Friday, November 11, 2022

పుస్తకావిష్కరణ

 

-----------------

పుస్తకావిష్కరణ

ఆ రోజు ఆదివారం.‌
ఫేస్‌బుక్  లో పేజీలు తిరగేస్తున్నాడు రాంబాబు. పుస్తకా విష్కరణలు  ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తన దగ్గరున్న చిన్న పొత్తం లో   నోట్ చేసుకొంటాడు.ఆతను సాహిత్య ప్రియుడే.అడపా దడపా కొన్ని‌ కవితలు వ్రాసుకొన్నాడు. కానీ ఎవరికీ చూపించడు. అతని ఎరుకలో ఇంకా అతను పరిణితి చెందిన కవి కాదని అతని వుద్దేశ్యం. నిర్వాహకులు
పిలిచినా ,  పిలవక పోయినా ఆయన సాహిత్య సభలకు , అవిష్కరణ సభలకు వెళ్ళడం అలవాటు. దానికి ఎనిమిది కారణాలు.
1. ఆది వారం‌ శ్రీమతి నుండి చీవాట్లు తినడం తప్పుతుంది.
2. పుస్తకాలు కొనే బాధ తప్పుతుంది. అవిష్కరణ సభలో ఎలాగూ నిర్వాహకులు పుస్తకాలు ఫ్రీగా పంచి పెడతారు .

3.  కొందరు ఇంటిలో అటక మీద చెదలు పట్టిన
పుస్తకాల్ని ఇక్కడ పంచి పెడుతుంటారు ఆ  కవుల వారసులు.‌ మా నాన్న గారు వ్రాసిన పుస్తకం అనీ ,మా తాత గారు వ్రాసిన పుస్తకం అనీ.ఇంట్లో పేరుకు‌ పోయి చెదలు తినేస్తున్న పుస్తకాల్ని ఎలాగైనా వదిలించు కోవాలని వారి ఆరాటం.
6. అవిష్కరణ సభలో భోజనాలు ఏర్పాట్లు గూడా వుంటాయి. అక్కడే తిని ఇంటికి వెళ్ళవచ్చు.
7. ఇంకో లాభం పెద్ద పెద్ద రచయితల్ని , కవుల్నే గాకుండా ఇతర ప్రముఖ అతిధుల్ని కలవ వచ్చు
వారితో సెల్ఫీ లు తీసు కోవచ్చు.
9. అసలయిన లాభం చెప్పలేదు కదా! కొందరు కవుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారి పుస్తకాలు అంటే చెవి తెగ్గోసుకొంటాను , వారి గొప్ప ఫాన్ అంటే ,వారే ఇంటికి ఆ పుస్తకాల్ని  ఫ్రీ గా పంపిస్తారు.
ఇన్ని లాభాలున్న అవిష్కరణ సభల్ని ఎలా వదలు కొంటాము?
ఆంధ్ర ప్రదేశ్ లో గానీ , తెలంగాణా లో గానీ ఎక్కడైనా సాహిత్య సభలు జరగనీ , అక్కడకు వాలి పోతాడు రాంబాబు.అందుకే రాంబాబుకు కవుల మార్కెట్లో మంచి పేరుంది. ప్రతి సభకు తప్పక హాజరవుతాడని.
రాంబాబుకు ఒక చిరకాల వాంఛ ఒక్కటి ఉంది. ఎలాగైనా శాలువ ఒక్కటి కప్పించుకొని సన్మానం చేయించు కోవాలని. ఆ ఆశ తీరనే లేదు. తను కవి గాడు. కవితలు వ్రాయ లేడు. రచయితా గాదు. కథలు వ్రాయ లేడు. పోనీ వ్యాసకర్త అంటే అదీనూ గాదు.
ఆ కొరత రాను రానూ ఒక చింతగా మారి రాంబాబు మనో వేదనకు గురి అయ్యాడు.
ఎలా శాలువ కప్పించు కోవాలో తెలియడం లేదు.  తనకు శాలువాతో సన్మానం చేయించు కోవాలంటే తనలో ఏదో టాలెంట్ ఉండాలి.‌ సాహిత్య రంగం లోనైనా, కళా రంగం లో నైనా , సేవారంగం లో నైనా తనకు ఒక గుర్తింపు వుండాలి. అదే లేదు తనకు.  " ఉద్ధండ సాహిత్యాభి మాని " అని ఎవరైనా తనకు బిరుదు ఇచ్చి సన్మానం చేస్తే బాగుంటుందని రాం బాబు అనుకొనే  వాడు.
ఈ ఆది వారం , సుందరయ్య కళా భవన్ లో పొద్దున పది గంటలకు , మరీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక అవిష్కరణ సభలు ఉన్నాయని ఫేస్ బుక్ లో చూశాడు.‌ అందరూ ఆహ్వానితులే అన్న వాక్యం చదివి సంతోష పడి పొయ్యాడు.‌  ఆశ్చర్యం ఏమిటంటే పొద్దున సభలో ఇరవై మంది కవుల పుస్తకాల్ని అవిష్కరణ ఒకే రోజు చేస్తారని ఉంది. రాంబాబు ఆనందానికి అవధుల్లేవు.‌
ఉదయమే ఇంట్లోంచి బయలు దేరాడు. ఠంచనుగా పది గంటలకు సుందరయ్య హాలు చేరుకొన్నాడు. ఇంకా ఐదారు మంది గూడా రాలేదు. పదకొండు గంటల వరకూ కొంత మంది వచ్చారు. కానీ అధ్యక్షుల వారు రాలేదు. ఆయన పెద్ద రాజ కీయ నాయకుడు.  గవర్నర్ గా  పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవితంలో ఇలా సాహిత్య సాంస్కృతిక  సభలకు హాజరవుతున్నాడు. అతను వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఈ రెండు గంటలు కవుల అర్థం కాని కవితలు , పద్యాలు , పాటలు వినిపించారు.  కనీసం కాఫీ, టీ  నీళ్ళయినా మొహాన పొయ్య లేదు.  బహుశా భోజనం ఒకే సారి పెడతారేమో!
రాంబాబు కి నీరసం వచ్చేసింది. అంతలో ఒక అబ్బాయి కాగితాల కప్పుల్లో టీ ని నింపుకొని , ట్రేలో బిస్కట్లు పెట్టుకొని  వచ్చాడు. తను రెండవ లైన్లో కూర్చొన్నాడు. కానీ ఆ టీ  బిస్కట్ల అబ్బాయి వెనక కూర్చొన్న సీట్ల  నుండి సప్లయి చేస్తున్నాడు.  వెనకాల కుర్రోళ్ళు చాలా మంది నిలబడు కొని వున్నారు. పది నిమిషాలయినా ముందు లైన్ల వారికి ఇవ్వడం లేదు. అందుకే రాంబాబు  వెనక సీట్లో కి వెళ్ళి కూర్చొన్నాడు. మైకులో ఎవరో ఫ్రంట్ లైన్ లో వున్న అతిధులకి టీ బిస్కట్లు ఇస్తే సభ ప్రారంభ మవుతుంది అన్నాడు.
రాంబాబుకు ప్రాణం పోయినంత పనయింది.  ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ గూడా చేసి రాలేదు. నాలుగైదు వరసల వారికి టీ బిస్కట్లు ఇచ్చి ఆ  అబ్బాయి వెళ్ళి పొయ్యాడు. మళ్ళీ అతను రానే లేదు. రాం బాబు సొమ్మ సిల్లి పోతున్నాడు.
అవిష్కరణ సభ ప్రారంభమయింది. వేదిక మీద కూర్చొన్న మైకాసురులు మైకును పట్టుకొని మాట్లాడుతూనే వున్నారు. టైం సెన్స్ కొంచెం గూడా లేదు. ఇంకా అధ్యక్షుల వారు మాట్లాడడం లేదు.‌ అప్పటికే ఒంటి గంటన్నర దాటింది.ఇక లంచ్  ఎప్పుడు పెడతారో తెలీదు.
ఇప్పుడు అధ్యక్షుల వారిని మాట్లాడ మన్నారు. వేదిక మీదున్న పెద్ద మనుషుల పేర్లు చెప్పడానికే పది నిముషాలు పట్టింది.‌ ఇంకా ఎవరి పేరు అయినా  మరచి పోతే క్షమించాలి అన్నారు అధ్యక్షుల వారు.ఇరవై మంది కవులు దీనంగా కూర్చొన్నారు మొదటి వరసలో. రాంబాబు మళ్ళీ వచ్చి రెండవ వరసలో కూర్చొన్నాడు. ఎందుకంటే ఈ సారి ఇరవై పుస్తకాలు అప్పనంగా దొరుకు తున్నాయి.
మధ్యాహ్నం రెండు గంటలయింది. అధ్యక్షుల వారు సాహిత్యం గురించి మాట్లాడకుండా తన రాజకీయ ప్రస్థానం గురించీ , తను  ప్రత్యర్థులను ఎలా ముప్పు తిప్పలు పెట్టిందీ చెప్పుతున్నాడు. అంతలో ఒక నిర్వాహకుడు అధ్యక్షుల వారి చెవిలో ఏదో గొణిగాడు.
అంతలో అధ్యక్షుల వారు  వుపన్యాసం ముగించారు‌ .ఇప్పుడు ఇరవై మంది కవులు రెడీగా ఉండాలి అన్నారు ఎవరో! ఇరవై పుస్తకాల అవిష్కరణ ఒకే రోజు చెయ్యడం  నభోతో నభవిష్యతి. ఇన్ని పుస్తకాలు ఏ సాహిత్య సంస్థ గూడా ఒకే రోజు అవిష్కరించ లేదు. ఆ పని మేము చేసి చూపిస్తున్నాము‌ . వేదిక మీద పది మంది కూర్చొన్నారు. వేదిక క్రింద ఒక యాభై ,అరవై మంది కూర్చొన్నారు.  ఇరవై పుస్తకాల అవిష్కరణ జరిగింది. కుప్పలు కుప్పలుగా పుస్తకాలు వేదిక మీది టేబుల్ పై నిండి పొయ్యాయి. వేదిక మీద వున్న పెద్ద మనుషులు వారికిచ్చిన ఇరవై పుస్తకాల్ని సంచీలో నింపుకొంటున్నారు.
ఇక వేదిక దిగువ కూర్చొన్న వారి  కందరికీ  ఆ ఇరవై మంది వ్రాసిన పుస్తకాల్ని పంచేశారు. అలా పాపం ఆ బీద కవులు కష్టపడి అచ్చు వేయించిన పుస్తకాలు సుమారు యాభై అరవై   పుస్తకాల్ని అక్కడి కొచ్చిన వారికి వుచితంగా నిర్వాహకులు  పంచేశారు. కొందరయితే  ఫ్రీగా వస్తున్నాయని రెండు మూడు పుస్తకలు అదనంగా తీసుకొని దాచు కొంటున్నారు. పాపం కవుల ముహాల్లో కత్తి వాటుకి  నెత్తురు చుక్క గూడా లేదు. ఒక్కొక్కరు యాభై ,  అరవై పుస్తకాల్ని ఫ్రీగా పంచాలంటే   ఎంత  ఖర్చు అవుతుంది ? . అసలు ఐదు వందల పుస్తకాలు అచ్చు వేయించాలంటే అర్ద లకారం పైననే అయి పోతోంది. ఇంకా అవిష్కరణ సభ ఖర్చు  వగైరాలు ఖర్చు తడిసి మోపడవుతుంది.
అక్కడున్న కవులకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు.ఒక్కడన్నా ఒక్కడు పుస్తకాన్ని కొందామన్న పాపాన లేదు. అదేదో అవిష్కరణ సభకు వచ్చాము గదా, పుస్తకాలు ఫ్రీగా తీసు కోవడం వారి హక్కు అన్నట్లు ఫీల్ అయి పోతున్నారు.  కార్పోరేట్ కంపెనీలల్లో గూడా ఆనువల్ జనరల్ బాడీ మీటింగులప్పుడు యాజమాన్యం వారిచ్చే బిస్కట్ పాకెట్లకు , స్వీట్లకు  , బహుమతులకు ఇలాగే కొట్టుకొంటారు.  ఒక్క షేరున్నా , వెయ్యి షేర్లున్నా వారిచ్చే బిస్కట్ల కోసం ఎంత దూరమైనా వస్తారు.  యాజమాన్యం వీరికి ఆ  బిస్కట్లు ఇచ్చి పెద్ద పెద్ద రిజల్యూషన్ లను  పాస్ చేయించు కొంటుంది. అలాగే ఏడ్చినాయి ఈ మధ్య అవిష్కరణ సభలు గూడా అని అనుకొన్నాడు రాం బాబు.‌
సాయంత్రం నాలుగు గంటలవుతోంది. ఇంకా వేదిక మీద అభిమానులు కవుల్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు.  లంచ్ మాట ఒక్కరు గూడా ఎత్తడం లేదు.
అంతలో మైకులో ఒకాయన ఇలా అన్నారు.
" ప్రియ సాహిత్యాభి మానులారా! ఇప్పటికే చాలా కాలా తీత మయింది. మమ్మల్ని మీరు క్షమించాలి. బయట అల్పాహార పాకెట్లు అరేంజ్ చేశాము. దయ చేసి అల్పాహారాన్ని ఆరగించి వెళ్ళాలి ." అని రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నాడు.
బ్రతుకు జీవుడా! అని అనుకొంటూ రాంబాబు హాలు బయటకు వచ్చి రెండు మూడు అల్పాహార పాకెట్లును తీసుకొని ఓ మూల వేసిన కుర్చీలో కూర్చొని లాగించేశాడు. పులిహోర , పెరుగన్నం , ఉప్మా పాకెట్లు వున్నాయి అక్కడ మూడు ట్రేలల్లో.
సాయంత్రం ఆరు గంటలకు అక్కడే ఇంకో సాహిత్య సభ , పుస్తకావిష్కరణ వుంది.
బ్రతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చని అక్కడనుండి క్షణాల్లో మాయ మయ్యాడు రాంబాబు.
ఏమను కొన్నాడో ఏమో , రాంబాబు ఆ తరువాత
ఏ పుస్తకావిష్కరణ సభకు హాజరు కాలేదు.
******************************************
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

గో తెలుగు .కామ్ లో అక్టోబర్ నెలలో ప్రచురించారు.


No comments:

Post a Comment