటికి వెడతాను. దర్భ లేకుంటే యాగం జరగదు. గురువు గారు అప్రతిష్ట పాలు  కావడం నేను
చూడలేను  '' అని అడవి వైపు వడివడిగా అడుగు లేసాడు సునీలుడు .

సునీలుడి స్థిత ప్రజ్ఞకు, ఆత్మస్థైయిర్యానికి ఆశ్చర్య పొయ్యాడు వీరభద్రుడు. చేసేదేమీ లేక వెను  తిరిగి గురువు గారి ఆశ్రమం వైపు పరుగు లంఘించాడు  వీరభద్రుడు .

--------------------------------------------------------------------------------------------------------

పట్నం వైపు వడివడిగా అడుగులేస్తున్న వినీలుడు సూర్యతాపానికి తట్టుకొలేక పోతున్నాడు.
పట్నం ఇంకా  చాలా దూరంలో ఉంది . యాగానికి కావలసిన  వస్తువులన్నీ  దొరకాలంటే పట్ణణ మంతా వెతకాలి .

గురువుగారు ఈ  పనిని సునీలుడుకి  ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకొన్నాడు వినీలుడు.
అయినా అడవిలో ఏ పులో , పామో  కరిస్తే తన గతేమి  కాను , ఆ అడవిలో  దర్భ కొయ్యడం కన్నా పట్నానికి వెళ్లి సరుకులు తేవడమే మేలు అని తల పోశాడు వినీలుడు .

అంతలో '  వినీలా  వినీలా. ' అనే కేక విన బడింది . కేశవుడు రొప్పుకొంటూ తన వైపు వస్తున్నాడు  .
'' ఏమైంది .. కేశవా ? ఏమంత గాభరా ? '' అన్నాడు .

'' వినీలా. మీ నాన్నగారు ఆకులు  కొయ్యడానికి మర్రి చెట్టు ఎక్కి పైనుండి  క్రింద పడ్డడాడట. మనిషి చాల  అపాయంలో ఉన్నాడట. గురువు గారు నీకు  చెప్పి రమ్మన్నారు '' అన్నాడు  కేశవుడు .

 '' ఆ... ఎంత పని జరిగింది ? నాన్న గారికి ప్రాణా పాయం లేదు గదా ? అయితే ..నేను  మా ఊరుకి వెళ్లి పోతున్నానని గురువు గారితో చెప్పు. ఇంద .. రొఖ్కము .. సామానుల చిట్టా ''
అని కేశవుడికి అందించి దక్షిణం వైపున్న తన గ్రామానికి పరుగులు తీసాడు  కేశవుడు .

------------------------------------------------------------------------------------------------------------------
ఆ సాయంకాలం   సునీలుడు  ఆశ్రమం  చేరుకొని , తల మీదున్న దర్భల మోపుని క్రిందకు దించి గురువు గారి ముందు  ఉంచి వినయంగా  చేతులు  కట్టుకొని  నిలబడ్డాడు .

'' సునీలా. నువ్వు చాలా  పుణ్య కార్యం చేసావు. క్రూర మృగాలున్న అడవిలో ఒంటరిగా వెళ్ళి దర్భను సేకరించి యాగ నిర్వహణ నిమిత్తమై ఏంతో  మేలు చేసావు. '' అన్నాడు గురువు గారు ఆనందంగా .

'' గురువు గారు. తమరు అనుగ్రహిస్తే నేను మా గ్రామానికి వెళ్లి రావాలి . మా అమ్మ గారు నదిలో పడి ... '' అని కళ్లల్లో  నీళ్లు  తుడుచుకొంటూ  ఏడవసాగాడు  సునీలుడు .

''చ. ఏమిటా మాటలు నాయనా.. నీకు ఈ  గురువు గారి ఆశీస్సులున్నంత వరకు మీ అమ్మ గారికి ఏ ఆపదా  రాదు. పట్నానికి  వెళ్ళిన వినీలుడు తిరిగి రానీ . '' అన్నాడు గురువు గారు .

ఆ సాయంకాలం కేశవుడు రొప్పుతూ  నెత్తి     మీద సామానుల మూట  పెట్టుకొని అలసి పోయి , పీక్కుపోయిన ముఖంతో వచ్చాడు . వినీలుడు వారి నాన్న విషయం చెప్పగానే గ్రామానికి పరుగెత్తాడని గురువు గారితో చెప్పాడు.

మరుసటి రోజు వినీలుడు తిరిగి వచ్చి సంగతంతా గురువు గారికి చెప్పి క్షమించమని వేడుకొన్నాడు . వార్త విన్న వెంటనే పట్టణానికి  వెళ్లి సరుకులు తేవాలని తోచ లేదన్నాడు .
గురువు గారు అంతా  విని నవ్వు కొన్నాడు .

'' చూడు వినీలా .. నీకు  పనిలో  అశ్రద్ధ , గురువు గారి పట్ల అవిశ్వాసం ఎక్కువున్నాయి. ఉత్తమ శిష్యుడుకు కావలసినవి  స్థిత ప్రజ్ఞత , ఆత్మ స్థైర్యం , క్రమ శిక్షణ , అవగాహన . బల హీనత మనిషిని  అశక్తుడ్ని , అసమర్థుడ్ని చేస్తుంది . అమ్మ నదిలో  పడి  కొట్టుకొని పోయిందనే  వార్త విని గూడా , సునీలుడు స్థిరమైన  చిత్తంతో  గురువు గారి ఆజ్ఞను మన్నించి , తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. పనిలో అంకిత భావం , ఓర్పు, సహనం , క్రమశిక్షణ  ఇవి మనిషిని ఉత్తమ వ్యక్తిగా తీర్చు దిద్దుతాయి. ఈ  సుగుణాలన్నీ సునీలుడిలో పుష్కలంగా ఉన్నాయి. ఇక నీ  విషయానికి  వస్తే వినీలా, మీ నాన్న చెట్టు మీద నుండి పడ్డాడనే  వార్త విని నాకు   గూడా  చెప్పకుండా నీ  గ్రామానికి వెళ్లి నీ  కర్తవ్యాన్ని విస్మరించావు . మనిషి మనస్సును జయించలేక పొతే నిర్వీర్యుడై   పోతాడు . మిమ్మల్ని పరీక్షించాడానికే ఈ  రెండు అబద్ధాలు ఆడ  వలసి వచ్చింది . ఈ  పరీక్షలో సునీలుడే   గెలిచాడు . ఈ  ఆశ్రమానికి నా  తరువాత సునీలుడే  వారసుడు. అతనే ఉత్తమ శి ష్యుడు . '' అన్నాడు  గురువు గారు.

గురువు గారి తరువాత , సునీలుడు ఆశ్రమ ధర్మాలన్నీ చక్కగా నిర్వర్తించి  మంచి పేరు తెచ్చుకొన్నాడు .


--------------------------------------------------------------------------------------------------------------

వారణాసి భానుమూర్తి రావు 
99890 73105
హైదరాబాదు