Monday, October 9, 2017

రంగుల ప్రపంచం







రంగుల  ప్రపంచం  
---------------------------------
వారణాసి  భానుమూర్తి  రావు 
---------------------------------------------------------------------------------------------------
స్కోడా కార్  లో  హై టెక్ సిటీ  కి వెడుతున్నాను ఏదో పని  మీద  .

వెనుక సీట్లో  శ్రీమతి  మా చిన్ని గాడితో     కూర్చో నుంది .

చిన్ని గాడి ఏడుపు .

ఏమయింది ? మాటి మాటికీ ఏడుస్తున్నాడు ? కొంచెము అసహనంగా అన్నాను.

మే నెల ఎండలు వాగి పోతున్నాయి. కార్  లో  గూడా ఏ సి  ఎఫెక్ట్    బాగా ఉంటే గూడా  ఉమ్మదంగా ఉంది .

''డైపర్ మార్చాలండి..కొంచెం పక్కకి  కార్ ఆపుతారా ? ''

''అన్ని ఇంటిలోనే  చూసుకొని రావాలి     గదా శశి ....  ఏమిటిది ?''

జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర   రెడ్ సిగ్నల్లో అపాను ...బంజారా హిల్స్ నుండి వస్తున్నాను 
అంతలో ఒక ముసలావిడ కొన్ని వస్తువులు అమ్మ జూపుతోంది . అవి కార్  షేడ్  షీల్డ్స్ .. ఎండ ఆపడానికి పనికొస్తాయి.

దీనంగా ఆమె అడుగు  తోంది . అమె  కళ్ళల్లో  దైన్యం , ముఖంలో నీరసం .  ఆమె చేతిలో ఆరేడు   నెలల పసి కందు.   ఎండకో ,ఆకలికో గుక్క పెట్టి ఏడుస్తోంది  . 

శ్రీమతి డైపర్ మార్చడంలో బిజీ గా ఉంది .


''శశి ..కొందామా ..  పాపం ఆమెకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది''  అడిగాను నేను . 

శ్రీమతి ఎగిరి గంతేసింది.

'' ఛీ పాడు.. వాళ్ళ చేతుల్లో బాక్టీరియా . చూడండి ఆమె ఎలా   ఉందో .లక్షణంగా షాపులో  కొనవచ్చు గదా ''

''ఎంతమ్మా ?''  అడిగాను నేను .

 ''రెండు వందలు బిడ్డా  ...ఎంతిస్తారు చెప్పండి ? ''

ఆమె ముఖం  విప్పారింది ..నేను కొంటా నేమో అని 

''నూట యాభై ఇవ్వండి సారూ  ... '' అంది 

శ్రీమతి విండో గ్లాస్  ఓపెన్ చేసినందుకు తిట్ల వర్షం కురిపిస్తోంది .

''డర్టీ భిక్ష గాళ్ళ దగ్గర కొంటారేమండి .. ''  అంది కోపంగా .

 గ్రీన్ సిగ్నల్ పడింది .

''అమ్మా ... వద్దు లే !''అన్న్నాను.. ''సారూ  నా  బిడ్డ పాలు తాగు రెండు రోజులయ్యింది . నీళ్ల మీదే బతుకు తున్నాడు ''  అని ఆమె రెండు చేతుల్తో నమస్కరించి   ఏడుస్తోంది . 

నా కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి.

జోబీలో ఉన్న రెండు వందలు  తీసి ఆమెకు ఇచ్చాను .

 ''సారూ ...  ''అని ఒక కొత్త పాక్ తీసి ఆమె  నాకు ఇవ్వ బోయింది .  

'' నాకు అవి వద్దమ్మా .. ఈ  రెండు వందలు పెట్టి పిల్ల వాడికి పాలు , బిస్కట్లు  కొని ఇవ్వు''  అని  కార్  హై  టెక్ సిటీ వైపు పోనిచ్చాను . 

'' మీరు ఇంత  పెద్ద జాబ్  చేస్తూ రోడ్ల మీద ఏమిటండీ  ఆ కొనుడు?  మీకసలు బుద్ది   వున్నదా ? 
వాళ్ళ దగ్గర  నుండి ఇన్ఫెక్షన్  వచ్చి రోగాలు వస్తాయి ''అంది  గట్టిగా  అరుస్తూ .

 '' అనవసరంగా రెండు వందలు వేస్ట్ చేశారు . ఇలాంటి   బిక్షగాళ్లు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. ఇలా  డబ్బులు పంచుకొంటూ పొతే  మన ఆస్తులు అమ్ముకోవాలి ''
అంది కాస్త ఉక్రోషంగా .  

=================================================

కార్ హోటల్  వెస్ట్ ఇన్ ముందర నిలిపాను .

మా ఫ్రెండ్స్ డాటర్ బర్త్ డే పార్టీ .  

'' గిఫ్ట్ కొనడం మరచి పోయాం ..ఇప్పుడేం చేద్దాం  ఎటిఎం పక్కనే ఉంది ... పది  వేల  రూపాయలు డ్రా చెయ్యండి. గిఫ్ట్ కవర్లో పెట్టి ఇస్తాం '' అంది శ్రీమతి.

'' ఏమిటి .. పది వేలా ??'' 

'' వాళ్లు  మన  చంటి  గాడి బర్త్ డేకి  ఇరవై వేలిస్తారు లెండి. మన డబ్బులు ఎక్కడికీ  పోవు.  అంది శ్రీమతి 

'' అక్కడ  కార్ సన్ షేడ్స్ కొనడానికి రెండు వందలు వద్దన్నావు. ఇప్పుడు పది వేలు పెట్టడానికి గూడా రెడీగా ఉన్నావు '' 

శశి ఏమీ  మాట్లాడలేదు.. కారు  దిగి పోయింది 

 బర్త్ డే  పార్టీ   చాలా గ్రాండ్ గా జరిగింది . 

ఐదు లక్షలు  ఖర్చు పెట్టాడట  ఆనంద  రావు వాళ్ళ అమ్మాయి బర్త్  డే పార్టీకి ''    అంది      శ్రీమతి నా  చెవిలో గుసగుసలు పెడుతూ .
ఆశ్చర్య పోయ్యాను .బర్త్  డే   పార్టీ కి ఐదు లక్షలు పెట్టే  ధనవంతులున్న ఈ  దేశంలో పుట్టిన పిల్లలకి పాలు కొనలేని స్థితిలో ఉన్న ఆగర్భ దరిద్రులు ఉన్నారు .
ఈ దేశం లో సమన్యాయం ఎప్పుడు  జరుగుతుంది ?

నాకా రాత్రి నిద్ర పట్టలేదు. మాటి మాటికీ అడుక్కొన్న ఆమె గుర్తుకు వస్తోంది . 

---------------------------------------------------------------------------------------------
'' శశి ... ఈ  రోజు  మనము కర్నూలు వెళ్ళాలి .   అర్జంటుగా  ఆఫీసు పని మీద వెళ్ళాలి''  అన్నాను  రెండు రోజుల తర్వాత .
'' అలాగే మంత్రాలయం వెళ్లి  వస్తామా ? ''అంది శ్రీమతి

'' ఏమో చూద్దాం '' అన్నాను నేను .  బ్యాగేజి  అంతా  సర్దుకొని  డిక్కీ  లో  పడేశాను . చంటి  గాడికి కావల్సిన వన్నీ శ్రీమతి  సర్దుకొని  వెనుక సీట్లో  పెట్టింది .

కారు  రెండు గంటల్లో ఔటర్  రింగ్  రోడ్  మీదుగా జడ్ చెర్ల  చేరింది . టైం  పదుకొండు  గంటలు దాటింది .

మిట్ట  మధ్యాహ్నం ఎండలు మాడి పోతున్నాయి. రోడ్ల మీద మనుష్య సంచారమే లేదు. నలభై ఐదు  సెంటి గ్రేడ్ దాటిందేమో!   అన్నాను నేను  . 

'' ఈ  దరిద్రపు ఎండల్లో ఏమిటండి ఈ పాడు ప్రయాణం ? '' అంది విసుగ్గ శ్రీమతి .

 అవును నాకు గూడా అలానే అన్పిస్తోంది .కానీ  ఏమి చెయ్యలేను . రాత్రి  ఎండి  గారు  ఫోన్  చేసి  కర్నూల్  లో  డీలర్స్  కాన్ఫెరెన్స్  అట్టెండ్  కమ్మన్నాడు .

కారు  జడ్ చెర్ల దాటి  అరవై   కిలో మీటర్లు  ముందుకు  వురికింది . 

రోడ్లు  మాడి  పోతున్నాయి. కారు  టైర్లు  కరిగి పోతాయేమో అన్న భయం వేసింది నాకు .

అనుకొన్నట్లు     గానే కారు  టైర్  తుస్  అని ఒక్క పెద్ద   శబ్దంతో  పంచర్   అయిపొయింది .

స్టీరింగ్ బాలన్స్ తప్పి కారు   అటు ఇటు కదిలింది పాము లాగా. 

శ్రీమతి కెవ్వు మని అరచి ఏడుస్తోంది . పిల్లాడు  గూడా భయపడి ఏడ్పు ఎత్తుకొ న్నాడు . 

మెల్లగా స్టీరింగ్ కంట్రోల్ చేసి ఒక చెట్టు క్రింద అపాను .  

'' మీరు  టైర్ లు సరిగ్గా ఉన్నాయో లేదో  తెలుసు కోవాలి గదా ... స్టెప్ని ఉందా ?మార్చడం వచ్చా?  ప్రశ్నలు గాభరాతో వేసింది శశి. 

కారు  డోర్ వెనుక తెరచి    చూసాను.. '' ఓహ్ మై గాడ్ స్టెప్ని లేదు ... '' 

భయంతో కాళ్ళలో వణుకు పుట్టింది నాకు .

''మళ్లి  జడ్చెర్లకి వెళ్లి ఈ  కార్ టైర్ తీసుకెళ్ళి పంచర్  వేసుకొని మెకానిక్ తో రావాలి. కనీసం ఇంకా మూడు గంటలయినా పడుతుంది . ''  అన్నాను  నేను

శ్రీమతి ముఖంలో భయం .. ఏడ్పు..

బయటికి వచ్చి చెట్టు క్రింద పిల్లాడితో   నిలబడింది

మొబైల్  తీసుకోని  ఎండి  గారికి  ఉన్న విషయం  చెప్పాను . ఆయన    ఏమైనా  అంటాడేమో  అని భయం వేసింది  నాకు.  సరే కర్నూల్  లో ఉన్న జోనల్ మేనేజర్ ను   అట్టెండ్ కమ్మని  చె ప్పారు  ఎండి  గారు.  బ్రతుకు  జీవుడా  అని జోనల్ మేనేజర్ కి  ఫోన్  చేసాను.   

'' నీళ్లు లేవు ,, పాలు లేవు త్రాగడానికి .. ఇప్పుడెలా . కర్నూలు లో  అన్నీ   దొరుకు తాయన్నారు .. ఎక్కువ పెట్టుక  రాలేదు నేను ''  అంది శ్రీమతి  గాబరాగా .

అంతలో అక్కడున్న గుడిసె లోంచి ఒక ఆసామి వచ్చాడు . అతను  అరవై  సంవత్సరాల దాటిన ముసలాయన . చినిగి పోయిన  బనీను , లుంగీ , తలపాగాతో  వున్నాడు . 

'' ఏమి సారూ .. ఏమయ్యింది ''  అడిగాడు  అతను  .
  కథంతా చెప్పాను 

'' తమరికి   ఫికర్ అక్కర లేదు ..నా మనమడు ఉన్నాడు.. ఆడు అంతా  సూసు  కొంటాడు. పరేషాన్ వద్దు. రండి నా గుడిసే  లోకి '' అన్నాడు ఆ తాత .

గుడిసె లోకి వెళ్ళగానే  పాచిపోయిన అన్నం వాసన వస్తోంది .

'' నీళ్లు త్రాగండి '' అని ఒక ముంతలో  నీరు  నింపి ఇచ్చాడు.

నేను గడ  గడ   మని నీళ్లు  త్రాగేశాను .

శ్రీమతి తాగ  లేక పోయింది.  అయినా తప్పలేదు . ఆ నీళ్ళే  తాగింది .
అక్కడున్న మేక  దగ్గరికి  వెళ్ళి  మేక పాలు అప్పుడు పిండి ,  పి ల్లాడికి తాపమని చెప్పాడు ఆ పెద్దాయన .

అలాగే  ఇష్టం లేక పోయినా తప్పదన్నట్లు చేసింది తాను 

ఎప్పుడు చేసినవో గాని ఆరేడు జొన్న రొట్టెలు ,  గొడ్డు కారం మా ముందు ఉంచాడు. ఆకలి  అవుతోంది గదా నేను మా శ్రీమతి అవి మొత్తం లాగించేశాము.

అప్పుడు నా శ్రీమతికి బాక్టీరియా , అపరిశుభ్రత ,  ఇన్ఫెక్షన్   గుర్తుకు రాలేదు. 

'' మీరు కాస్త ఈ  నులక మంచం మీద  పడుకోండి దొరా .. మా మనమడు ఈ  పని సక్క  బెట్టు కొనివస్తాడు''  అన్నాడు ఆ పెద్దాయన.

వాళ్ళ మనమడు మోటార్ బైక్ లో వచ్చాడు. నా కార్ వీల్  తీసుకొని  జడ్చెర్ల కి  వెళ్లి రెండు గంటల్లో   రిపేర్  చేసుకొని వచ్చి స్టెప్ని వేసి అతనే బిగించాడు . 

'' ఇక మీరు ఆరాంగా ఎల్లండి ''  అన్నాడు  పెద్దాయన  .

పెద్దాయన చేతిలో ఐదు వందలు పెట్టబొయ్యాను.
పెద్దాయన గాని, మనమడు గాని ఒక్క పైసా  గూడా ముట్టలేదు.

బ్రతుకు జీవుడా అంటూ కారు  మళ్ళీ వెనక్కి  తిప్పి   హైదరాబాద్  వైపు  మల్లించాను

ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది  గంటలయింది. 

--------------------------------------------------------------------------------------------------

రెండు రోజుల తరువాత 
శ్రీమతి ఆ సంఘటన  తరువాత    చాలా  ముభావంగా ఉంది. ఏమి మాట్లాడం లేదు. 

ఎదో ఆలోచిస్తూ చాలా భాధ గా ఉంది . 

ఆ  రోజు సాయంకాలం  మళ్ళీ  మేము  జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆగాం  .


మళ్ళీ  ఆమె  ప్రత్యక్షమైయింది .

''    కార్ షేడ్స్ .. బిడ్డ కొనుండ్రి''  అనింది .

ఆమె చేతిలో  పిల్లవాడు  ఏడుస్తూ ఉన్నాడు .

శ్రీమతి కారు  డోరు  తెరిచి తన చేతిలో ఉన్న ఒక్క పాకెట్ ఇచ్చింది.

 '' మా  బాబు బట్టలు ఉన్నాయి .. ఇంకో పాకెట్లో నా చీరలు ఉన్నాయి .. తీసుకో అమ్మ ..'' అని  ఆమె చేతిలో  వంద రూపాయలు పెట్టింది నా శ్రీమతి.

మరుసటి రోజు రెండు గిన్నెలు నిండా పులిహోర , పెరుగన్నం తీసుకొని పక్కనున్న గుడిలో అక్కడ అడుక్కొన్న వాళ్ళకి పంచి పెట్టి వచ్చింది,

మా శ్రీమతి లో వచ్చిన ఈ  మార్పు చూసి నేను చాలా సంతోషించాను. 

ఆ రోజు  రాత్రి , '' శశి .. నీలో  ఏదో  మార్పు  కొట్టిచ్చినట్లు కన్పిస్తోంది ''  అని అడిగాను .

శ్రీమతి కళ్లలో కన్నీళ్లు    ధారాపాతంగా వర్షిస్తున్నాయి . 

'' కార్ ఏసీలో కూర్చోని, నీలి అద్దాల్లో ఇదే  ప్రపంచాన్ని చూస్తే  ఏడు  రంగుల సినిమాలా కన్పించేది  నాకు.  కానీ ఒక్కసారి క్రిందకు దిగి చూస్తే నిజమైన బాధల ప్రపంచం కనపడింది.  ఆ పెద్దాయన  , ఆయన  మనమడు చూపిన  త్యాగం నన్ను , నా జీవి తాన్ని మార్చి వేసిందండి . ''
 అంది నా భుజాల మీద వాలిపోతూ.

చిన్న పిల్లలా  ఏడుస్తున్న నా శ్రీమతిని సముదాయించడానికి నాకు చాలా కష్టమైంది . 
============================================================


published in prasthanam october 2017 issue.

http://www.prasthanam.com/node/1104



Wednesday, October 4, 2017

తెలుగు ధారలో తడిచి పొయ్యాను !



తెలుగు  ధారలో  తడిచి  పొయ్యాను !

నా చిన్నతనంలోనే తల్లి పాలతో పాటు తెలుగు తల్లి పాటల్ని విన్నాను 
'అ ఆ' లతోనే అమ్మ వొడిలో శతకాల గురించి విన్నాను 
నాన్న ఒడిలో నిద్ర పోతూ భారతం పద్యాలు విన్నాను 
అవ్వ కోసం రామాయణ మహా భారత కథలు చదివి వినిపించినాను 
నా కోసం చందమామ , బాల మిత్ర కథల్లో మునిగి పొయ్యాను. 
బాబాయి కోసం కొమ్మూరి డిటక్టివ్ నవలలు చదివాను 
'జెండాపై కపి రాజు ', 'బావా ఎప్పుడొచ్చితివి నీవు ?' భారతం వీధి నాటకాల పద్య ఘోష లో నన్ను నేను మరచి పొయ్యాను.
పల్లె భజన బృందంలో మద్దెలగా మారాను
తంబుర్రా చేత బట్టి ' తొమ్మిది బొక్కల తోలు తిత్తి ఇది ' అని పాడేవాళ్ళ తత్వ గీతాల్ని విన్నాను 
బుడబుక్కల వారి బ్రహ్మోపదేశం లాంటి పాటల్ని ,
పసుపు రంగు బట్టలతో ధగ ధగ మెరిసి గుర్రాల మీద ఊరూరా తిరిగే వేమారెడ్ల వేమన శతకాల్ని విని కంఠతా పెట్టాను 
తోలు బొమ్మలాటలో తోలు బొమ్మల ఆటలు , పాటలు , భట్రాజుల హరికథలు మాధుర్యాన్ని చవి చూసాను .
తెలుగు వాచకంలో తెలుగు పద్యాల సౌరభాలకు ఉప్పొంగి పొయ్యాను .
' చేత వెన్న ముద్ద చెంగల పూదండ' , తల్లి నిన్న దలంచి పుస్తకం చేతన్ బూనితిన్ ' , 'ఆది వారము నాడు అరటి మొలచినది' , 'అయ్య వారికి చాలు ఐదు వరహాలు , పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు' నిద్రపోతున్నా చెవుల్లో గింగురు మనే పద్య గేయాలు.
ఆరవ తరగతిలో ' ఆవు సింహం ' కథ చదివి కన్నీళ్ల కడలినై పొయ్యాను.
పిల్ల లేగ దూడ అమ్మకై పడే తపన , అమ్మ లేగ దూడ కోసం విలపించిన తీరు నా మనస్సు కరుణతో విల విల లాడింది .
తెలిసి తెలియని వయసులో మా వూరి టూరింగ్ టాకీస్ సినిమాలో ' లవ్ కుశ ' సినిమా చూసి అందులోని పాటల , పద్యాల సుమధుర తెలుగు సోయగాన్ని చూసి ముగ్ధుడై పొయ్యాను. ' సందేహింపకు మమ్మా సీతమ్మ ' ఒక్క పాటేమిటి?' ' వినుడు వినుడు రామాయణ గాధ ' అన్ని అమృత రస మాధురీ తెలుగు రస గుళికలే! 
'భక్త ప్రహ్లాద ' సినిమాలో 'జీవము నీవే గదా' , ' నారాయణ మంత్రం ' పాటలు విని నన్ను నేనే ప్రహ్లాదుడిగా ఉహించు కొన్నాను .
ఆ రోజుల్లో hmv గ్రామఫోన్ రికార్డ్స్ మీద సన్నని సూది తాక గానే , ఆహూజా లౌడ్ స్పీకర్ల లోంచి వచ్చే మధుర మైన తెలుగు పాటలు విని ఆశ్చర్య పొయ్యాను .
' పిలిచే నా మదిలో, వలపే నీది సుమా' , 'పిలువకురా, అలుగుకురా', ' నీ లీల పాడెద ', ఏరువాక సాగారోయ్ ' , పయనించే ఓ చిలుకా , ఎగిరిపో పాడై పోయెను గూడు ' లాంటి పాటలు ఈ నాటికి గుర్తు.
ఒక్కొక్క పాట విన్నప్పుడు , జీవితంలో సాగిన ఒక్కొక్క మజిలీ గుర్తు .
కాలేజి చదివే రోజుల్లో , 'చెయ్యేసి చెప్పు బావా ?' విన్నప్పుడు ప్రేమ గుబాళింపు,
' ఓ నాన్న నీ మనసే వెన్న ' అనే పాట విన్నప్పుడు నాన్న నా కాలేజి ఫీజు కోసం పడే అవస్థ ,
'శంకరా భరణం ' పాటలు విన్నప్పుడు మా శ్రీమతి తో తొలి పరి చయం ,
' ఈ జీవన తరంగాలలో , ఆ దేవుని చదరంగంలో ' పాట విన్నప్పుడు మా అమ్మ జ్ఞాపకం,
' తొమ్మిది తూటుల తోలు తిత్తి ఇది .. తుస్సు మనుట ఖాయం' అని విన్నప్పుడు మా తాత గారి కైవల్యం గుర్తుకు రావడం..

ఇలా ఇలా చెప్పుకొంటూ పొతే , మనిషికి, భాషకు, పద్యానికి, పాటకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం లోనూ.
ఇప్పటికి తెలుగు గీతాలు అమరామరమైనవి . అవి ఎప్పటికీ మన చెవుల్లో గింగురు మని మ్రో!గుతూనే ఉంటాయి.
ఈ దేహం మమేకం తెలుగులో !
ఈ ఆత్మ మమేకం తెలుగులో !
ఎందుకంటే నేను తెలుగు కవిని !
తెలుగే నా ఆధారం!
తెలుగే నా జీవనం !
తెలుగే నా ప్రాణం  !

( రాసిన కాలం 1990)



Sunday, October 1, 2017

వాన దేముడా !


-----------------------------------------------------------------------------------

వాన దేముడా !

రచన : వారణాసి భానుమూర్తి రావు 
------------------------------------------------------------------------------------------





'' ఈ సని ముకం యాడ సచ్చి నాడో ! యామో !''
తిడతానే ఉంది రంగమ్మ .
''కల్లు కన బడ్ల ... ఈడనే ఉండా? '' ఆవు దూడ మొగుతాడు పట్టుకొని దూడ గంగడోలు దువ్వతా ఉండాడు ఈరన్న ''
'' సెప్పవెంది మరి - ఈడనే ఉండా వని- పొద్దు గూకి పోతా ఉండాది . సట్లోకి బియ్యం గింజల్లేవు . సావుకారి మాదిరి కుసోనుంటే కూడెట్లా దొరుకుతుంది ? తూ.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.'' రంగమ్మ కోపంతో ఊగి పోతా ఉండాది.
ఈరన్న పది రూపాయలు తీసుకోని నూకలు కొనుక్కోవడానికి వూర్లో ఉండే రామన్న అంగడికి బయలు దేరినాడు.
ఈరన్న తెచ్చిన నూకల్తో రాగి సంగటి , పచ్చి పులుసు చేసి వండింది రంగమ్మ ఆ రాత్రి. 
ఆ రాత్రి పడుకొన్నాదన్న మాటే గాని రంగమ్మ కి నిద్ర పట్టడం లేదు 
ఈ బతుకంటే రోత పుడతా ఉండాది . ముందు జనమలో ఏమి పాపం చేసుకొన్నామో ఏమో ! ఈ జనమ లో ఈ రాత రాసి పెట్టినాడు ఆ బగ మంతుడు '' అని నొష్టు కొట్టుకొనింది రంగమ్మ .
ఎకరం భూమి ఉండాది గదా అని మామ కొడుకు ఈరన్న మనువాడింది రంగమ్మ . కుశాలుగా పెల్లి అయిన సమ్మచ్చరమంతా తిరునాళ్ళు, తీర్థాలు , సంతలు ఆడా ఈడా తిరిగినారు. ఈరన్న నాయన ఉన్న పెద్ద దిక్కు ఉండడంతో వంటికి కట్టం తెలీలా ! అయ్యప్ప అన్ని సుసు కొనే వాడు. సమ్మచ్చరం తిరక్క ముందే ఆయప్ప ఠక్కుమని సచ్చినాడు . సలిజ్వరం వచ్చినా కల్లు తాగతనే ఉండాడు , అది తిరగ బట్టి పెద్దాయన పానాలు ఇడిసినాడు. ఈరన్న తల్లి అంతకు ముందే సచ్చి పాయె .
నడ్డి మీద పెద్ద బండ రాయి పడినట్లు అయిండాది ఈరన్నకు . కట్టం సేసే పెద్ద దిక్కు కుటుంబరంలో కాలం సేసి నాక , బరువు బాదరా లేని గాలిపటం లాగా ఎగిరే ఈరన్నకు బతుకు తెరువు కోసం ఎంపర్లాడే పని అయింది. 
'''యాందే రంగి ... ఉలుకు పలుకు లేకుండా , గంగెద్దు లాగా కునుకు తిత్తా ఉండావు '' ఈరన్న ఈసడింపుతో రంగమ్మ అలోసనలన్నీ ఎగిరిపోయినాయి .
''ఎట్టా నువ్వు బతుకు తావో ఏమో అని బెంగ మామా '' అంది రంగమ్మ గుడ్డి లాంతరు ఎలుతురులో ఈరన్న ముకము సూస్తూ .
'' నా గురించి యాల నీకు బెంగ? కండ లున్నాయి.. కట్టం జేస్త.. కడుపుకు కూడు దొరకదా ఏంటి? అన్నాడు మీసాల పైకి సెయ్యి ఎగదోస్తూ ఆటిని వంకర్లు తిప్పుతూ.
''జేస్తాడు పాపం. . మొనగాడు .. వళ్ళోంచి ఏనాడైనా కట్టము జేసినావా ? అనింది రంగమ్మ ముది గారం ఒలక బోస్తూ .
రంగమ్మను అక్కున జేర్చుకొని ముద్దులు పెట్టినాడు ఈరన్న .
''పెల్లయిన కాడ్నుంచి నువ్వు గూడా కట్టం ఎరుగవు గదా ... నేను నిన్ను పువ్వుల్లో పెట్టి సాకుతా '' అన్నాడు ఈరన్న తన ఎదరొమ్ము కేసి బలంగా హత్తుకొంటూ . 
రంగమ్మ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారి మెరుస్తా ఉండాయి. ఈరన్న అలా ముద్దులు పెడతా ఉంటే ఎక్కడెక్కడో యామేమో అయి పోతా ఉండాది . ఈరన్న మాటలకి రంగమ్మ కల్లల్లో నీల్లు తిరగతా ఉంటే బలంగా ఈరన్నను హత్తుకొని పోయింది .
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైశాఖం నెలలో ముంగేటి వానలు పడితే సంబరాలు ఎక్కువవుతాయి రాయలసీమ రైతన్నలకు .
సమ్మచ్చరంలో నాలుగైదు నెలలు బాగా పని ఉంటుంది . తొలకరి వానలు పడే టప్పటికి దుక్కి దున్ని సేనిక్కాయ విత్తనాలు జల్లడానికి రెడీ గా ఉంటారు రైతన్నలు. పంటలు బాగా పండితే ఎకరానికి ఇరవై , ముప్పై మూటలు ఎక్కడికి పోవు. ఒక్కసారి పక్కన ఉన్న కంసలా చారి అన్న సేన్లో ఎకరానికి నలభై మూటలు పండినాయి .వాన దేముడు సల్లగా సూస్తే పంట బాగా సేతి కొస్తుంది . లేదంటే అంతే గతి. సెట్లు ఎండి పోయి ఏసిన ఇత్తనాలు గూడా సేతికి రావు. అప్పులే మిగల్తాయి .
సెని క్కాయల పంట బాగా రావాలని , ఫలం బాగా దక్కాలని , దేవుడికి మొక్కుకొని సేన్లు దుక్కి దున్నుతారు. దున్ని దున్నగానే మల్లి ఒక్కదఫా వానలు పడితే సాళ్లు తీసి ,ఆ సాళ్ళలో సక్కగా గింజల్ని నాగలి గొర్రుతో పోస్తారు ఆడోల్లు పాటలు పాడుకొంటూ. ఆరేడు వరసల శనిగ సాళ్ళకు ఒక వరస కందులు, పెసలు, అలసందలు వేస్తారు. ఒక్కొక్క సాలుకు ఒక్కో రకం పోసుకొంటా పోతారు. రెండు పున్నాలు దాటి సూడల్లా, చేన్లు ఎంత అందంగా ఉంటాయో, మొక్కలు వగలు పోతా ఉంటాయి. 
అద్ద రాతిరి దాటినా ఈరన్న కి నిద్ర రాలేదు. గుడిసె బయట వాన చినుకులు పడతా ఉండాయి. వాన బలంగా కురుస్తా ఉండాది. గుడిసె మీద కప్పిన రెల్లు గడ్డి పైనుండి వాన నీళ్లు కురుస్తా ఉండాయి. రంగమ్మ అతని ఎదురొమ్ము మీద సెయ్యి ఏసుకొని నిద్ర పోతా ఉండాది. ఈరన్నకు కుసాలుగా ఉండాది. రేపు సేన్లో టెంకాయ కొట్టి దుక్కి దున్నాల. దూరంగా ఎక్కడో గొండ్ర కప్పలు అరుస్తా ఉండాయి. వాన పడితే కప్పలు బాగా అరుస్తా ఉంటాయి. ఈ సమ్మచ్చర మయినా వానదేముడు సల్లగా చూస్తే సెనగి పంట ఫలసాయం బాగా వస్తుంది. ఎకరానికి ఇరవై మూట్లు వస్తే గానీ కొంచెం దుడ్డు అన్నా చేతికి వస్తుంది. పాపం రంగమ్మ ఎండి కడియాలు, ఎండి గాజులు కావల్ల అనింది . ' బంగారు కొనే దానికి మన తాహతు గాదంటే ఎండి అయినా కొనియ్యి మామ ' అంది. ఈ సారి సేనిక్కాయల పంట సేతి కొస్తే తప్పనిసరిగా పీలేటికి ఎల్లి ఎండి నగలు కొన్యాల. ఏదో సినిమాల్లో చూసిందంట , నల్లపూసల దండ , అది గావల్ల అని ఒక్కటే ఏడ్పు. అందుకే ఈ సారి ఇంకో రెండు ఎకరాలు రెడ్లది కౌలుకు తీసికొని సేస్తావుండాడు సేద్యం. మూడు ఎకరాల్లో పంట బాగా వచ్చిందంటే అదురుష్టమే !
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అదేమి దురదృష్టమో , భగమంతుడు కన్ను తెరవలా !. పడినట్టే పడి వాన సుక్క కరువయింది . ఆకాసం ఎండి పోయి కారు మబ్బులు లేక కాలు తెగి పోయిన కోడి పుంజు లాగా గిల గిల తన్ను కొన్నట్లా ఉండాది . పల్లెల్లోని పెజలు పానాలు కళ్లల్లో పెట్టుకోని ఆకాసం పైకి సూస్తా ఉండారు . వానలు బాగా పడితే పంట దిగుబడి బాగా ఉంటాదని , కొన్ని దుడ్లన్నా కళ్ళ చూడొచ్చు అని ఆస పడితే , దేముడు కళ్ళల్లో కారొప్పొడి కొట్టినాడు . ' వాన దేముడా ! వాన దేముడా !' అని గిన్నెల్లో వడ్ల గింజల్ని , రెండు కప్పల్ని పెట్టుకొని ఇంటింటా తిరిగి గింజలు అడుక్కొన్నారు దాసరోళ్ళు . పిడికెడు బియ్యము , లోటా నీళ్లు కప్ప దేవుళ్ళకు పోస్తే వాన దేవుడు కరుణిస్తాడంట . ఊరవతల ఉన్న గంగమ్మోరికి మొక్కు కొన్నారు. పొట్టేళ్లను బలి ఇస్తామని. చల్ది చేస్తామని. మంచి మూర్తం చూసుకొని , అమ్మోరికి కుండల్లో నీళ్లు తెచ్చి , కడిగి, తానం చేపించి ,వేపాకులు కట్టి, పసుపు కుంకుమ పూస్తారు ఆరోజు. ఊర్లో వుండే ఒకాయప్పకు గంగమ్మ ఒంట్లోకి పూనకం వస్తుంది ఆ రోజు. అయ్యప్పకు నూటొక్క కడవలతో నీళ్ల్లు పోస్తారు ఊర్లో ఉండే పెళ్లయిన ఆడోళ్ళు.పసుపు రాసి రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఏపాకు మండలు కట్టి ఆయప్పకు పూజలు సేస్తే , అమ్మోరు తల్లి ఆమెకు పూనకం బట్టి వానలు ఎప్పుడు పడతాయో సెప్పుతుంది. ఇది ఆ పల్లిలో ఎప్పటి నుండో వస్తున్న ఆచారం.
అదేమి గహచారమో ఏమో ఆరు నెలల నుండి ఒక్క సుక్క యినా వాన కురవలా. ఏసిన పంటలు ఎసినట్లే ఎండిపోయినాయి .ఎవరి ముకాల్లోనూ నవ్వు లేదు. ఎవరి కొంపలో జూసినా దరిద్రమే ! నూకలు కొనే దానికి గూడా డబ్బుల్లేవు. కూలి పని సేస్తామంటే ఒకరు గూడా పిలవడం లేదు. గవర్నమెంటోళ్లు కరువు పనులకు కోట్లు కోట్లు దుడ్లు ఇచ్చినారని పేపర్లో రాసినారంట. గాని మన కాడికి వస్తే గదా ఆ పనులు. 
''ఆ కరువు పనులు మన గాడికి రావల్లంటే ఎన్ని రోజులు పడుతుంది మామా ?'' అడిగాడు ఈరన్న ఊర్లో ఉన్న ఒక వార్తా పత్రిక చదువుతున్న పెద్దాయన్ని. 
'' అంతా దొంగ నా కొడుకుల్రా రంగన్నా! సర్కారోళ్ల కరువు పనులు మన కాడికి వస్తాయా? మద్యలో ఎంతో మంది నక్క నాకొడుకులు మింగేస్తారు దొంగ బిల్లులు పెట్టి. పదోపరకో పనులు మన కాడికి వచ్చేసరికి ఎన్ని సంవచ్చరాలు పడుతుందో! అప్పటికి మన పిల్ల జల్లా ఆకలి సావులతో సచ్చి, ఏ కాకులకో, గద్దలకో యిందు బోజనాలవుతాము . ఈరన్న.. మన బతుకులింతేరా ! మన బత్కుల్లో ఎన్నెల రాదురా! '' పెద్దాయన కోపంగా యామేమో మాట్లాడతా ఉండాడు.
ఆ మాటలు విన్న ఈరన్న కు వల్లంతా మండ్ర గబ్బలు పాకి నట్లయింది. ఈ కుల్లు బోతు మనుషుల్ని , దగా పెపంచికాన్ని బూడిద జెయ్యాలని పిస్తా ఉండాది . గానీ తాను చేతకాని దద్దమ్మ . సదువు లేదు . దుడ్లు లేవు . సాహుకారి గాదు . భూముల్లేవు . గోచి గుడ్డ గూడా కొనేందుకు దుడ్లు లేవు. తూ .. ఎం బతుకో .. బిత్తల బతుకు .

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పొద్దు పొడిసినాక పల్లిలో దండోరా ఏయించి నాడు ఊరి పెద్దాయన . పొద్దు గూకే నప్పటికీ ' అందరు రచ్చబండ కాడికి రావల్లోచ్' అని ఆ దండోరా సారాంశం. 
పొద్దు గూకింది. 
ఒకరొక్కరు రచ్చబండకు వచ్చినారు. పల్లిలో యాభై ఇళ్లు ఉంటాయేమో ! మూడు నూర్ల మంది జనాలుంటారు పిల్ల పెద్ద ముసలి ముతక అందరూ కలిపి.
''యామి పెద్దాయన ? యామి ఎవహారం ? దండోరా ఎయిచ్చి నావంట ..'' అన్నారు జనాలు.
అంతలో పెద్దాయన రచ్చ బండ మీదకు ఎళ్లినాడు.
'' అందరూ వచ్చేసినారా ? '' అన్నాడు .
వచ్చినారు పెద్దాయన. . కొన్ని కొత్త ముఖాలు గూడా కనబడి నాయి ఈరన్నకి . పక్క పల్లిలోని వాల్లు గూడా వచ్చినారేమో అనుకొన్నాడు. 
''ఇప్పుడు సెప్పబొయ్యే ఇసయం జాగరత్తగా ఇనుకోవల్ల. సమాచారం నుండి వానల్లేక కరువు బూతము మనల్ని పీక్కు తిని సంపతా ఉండాది. తాగ డానికి గంజి నీళ్లు గూడా కరువై పోతా ఉండాయి. మన పసులకు గడ్డి పోస గూడా దొరకల .ఇంక మనం ఆకలి సావుల్తో సావాల్సిందేనా ? మన బిడ్డలు అమ్మా అన్నం అని మొత్తుకొని ఏడవలసిందేనా ? అని సెప్పడం ఆపినాడు పెద్దాయన . 
అందరి ముకాల్లో దైన్యం కనబడతా ఉండాది. బతుకంటే నరకంగా అనిపిస్తా ఉండాది. 
''ఎం సేయాలో సెప్పు పెద్దాయన ?'' అన్నారు అందరూ ముక్తకంఠంతో . 
''ఏమి లేదు .. మీరంతా ఒప్పుకొంటే ఓ ఇసయం సెబుతా .. మీరు కోప్పడ గూడదు. ''
అందరు సరే అన్యాక , ఉన్న ఇసయం సెప్పినాడు పెద్దాయన. 
చాలా మంది కోపం వచ్చింది అయప్ప ఆ ఇసయం సెప్పినాక. కొంత మంది పెద్దాయనను కొట్టడానికి పైకి లేచి నారు. 
''ఏమప్పో ! పెద్దాయనవు గదా అని ఊరకే వదిలేస్తా ఉండా ! వేరే వాడు అయింటే మెట్టితో కొట్టే వాడ్ని '' అన్నాడు ఒకాయన .
ఆ మాటలకు పెద్దాయన నొచ్చుకొన్నాడు .'' నాకు తెలుసురా .. నీకు కోపం వస్తాదని. కర్ణాటక లోని ఒక ఊర్లో ఈ సంప్రదాయం ఉండాది. అది మనం చేస్తే ఎట్లాగంటాది అని సెప్పినా ..'' అన్నాడు పెద్దాయన. ఎట్టికేలకు మగాళ్లంతా ఒప్పుకొన్నారు . ''మీ ఆడోళ్లను ఒప్పించుకోని రండి .. మల్ల కలుస్తాము '' అన్నాడు పెద్దాయన. 
ఈరన్న ఇంటికి చేరె సరికి అద్ద రాతిరి దాటింది . రంగమ్మ ఇంకా అన్న తినకుండా కాసుకోని ఉండాది. అన్నలు తిన్నాక జరిగిన ఇసయమంతా సెప్పినాడు ఈరన్న . ఇసయం ఇన్నాక రంగమ్మ కి శానా కోపం వచ్చింది. 
''ఎంది .. పున్నమి రోజున ఆడోళ్ళంతా బావి కాడ తడి బట్టలతో తానాలు చేసి , గంగమ్మ గుడి కాడ అద్ద రాత్రి గుడ్డలు లేకుండా బిత్తలతో గుడి సుట్టు ఏడు సుట్లు తిరగల్నా ? అసలు నేను ఒప్పుకోను మావా ? '' అంది రంగమ్మ.
ఎలాగో బుజ్జగించు నాడు ఈరన్న .
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పున్నమి రోజు రానే వచ్చింది. 
ఆడోళ్ళంతా ఒక చోట సేరినారు. బావి కాడ కట్టు బట్టల్తో తానాలు చేసినారు. 
అద్దరాత్రి అవతా ఉండాది. అందరు గుడి కాడ సేరి నారు. మగోళ్ళు ఎవ్వరు లేరు , రంగమ్మ కి భయం వేస్తాఉండాది. అమ్మోరికి పూజలు సేసినారు ఆడోళ్ళంతా . సాంబ్రాణి, అగరొత్తులు, వేప కొమ్మలు , వండిన అన్నం , గుమ్మడికాయలు అమ్మోరికి పెట్టినారు.
'' వాన దేముడా! వాన దేముడా! సల్లంగ కురయాలి. సెరువులన్ని నిండాలి. సేన్లన్నీ పండాలి. మా పిల్ల పాపలు, గొడ్లు గోద బాగా ఉండాలి'' అని సుట్టు సేరి పాటలు పాడతా ఉండారు అమ్మ లక్కలు.
ఆడోళ్ళంతా ఏసుకొన్న గుడ్డలు తీసేసే దానికి గుడి మూలకు ఉరికి నారు.
అంతలో రంగమ్మ గట్టిగా అరసింది. '' అమ్మల్లారా .. అక్కా .. సెల్లి ..గుడ్డలు ఇప్పద్దు . ఇది మన మాన , మర్యాద కు సమ్మందించిన ఇసయం. తడి గుడ్డలతోనే అమ్మోరిని పూజ సేస్తాము రాత్రంతా .. ''అంది గట్టిగ .
అందరూ రంగమ్మ సెప్పినట్లే అద్దరాత్రి దాకా పూజలు సేసి , అందరు ఇళ్ళకి ఎల్లి బారి నారు.
తెల్లవారినా రంగమ్మ ఇంటికి రాలేదు . ఈరన్నకి భయం వేసి రంగీ .. రంగమ్మా అంటూ వెదికినాడు . ఎక్కడా రంగమ్మ జాడే లేదు. 
ఊరి చివర దిగుడు బావిలో చూసినాడు. అక్కడ రంగమ్మ శవం కన బడింది. వంటి మీద నూలు పోగు గూడా లేదు. ఎవరో ఆమెను బలవంతంగా సెరిసి నట్లు వొళ్ళంతా గాట్లు , రక్తం ఉండాది . తన లుంగీ రంగమ్మ ఒంటికి చుట్టుకొని ఇంటికే తీసుకెళ్లినాడు ఈరన్న.
చిన్న పిల్లోడిలా గుక్కిళ్లు పెట్టి ఏడ్చి నాడు ఈరన్న. 
పల్లెల జనాలంతా ఈరన్న గుడిసే ముందు చేరినారు. 
' పాపం.. బిత్తలతో ఊరు తిరిగిందని అవమానంతో బాయిలో దూకింది రంగమ్మ'' అని తలా ఒక మాట అనుకొన్నారు జనాలు.
పిల్లా జిల్లా , ముసలి ముతకా రంగమ్మ శవాన్ని జూసి ఏడుస్తా ఉండారు. 
రంగమ్మను పాడే మీద ఎక్కించి , పూలు జల్లుకొంటూ , ఊరవతల పూడ్చి పెట్టినారు అందరు కలిసి. 
ఆ రాత్రి అంతా ఉరుములు మెరుపులతో వాన ఎడతెరిపి లేకుండా కురిసింది. 
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
1985 లో  రాసిన కథ. 
GOTELUGU .COM LO 17.11.2017  PUBLISHED.
http://www.gotelugu.com/issue241/6033/telugu-stories/vaanademudaa/