Tuesday, May 12, 2020

నాన్నా ..ఇంట్లోనే వుండండి !

నాన్నా ..ఇంట్లోనే వుండండి !
---------------------------------------
రచన: వారణాసి భానుమూర్తి రావు
----------------------------------------------------------
చిన్న పిల్లవాడు నాని ఐదేళ్ళ కొడుకు .. పోలీసు కానిస్టేబుల్ గాపని చేస్తూ  ఉన్న రమేష్ ని చూసి ఏడుస్తూ ఉన్నాడు .

"  నాన్నా.వెళ్ళకండి..నాన్నా.బయటకి వెళ్ళకండి. కరోనా వుందంట బయట"
" నిన్న వెళ్ళారు. ఈ రోజు వచ్చారు.‌ నాతో ఆడుకోవడం లేదు. నన్ను ఎత్తుకోని కిస్ ఇవ్వడం లేదు. నాకు కథలు చెప్పడం లేదు. ఎక్కడికి వెడుతున్నారు? ' అని అడిగాడు.

నాన్న దగ్గరకు వెళ్ళ డానికి ట్రై చేస్తున్నాడు.కానీ దూర దూరంగా రమేష్ జరుగుతున్నాడు రమేష్ కరోనా భయంతో.

"చూడు అమ్మా..నాన్న నా దగ్గరికి రావడం లేదు . బయటనే ఉండి అన్నం తింటున్నారు.నన్ను ఎత్తుకోవడం లేదు" అని వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాడు నాని.‌

లలితకు అర్థం అయినా పిల్ల వాడ్ని ఎత్తుకొని సముదాయిస్తోంది.

"   మన ఊర్లో కరోనా బూచి వచ్చిందంట..నాన్న ఆ బూచిని మన ఊర్లోంచి తరిమేసి వస్తాడంట"

" లేదు అమ్మా ..బోలెడంత మంది పోలీసు మావయ్యలు ఉన్నారు. నాన్న ఇంట్లోనే ఉండాలి" ఏడుస్తున్నాడు నాని.

బిర బిర మని తినేసి లలితకు సైగ చేశాడు రమేష్ కుర్రాడిని ఇంటి లోకి తీసుకెళ్ళమని.

లలిత కళ్ళ నీరు తుడుచు కొంటూ లోపలికి వెళ్ళి పోయింది.
*******************************************
రమేష్ ముహానికి  మాస్క్ కట్టుకొని స్కూటర్ ఎక్కి హెల్మెట్  వేసుకొని లాఠీ తీసుకొని బయటకు వెళ్ళాడు.

బయట మార్కెట్  దగ్గర గుంపులు గుంపులు గా ఉన్న జనాన్ని చూసి చాలా కోపం వచ్చింది. చాలా మంది ఫేస్  మాస్కులు  వేసు కోకుండా  తిరుగు తున్నారు.

" ఏమయ్యా..మీకు బుద్ది లేదా? కరోనా అంటే ఏమను కొంటున్నారు? మనిషిని చంపేస్తుంది. తెలిసి తెలిసి చావు కొని తెచ్చు కొంటారా?

" ఒక మనిషికి ఒక మనిషికి ఒక ఐదు అడుగుల దూరం ఉండాలి.  ఎవరి కయినా ఆ వ్యాధి ఉన్న వారు దగ్గినా , తుమ్మినా మన కందరికీ వస్తుంది. చేతులు చేతులు కలప కండి. చేతులు ప్రతి అర్థ గంటకూ సబ్బుతో కడుక్కోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందికి వచ్చింది"  అన్నాడు రమేష్

రమేష్ మాటల్ని ఎవ్వరూ పెడ చెవిన పెట్ట లేదు. గుంపులు  గుంపులు గా తిరుగుతూ..రాసు కొంటూ, పూసు కొంటూ తిరుగు తున్నారు.

" లాక్‌ డౌన్ విషయం మీకు తెలుసా? ఇలా బయటకు   తిరగ గూడదని మీకు తెలీదా? దయ చేసి ఇళ్ళకు వెళ్ళి పోండీ " అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు రమేష్.

" మేము ఏమి తిని బ్రతకల్ల సార్! ఇంట్లో  కూర్చొంటే పనులు పనులు ఎట్ల జరుగు తాయ్? " అన్నాడు ఒక్కడు దురుసుగా.

ప్రక్కన్నే ఇద్దరు రౌడీలు రమేష్ ని పక్కకు  తోశాడు.
రమేష్ కి చాలా కోపం వచ్చింది.

" ఏరా ..నన్నే పక్కకు‌తోస్తావా? " అన్నాడు కోపంగా.

" ఏంది నువ్వు పీక్కొనేది? మా అన్నకు చెబితే నీ ఉద్యోగం వూడి పోతుంది.." అన్నాడు ఒక రౌడీ.

" ఎవడ్రా మీ అన్న "  ఆ ఇద్దర్నీ లాఠీ తో వెనక్కి తోశాడు రమేష్.

"  మా అన్న కోటి రెడ్డి.. ఏమ్ ఏల్ ఏ~" అన్నాడు ఆ రౌడీ రమేష్ ని ముందరకి తోస్తూ.

రమేష్ లాఠీ కి పని చెప్పి బాగా కొట్టాడు కనిపింవిన వారిని . గుంపులుగా ఉన్న వారిని చెదర గొట్టాడు.

ఒక రౌడీ మొబైల్ తీసుకొని ఎవ్వరికో ఫోన్ చేశాడు.
పది నిముషాల్లో ఐదారుగురు రౌడీలు వచ్చి రమేష్ ని
చితగ్గొట్టి ముహాన ఉమ్మి వెళ్ళి పొయ్యారు.

రక్త మోడుతున్న రమేష్ ని అక్కడ కొంత మంది గవర్న మెంటు  హాస్పిటల్ కి తీసు కెళ్ళారు.
***********************************************
డాక్టర్ గారు కరోనా సూట్ వేసుకొనే ఉన్నారు ముందు జాగ్రత్తగా . అన్ని పరికరాలతో   పరీక్ష చేశాడు రమేష్ ని.

విపరీత మైన జ్వరం..గొంతు‌నొప్పి..శ్వాస తీసు కోవడం లో ఇబ్బంది ఏమైనా ఉన్నదా అని వివరాలు అడిగాడు.

' దేవుడి దయ వలన అలాంటిదేమీ లేదు సార్" అన్నాడు రమేష్
రమేష్ పోలీసు యూనిఫార్మ్ లోనే ఉన్నాడు. బట్టల మీద రక్తం మరకలు ఉన్నాయి.

గాయాలన్నీ తుడిచి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టరు గారు.

" రాత్రి పగలు లేకుండా నెల రోజుల నుండి జనాలని కంట్రోల్  చేస్తున్నారు.‌ చాలా మంది పోలీసులు అన్న పానీయాలు లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ త్యాగం మరువ లేనిది సార్" అన్నాడు డాక్టర్ గారు.

" ప్రజలు మమ్మల్ని అర్థం చేసు కోవడం లేదండీ..లాఠీతో కొడుతున్నామని తెగ బాధ పడి పోతున్నారు. ఇంట్లో ఒక్కడికి వచ్చినా ఇంటిల్ల పాదీ అవస్థ పడుతారు"

అంరలో రమేష్ బాస్ సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చి సారీ చెప్పాడు   రమేష్ కి.

"ఎవ్వరో  రౌడీలు మిమ్మల్ని కొట్టారని విన్నాను. వారి డిటైల్స్ ఇవ్వండి .కేసు పెడదాము"
అన్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ .

" చూడండి సార్..మీ‌పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలు చాలా ఋణ పడి ఉన్నారు. మీరు‌ కంట్రోల్ చెయ్యక పోతే , కరోనా బాధితులు లక్షల్లో ఉండే వారు.‌ మీరు గూడా  కొంచెం దూరం పాటించి ప్రజలని కంట్రోల్ చెయ్యండి. సానిటైజర్ , చేతులకు గ్లౌసులు , ఫేస్ మాస్క్ మరచి పోకండి. మీరు బాగుంటే మన దేశం బాగుంటుంది." అని అన్నారు డాక్టరు గారు కృతజ్ణతా భావంతో వారిద్దరికీ వీడ్కోలు చెబుతూ.

***********************************************
రెండు రోజుల తర్వాత పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చారు ఆ రౌడిలను .

" మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కొట్టాము సార్..మమ్మల్ని క్షమించండి. మీ ప్రాణాల్ని తెగించి మీరు సమాజ సేవ చేస్తున్నారు.  కరోనా వ్యాధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు ." అన్నారు ఆ ఇద్దరు రౌడీలు .

అంతలో ఆ  ఇద్దరు రౌడీలు కళ్ళు తిరిగి మెలికలు తిరుగుతూ పడి పొయ్యారు.

" మాకు కరోనా వ్యాధి వచ్చింది. కరోన ఉందని తెలిసినా గుంపుల్లో తిరిగాము. సామాజిక బాధ్యత మరచి జంతువుల్లా ప్రవర్తించాము. మాకు ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం " అని అన్నారు ఏడుస్తూ

అంతలో అక్కడి కొచ్చిన వైద్య సిబ్బందిని వాళ్ళను క్వారంటైన్ హోమ్ కి తరలించారు . ఆ ఇద్దరి రౌడీలకు  కరోనా వ్యాధి వచ్చిందని తెలిసినా వైద్యుల్ని సంప్రదించకుండా వ్యాధిని‌ ముదర  పెట్టుకొన్నారు. కరోనా దెబ్బకు వారు ప్రాణాలు వదిలారు.

వారింకా ఎంత మందికి కరోనాను అంటించారో అని పోలీసు డిపార్ట్మెంటు తల పట్టుకు కూర్చొన్నది.

కరోనా కట్టడిలో‌పోలీసు వారి పాత్ర మరువ లేనిది.
************************************************

 రచయిత...వారణాసి భానుమూర్తి రావు
కాపీ రైట్స్: రచయితవి.
22.04.2020 @ 9.40 pm

No comments:

Post a Comment