Wednesday, September 28, 2016

కవిత్వం రాయడం అవసరమా ??


కవిత్వం రాయడం అవసరమా ??
---------------------------------------------

ఆకలి దప్పులు  మరచి  , ఆలు  బిడ్డలని  అరచి 
బంధు మిత్రులని వదలి , తల్లి దండ్రులను  మరచి 
ఏకాకినై  , నాలుగు గోడల మధ్య రాసితి  పలు  కావ్యముల్ ....  అన్నా డట  ఒక  కవి.

 కవి జీవితమే  ఒక ప్రవాహం లాంటిది. భావ ప్రవాహం లో కొట్టుకు మిట్టాడుతూ బాహ్య ప్రపంచాన్ని మరచి పోతాడు. తన అంతర్గత లోకంలో విహరిస్తూ ఒక ట్రాన్స్  లోకి వెళ్లి కవిత్వాన్ని రాస్తాడు.   పూర్వ కవులు  ఆనాడు ఎన్నో ప్రభందాలు , కావ్యాలు  రాసి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత గూడా మనల్ని అలరిస్తున్నాయి . ఆనాడు  రాజ పోషకులు , కళా రాధకులు ఉండే వారు. అలనాడు సామాన్య మానవులు  గూడా  ఎంతో కొంత ఆశు కవిత్వాన్ని  చెప్ప గలిగే  వారు. కవిత్రయం రాసిన  మహా భారతం  మన జాతిని ఎంత ప్రభావితం చేసింది అంటే భారతం చదవని వాడు , వినని వాడు  ఒక  చవట క్రింద లెక్కే అన్నట్లు ఉండేది. తిరుపతి వెంకట కవులు  రాసిన భారత పద్యాలు  ఈ నాటికి  పామరులు గూడా పాడుకొనే విధంగా  అలరించాయి. 

మరి ఈ  నాటి కవులు రాసిన  కవిత్వం ఎంత వరకు సజీవంగా ఉండగలదు అనేది ప్రశ్న ? నిన్న రాసిన కవిత ఈ  రోజు గుర్తు ఉండడం లేదు . మనం కవిత్వం పట్ల  చూపిస్తున్న  ఉదాసీనత  కారణమా ? ఈ నాడు  పుట్ట గొడుగుల్లా  కవులు ఉద్భవిస్తున్నారు. పండితుడు కానక్కరలేదు కవిత్వం రాయడానికి ఇప్పుడు . పామరులయినా  గీతాల్ని, కవిత్వాన్ని  అలవోకగా  చెబుతున్నారు, రాస్తున్నారు . 

రాసిన కవిత్వాలు  వేలాది రూపాయలు  పోసి  సంపుటిలుగా  ప్రచురిస్తే   పుస్తకాలు కొనే వాళ్ళే కరువయ్యారు.  ప్రతి కవిఇంట్లో అమ్ముడు కాని  పదార్థం పుస్తకాల రూపంలో  అటకల మీద కవిని వెక్కిరిస్తూనే ఉంటుంది . ప్రతి కవి హృదయ గవాక్షంలో తొంగి చూస్తే , కవి ఆవేదన అర్థ మవుతుంది . కవి గాని వాడు కవిత్వాన్ని ఏమర్థం చేసు కొంటాడు ? ప్రతి మనిషికి  కొంచెం కవిత్వపువాసనలు ఉంటేనే గానీ  కవులు రాసిన కవిత్వాన్ని  చదవ గలుగు తారు  .
పాశ్చాత్త్య దేశాలలో  కవిత్వానికి చాలా ఆదరణ  ఉంది. ప్రతి సామాన్య మానవుడి చేతిలో ఎదో పుస్తకం ఉంటుంది. వాళ్ళు తీరిక వేళల్లో పుస్తకాల్ని  బాగా చదువు తారు. అందుకే అక్కడి కవులు  రాసిన పుస్తకాలకు  మిలియన్ల  డాలర్ల  కొద్దీ  రాయల్టీ  వస్తుంది . అక్కడ సాహిత్యం గూడా  బాగా చదివే  వాళ్ళు ఉన్నారు. 

మన దగ్గర టీవీ లాంటి మాధ్యమాలు వచ్చిన తరువాత చదివే  నాథుడే లేడు . పెద్ద పెద్ద కవులు గూడా  స్వంత డబ్బా వాయించుకొని  మార్కెటింగ్ చేసుకొన్నా పుస్తకాలు అమ్ముడు పోవడంలేదు.  చెదలు పట్టి  గిడ్డంగుల్లో  అమ్ముడు కాని  పుస్తకాల్ని  ఏమి చెయ్యాలో  తెలియక తలలు పట్టుకొని కూర్చొన్న  పబ్లిషర్స్ ఉన్నారు . 

మహా భాగవతాన్ని  తెనిగించిన బమ్మెర పోతన  గారు అన్నట్లు  నరాధములకు నా కావ్య కన్నియను ఇవ్వను గాక ఇవ్వను అన్నాడు . 

కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

అలాంటి  కవులు  మనకు ఇప్పుడు గూడా ఉన్నారు. వాళ్ళ పని రాయడమే ! అలాంటి కవులకు నా జోహార్లు !

ఏమయినా   కవిత్వాన్ని   మళ్లి  సజీవంగా  పునరుద్ధించేందుకు కొన్ని కళా పీఠాలు , కల్చరల్ అసోసియేషన్స్ , ప్రభుత్వాలు కలిసి పని చేస్తే కవిత్వాన్ని , కవుల్ని  మనం కాపాడు కోవచ్చు . కవికి అవార్డు లతో పాటు  రివార్డ్ లు గూడా ముఖ్యమే గదా ! ఒక ప్రొఫెషన్  గా  తీసుకొన్న ఒక వ్యక్తి  కవి గా నిల దోక్కుగోగలడా అనేది ప్రశ్న ?  లేదనే , లేదనే సమాధానం వస్తుంది.  అందుకే  ఈ  సమాజంలో కవులు  నిత్య దరిద్రంతో  బాధ పడుతున్నారు . ఇప్పటి కయినా  మంచి కవులను ప్రోత్సహించడం మంచిది.


         భానుమూర్తి  వారణాశి 






Monday, September 26, 2016

పోనీ పోతే పోనీ !

పోనీ పోతే పోనీ !
----------------------------

తడి  ఆరని  గొంతులు
కన్నీటి సము ద్రాలయిన లోగిళ్ళు
నీళ్ల సమాధులయిన గుంతలు
మనిషి మనుగడ  ప్రశ్నార్థకం
నగరం సాగర మయిన రోజు

జవాబు దారితనం లేని
అధికారుల గుండెల్లో రైళ్లు
జవాబు లేని ప్రశ్నలు
ప్రశ్నించ లేని  ప్రజలు

మాయమై  పోయిన చెరువులమ్మల సాక్షిగా
నీటి తల్లికి ఏమి తెలుసు
తాను ఎక్కడ ప్రవహిస్తోందని ?

నీరు పల్ల  మెరుగు
నిజం దేవుడెరుగు

నాకిక్కడ ఒక నిజం తేలుతోంది
అధికారులు,  కబ్జా రాకాసుల  వేసుకొన్న పందెం లో
అమాయకులు  బలి  అవుతున్నారని...

 చెరువులమ్మలు గట్లను తెంపుకొని
కొల్లేరు లయిన  బజార్లు , బళ్ళు  , ఇళ్ళు

మృత్యు  కుహరాల్లాంటి  మాన్ హోళ్ళు
మరణ శాసనాలు రాస్తుంటే
మన స్మార్ట్ సిటీ  జీవితాలు నరక కూపాలు

ఏమున్నది చెప్పడానికి  గర్వ కారణం ?
ఏ ప్రభుత్వ మొచ్చినా   కనబడని  అభివృద్ధి  తోరణం

కాగితాల్లో  ప్రణాళికలు  కాగితం పడవలై
ఏ  తీరానికి  సగటు మనిషిని  తీసుకు  వెడతాయో ?

నిన్న వేసిన  రోడ్లు  కాంట్రాక్టర్ల  మోసానికి బలి  అయిన అబలలు
మొన్న కట్టిన ప్రాజెక్టులు ఇసుక తేలిన శిధిల  కళేబరాలు

ప్రజల నెత్తిన పెడుతున్న శఠగోపాలు
ప్రజా బ్రతుకుల్ని  లోపలికి లాక్కొనే  రక్త బిల్వాలు

''పోనీ పొతే పోనీ .... రానీ  రాక  పోనీ
చావనీ  జనాల్ ... చేరనీ నరకాల్ '' -
అని అనుకోవడం లేదు  నేను ...

రేపటి ఉదయం ఒక
అభ్యుదయ  గీతమై  మనల్ని  మురిపిస్తుందేమో !

కాగడాలు వెలిగించి  రండి
ఆ ఉదయం కోసం   వెతుకు దాం  !











Saturday, September 24, 2016

వానమ్మా .... ఇక రావమ్మా !!

వానమ్మా .... ఇక రావమ్మా !!
--------------------------------

కురుస్తున్న వానమ్మను వద్దనడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?
ఆకాశం  చిల్లులు పడేలా కుంభ వృష్టి  ఆపడానికి  నువ్వు ఎవ్వడివోయ్ ?

కట్టుకొన్న ఆకాశ  హర్మ్యాలు కూలి పోతున్నాయనా  నీ  బాధ ?
చెరువులు   మాయం చేసి  కట్టుకొన్న ఇళ్ళు  కూలి పోతున్నాయనా  నీ  ఆక్రోశం?
కబ్జా గాళ్ళ  కబంధ హస్తాల్లో   చిక్కుకొన్న  నేలతల్లి  కష్టాలు  తీరినాయనా నీ కోపం  ?
 దొంగ  దారిన  చేసుకొంటున్న  అవినీతి సొమ్ము రాదనా  నీ  బాధ?

మాయ మాటలు చెప్పి భూబకాసురులు
పచ్చని భూముల్ని లాక్కొని
 రైతన్న కడుపులో  మట్టి గొట్టి
బంగారు భూముల్ని  మసి చేసి  నుసి చేసి
కాంక్రీట్  జంగల్ని  ప్లాట్లు  చేసి
నేలమ్మ కడుపులో నిప్పులు బోసి
నాలాలు ,  కాల్వలు , చెరువులు , నదులు కబ్జాలు చేసి
ఒక పదును  వానకే  వాగులై వంకలై
నగరాన్ని  సముద్రంలో  ముంచి
సామాన్యుడి  జీవితాల్ని అతలా కుతలం చేసి
వానమ్మా  .... నువ్వు మాకు వద్దమ్మా....
వానమ్మా .... ఇక రాకమ్మా  అంటూ
దొంగ దండాలు  పెడితే పనికి రాదన్నా
నగరాలు  నిలువునా మునిగి పొయ్యే రోజు దగ్గరి  లోనే ఉంది
పంటలు పండే భూములు లేక ప్లాస్టిక్  బియ్యం తినే  రోజు  వస్తోంది
అన్నా ... రైతన్న ల ఉరిత్రాడులు  లెక్క బెట్టండి
నేల  తల్లి  శాపాలు   మనసు పెట్టి వినండి
చెరువు తల్లుల  ఏడ్పుల శోక గీతాల్ని  వినండి
నగరం  నడి బొడ్డున  హుస్సేన్  సాగర్  విష నురగలు కక్కుతోంది
ఇళ్లన్నీ  బురద కొంపలై  కంపు గొడుతున్నాయి
అపార్టుమెంట్లన్నీ  సెల్లార్  కొల్లేరులై  తేలి పోతున్నాయి
ఇక నైనా  కళ్ళు తెరవండి
చెర్వు గట్ల మీద ఇళ్ళు కట్టకండి
నాలాల్ని , కాల్వల్ని, ఏటి  గట్లను   వదలండి!!


(పది రోజులుగా ఎడతెగని కుంభ వృష్టి తో మన నగర జీవితం అతలా  కుతలమైన వేళ  రాసిన కవిత.  ఇదీ  మన నగర జీవన  వ్యధ  కథా  గీతం !!)



Thursday, September 22, 2016

పెద్ద కొడుకు

ఓం గణే శాయ  నమః

----------------------------------------------------------------------------------------

పెద్ద  కొడుకు    

రచన :  వారణాసి  భాను  మూర్తి  రావు 

---------------------------------------------------------------------------------------









అది  తిరుపతి   రైల్వే  స్టేషన్ .

ఎప్పటిలాగే  ప్రయాణీకులతో   రద్దీగా  ఉంది . ఇసుక వేస్తె  రాలనంత  జనం  హడావుడిగా  పరుగెత్తుతున్నారు .  కొండకు వచ్చే  భక్తులతో  రైల్వే  స్టేషన్  కిట కిట లాడుతూ ఉంది . రైలు ఇంజన్ల కూతలతో , మైకుల  ద్వారా అనౌన్సర్ల  ఇచ్చే  సందేశాలతో , లగేజీ  లు  మోసుకొని ' జరుగు , జరుగు ' అని  తోసుకొని  పోయే పోర్టర్లుతో   , వెంకన్నకు  తలనీలాలు  సమర్పించి బోడి గుండులతో  కన బడే  భక్తులతో , ముసలి  ముతకలతో , పిల్లా  జెల్లలతో  చాలా  కోలా హలంగా  ఉంది  .నేను గత ముప్పై  సంవత్సరాల  నుండి  చూస్తున్నా - తిరుపతి  రైల్వే  స్టేషన్ . అప్పుడూ అదే సందడి - ఇప్పుడూ  అదే  సందడి .

నేను బి కామ్ , ఎం  కామ్  చదివింది  తిరుపతి లోనే  ఇరవై  ఏళ్ల  క్రితం . తిరుపతి  రైల్వే  స్టేషన్  అంటే నాకు  వల్ల  మాలిన  అభిమానం . నేను  చదువు  కొనే రోజుల్లో  చాలా  సార్లు  అలా స్టేషన్ లో  వచ్చి కూర్చొని  వచ్చే  పొయ్యే  వాళ్ళను  చూస్తూ  టైం  పాస్  చేస్తూ ఉండే  వాడిని . వచ్చే  పొయ్యే   రైళ్ళను చూస్తుంటే   దైవ దర్శనానికి  తీసుకెళ్ళే  సర్ప రాజుల్లా  ఉంటాయి . కొండకి వద్దంటే  లక్షల్లో  జనాలు తిరుపతికి  వస్తారు . దేశ  విదేశాల నుండి  గూడా వచ్చి   నిరంతరం ఆయన దర్శించు కొంటూనే  ఉంటారు. తిరుపతి  వెంకన్న గొప్పతనం  అలాంటిది .

ఉద్యోగ  రీత్యా  హైదరాబాదు లో స్థిర నివాసమున్నా  , జన్మతః  రాయల  సీమ  వాసిని . తిరుపతి  దగ్గర ఒక పల్లెటూర్లో  పుట్టాను . చదువుకొనే  రోజుల్లో  నెల కోక్కసారి  కాలినడకన  అలిపిరి  గుండా కొండకు  వెళ్ళే  వాళ్ళం . పరీక్షల్లో  పాస్  అయితే తప్పని  సరిగా  తలనీలాలు  సమర్పించు  కొనే  వాణ్ని . దాదాపుగా  ఇరవై  సంవత్సరాల  తర్వాత మళ్లీ  గుండు  చేయించు  కొన్నాను . కళ్యాణ కట్టలో  తల నీలాలు సమర్పించిన  తర్వాత  ఎంతో  ఆత్మ సంతృప్తి కలిగింది  నాకు . నారాయణాద్రి  ఎక్స్ ప్రెస్ రావడానికి ఇంకా ఒక గంట  టైం  ఉంది . శ్రీమతి  నా ప్రక్కనే కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుతొంది. థర్డ్ ఎ సి బోగీ  ఎదురుగా  కూర్చొన్నాము.

వాచీలో  టైం  ఐదు  గంటలు  అవుతోంది .

అంతలో ఒకాయన  పిగిలిపోయి , మాసి పోయిన  తెల్ల పంచె , చిరుగులు  పడిన  తెల్ల  చొక్కా వేసుకొని నా  వైపే  తదేకంగా చూస్తున్నాడు . ఎవరో  బిక్ష  గాడనుకోన్నాను . ఆయన  ముఖం లొట్టలు పోయి  , కళా విహీనంగా  ఉంది . పెదాలు ఎండి  పోయి , చీలి పోయి  నిర్జీవంగా  ఉన్నాయి . క్షుర కర్మ గూడా చేసుకొన్నట్లు లేదు . తల స్నానం లేక తల వెంట్రుకలు దుమ్ము పట్టినట్లుంది . సుమారు అరవై ఏళ్ళ వాడిలా  ఉన్నాడు . కాళ్ళకు  చెప్పులు  లేవు . ఏదో బాధలో ఉన్నట్లు ఉన్నాడు . నన్ను చూస్తూ  అలా ఇలా పచార్లు చేస్తున్నాడు . నేను  అతని వైపే  చూస్తున్నాను .  అతన్ని ఎక్కడో  చూసి నట్లు అన్పిస్తోంది .

'' టైం  ఎంత  సార్ ? '' అన్నాడు  అతను .

'' ఐదు అయింది   '' అన్నాను  నేను  నా ఐదు చేతి  వేళ్ళను  చూపిస్తూ

''హైదరాబాదు  వెళతా  ఉండారా ?''

''అవును ''

''నీ  పేరు  ... నీ  పేరు  మూర్తి  గదూ ? మీ ఊరు  రాస పల్లి  గదూ ? ''సంశయంగా  అడిగాడు  అతను .

''అవును .. నీ  కెట్లా తెలుసు ?'' అన్నాను నేను  ఆశ్చ్యరంగా .

''మీరు కరణాలు ....  సాములు  గదూ ? మీ  నాయన  పేరు కిట్ట  మూర్తి  గదూ ?'' అన్నాడు అతను . అతని ముఖం లో  నవ్వు కన బడింది  నాకు .

నేను  చాలా  ఆశ్చర్యంగా  '' అవును .. అవును '' అన్నాను .

''నేను ... నేను  .. గోవింద  రెడ్డిని  .. సామీ .. గుర్తు పట్టలేదా  ? ఇందాకట్ని  నిన్ను  సూస్తానే   ఉండాను . ఓరి  నీ  ఫాసుంగులా ! గుర్తు బట్ట లేక  బోతా ఉండాను. తమ్ముళ్ళు  , సెల్లెల్లు అంతా  బాగా ఉండారా  సామీ !''అన్నాడు  ఆప్యాయంగా ఆ  ఆసామీ .

 నా దగ్గర కొచ్చి  నా రెండు  చేతులూ  పట్టు కొన్నాడు  పట్టలేని సంతోషంతో

''నువ్వు ... గోవింద రెడ్డివా ..ఇక్కడ  ఏం  చేస్తున్నావు ?'' అన్నాను నేను  లేచి  నిలబడి .

''నేనా ...నేను .. ఈ  టేషన్ లో  అడుక్కొని  బతుకు  తుండాను   సామీ !'' అన్నాడు  అతను  వచ్చే  దుఃఖాన్ని  ఆపుకోంటూ .

''ఎమిటి ...  యాభై  ఎకరాల  భూస్వామి  అడుక్కొని  తింటున్నావా ?నీ  కెందుకీ  అగత్యం పట్టింది ?'' అన్నాను  నేను  చాలా ఆశ్చర్యంగా .

అతని  కళ్ళల్లో  కన్నీళ్ళు  సర్రున క్రిందకు  జారాయి .

''సామీ ! మీరంతా సదువు కొనేటప్పుడే మనూరు బాగుండే ! మీ తాత కరణం పని  సేసేటప్పుడే మనూరు  సల్లగా ఉండేది .ఎవరికి అన్నాయం  సేసే వోడు  గాదు  మీ  తాత . కరణాల పని మీ దగ్గర నుండి పీకేసి నప్పటి నుండి మన  ఊరికి దరిద్రం సుట్టుకోనింది .  ఇప్పుడుండే  కరణానికి లెక్కలు రావు . గొలుసు పట్టుకోని  సర్వే సేసే దానికి  రాదు . ఏ  భూమి  ఏ  సర్వే నంబర్ లో ఉండేది  అసలు  తెలీదు . మళ్ళి  కరణం  సాముల్నే  పిలిపించు కోవల్ల . మన పబుత్వం  చాలా తప్పు పని చేసింది  కరణాలను  ఊడబెరికి .'' అన్నాడు  గోవింద  రెడ్డి  ఆవేశంగా .

అవును , అప్పటి  ప్రభుత్వం  మండలాలుగా  విభజించి , అధికార  వికేంద్రీ కరణ  చేసింది  కొన్ని నూతన సంస్కరణలు  చేబట్టింది . ఆ  దశలో కరణీకాల్ని , మునసబుల్ని  రద్దు  చేసి  చాలా  కాల మయింది . ఇప్పుడు  కరణాలుగా ఎవ్వరూ లేరు . ఉన్న కరణీ కాలను పోగొట్టుకొని చాలా  మంది అగర్భ  దరిద్రంతో  మరణించారు . కొంత  మంది  కొత్తగా నియమింప బడ్డ ఆఫీసర్ల  దగ్గర జీతానికి  పని  చేస్తున్నారు .అదంతా పాతికేళ్ళ ముందు మాట . మా తాత గారు గూడా కరణీకం పోయిందనే  దిగులతో మరణించారు  . అదృష్టం గొద్ది మా  నాన్న  చదివించాడు  గాబట్టి , నేను  పెద్ద  ఉద్యోగంలో  ఉన్నాను

''సరే... .గతం గతః .. గోవిందరెడ్డి .. నువ్వు బాగా బతికిన రైతువు  గదా .. ఎందుకిలా  ఈ  రైల్వే స్టేషన్  లో  అడుక్కొంటున్నావు ?''అన్నాను  నేను .

గోవింద రెడ్డి ఈ సారి రెండు చేతులు ముఖానికి కప్పుకొని ఏడ్సేశాడు .

'' నీకు తెలుసు  గదా  సామీ ... నాకు ముగ్గురు కొడుకులు , ఇద్దరు  కూతుళ్ళు . అందర్నీ  నా సక్తి  కాడికి బాగా  సదివించా . కూతుళ్లకి  లచ్చల్లొ  కట్నాలిచ్చి  పెళ్ళిళ్ళు  సేసినా ! పెద్దోడు  అమెరికా పోవల్లని  పది ఎకరాలు అమ్మేసి  ఎల్లిపాయే . రెండవ  కొడుకు  పది ఎకరాలు  అమ్మేసి  దుబాయి  లో  యాపారం  సెయ్యల్లని ఎల్లిపాయే . ఇగ మూడవ వాడు  పెళ్ళాం మాటలు ఇని పది  ఎకరాలు  రాయించ్కొని మదన పల్లి లో వేరే కాపురం పెట్టినాడు . ఇగ  ఉండే  ఇరవై ఎకరాలు దస్తావేజులు బాంకులో పెట్టి  ఐదు  లక్షలు అప్పు  చేసి  కూతుళ్ళ  పెళ్లి  సేసినాను . ఆ అప్పు  తీర్చే  స్తోమత  లేక బాంకొల్లు వేలం ఏసి భూముల్ని  అమ్మేస్తా మంటా ఉండారు సామీ ! ఆ  దిగులతో  నా  బార్య  సచ్చెపాయ . కొడుకు  లెవ్వరూ  ఒక రోజు పిలిసిన  పాపాన  పోలేదు . ఒక రోజు అయినా పిలిచి  అన్నం  పెట్టలేదు . ఈ  వయసులో  ఇంత  బతుకూ  బతికి అడుక్కొనే స్తితికి  దిగజార్సినారు సామీ నా కొడుకులు... దొంగ  నా  కొడుకులు .. థూ .. వాళ్ళది ఒక బతుకేనా ?'' అన్నాడు  గోవింద రెడ్డి  చాలా బాధగా .

''బాంకులో తీసుకొన్న పైకం  ఏమైనా  తిరిగి  చెల్లించావా ?'' అడిగాను నేను .

''నాకు  ఆదాయం  ఎక్కడిది  సామీ ? ఏసిన పంటలు  అట్లనే ఎండిపోతాయి . వానలు  లేవు . పంటలు  లేవు . రాయల సీమ లో రైతులు చాలా  కట్టాల్లో  ఉండారు . సేనిక్కాయల  పంట  సరిగా  జూసి  పదేళ్ళు  అయితా ఉండాది . మళ్ళు  సుద్దామంటే నీళ్ళు  ఉంటే  గదా పండే దానికి . బాంకోళ్ళు  అసలు , వడ్డీ  కట్టక పొతే  భూముల్ని జప్తు  చేసి , అరెస్ట్  గూడా సేస్తామంటున్నారు . ఎకరా  భూమి  అమ్ముదామంటే  కొనే  నాథుడే  లేడు . ఊరికే  ఇస్తే  గూడా తీసు కోనే  వోళ్ళు  లేరు సామీ ''  అన్నాడు  గోవింద  రెడ్డి .

అవును  . గోవింద  రెడ్డి  చెప్పింది  అక్షరాలా  నిజం . వర్షాలు పడక , భూమిలో నీళ్ళు లేక  భూములన్నీ  బీడు బట్టి  ఎడారుల్లాగా  మారి పోయినాయి . గిట్టుబాటు  లేక రైతులు  సేద్యం  చెయ్యడం  మానేశారు .పిల్లలు  కాస్తో  కూస్తో  చదువుకొని  ఊరొదిలి  వెళ్ళి పొయ్యారు . ఇప్పడు  ముసలి ముతక తప్ప  పల్లెల్లో  ఎవరూ  ఉండడం  లేదు . పల్లెలన్నీ స్మశానాల్ని తలపించే  విధంగా  ఉంటాయి  రాయల  సీమ లో .

'' బాధ పడితే  మనం  చెయ్యగలిగింది  ఏమి లేదు  గోవింద  రెడ్డి '' అంటూ మా  శ్రీమతికి  గోవింద  రెడ్డి ని పరిచయం చేశాను .

''బాగున్నారా ?''  అంది  మా  శ్రీమతి .

''ఏమి  బాగో  ఏమో అమ్మా ... సామికి  తెలుసు  మా బాగు ..పిల్లొల్లంతా  బాగుండారు  గదా అమ్మా ?''


గోవింద  రెడ్డి కథ  విన్న తర్వాత ఆయన దైన్య స్థితికి నా మనస్సు అల్ల కల్లోలం  అయింది . అలజడి తో నా కళ్ళళ్ళొ నీళ్ళు సుడులు  తిరుగుతున్నాయి . పైకి  ఉబికి  వచ్చే కన్నీళ్లను  ఆపుకొనే  ప్రయత్నం  చేస్తున్నాను .

గోవింద రెడ్డి నన్ను చిన్నపుడు వీపు మీద ఎక్కించుకొని ఆట లాడించే  వాడు . నేనంటే అతనికి వల్లమాలిన అభిమానం .
మహల్ కో , కలకడ కో వెళ్ళితే నా కోసం  స్వీటో , ఫలమో  తీసుకోని  ఇచ్చే వాడు . మా నాయన  క్లాస్ మేట్ గోవింద రెడ్డి .
అందుకే నేనంటే అంత ఇష్టం ఉండేది . వాళ్లింట్లో కారాలు , సుట్టలు , పప్పు బిళ్ళలు , పాగం పప్పు  లాంటి   అప్పచ్చులు చేసినా నా  కిచ్చే  వాడు . కనుమ పండుగ  రాజయితే  దోసెలు , సేనిగ్గింజల ఊరిమిండి వేసి ఆప్యాయంగా  తిని పించే వాడు .


భగవంతుడు  ఎంత పక్ష పాతి ? రెక్కలు ముక్కలు  చేసుకొని  ప్రతి క్షణం కన్న బిడ్డల కోసం  ఆరాటపడి , వాళ్ళ  అభ్యున్నతి  కోసం  పాటుపడే తల్లి తండ్రులను నిర్దాక్షిణ్యంగా  వదిలేస్తారే  కడుపున  పుట్టిన  పిల్లలు. పసివాళ్ళుగా  ఉన్న  పిల్లలు  పెద్దయ్యాక  తల్లి తండ్రులకే పగ వాళ్ళుగా  ఎందుకు  మారుతారో ?

చదువు  ఉన్నదనే  ఆహంకారమా ?డబ్బున్నదనే  అహంభావమా ?తల్లి తండ్రి  నిరక్ష రాస్యులే కావచ్చు . భూమిని నమ్ముకొన్న  రైతు  బిడ్డలే  కావచ్చు . మొరటు  వాళ్ళే  గావచ్చు .  కాని  రక్తం పంచుకొని  పుట్టిన  బిడ్డలే  ఈసడించు కొంటే  వారి  గతి  ఏమి  కావాలి ? ప్రతి  రక్తపు  బొట్టు  వారి  శ్రేయస్సు కే  ధారపోసిన  తల్లి తండ్రులకా  ఈ  దురవస్థ ? నడి  రోడ్డులో  అనామకుడిగా , నా అనే వారు లేక , దిక్కు మొక్కు లేక  యాచకుడిగా  మారిన  గోవింద రెడ్డి లాంటి వారి  పరిస్థితి  ఏమిటి ? జన సంబంధాలన్నీ  ధన  సంబంధాలేనా ??

నా గుండె వేగంగా కొట్టు కొంటుంది  .  నా కళ్ళల్లో  నీళ్ళు  తిరుగుతున్నాయి . గోవింద  రెడ్డి ని పిలుచుకొని పోయి పళ్ళు , బిస్కేట్లు , నీళ్ళ  బాటల్  కొనిచ్చాను . పర్సు  లోంచి  తీసి  ఒక  ఐదు వందల  రూపాయల  నోటు  చేతిలో  ఉంచాను . మొహమాటంగా  అతను  వద్దన్నా  జోబిలో  నోటును  కుక్కినాను .

'' గోవింద  రెడ్డి ! నువ్వేమీ  భయ పడ  వద్దు . బాంక్  వాళ్ళతో  మాట్లాడి , నీ  భూమిని  విడిపించే  మార్గం  ఆలోచిస్తాను .
హైదరాబాద్  కెళ్ళి డబ్బు  విషయం  చూస్తాను . నిన్ను  మళ్లి పాత  గోవింద రెడ్డి గా  చేస్తాను '' అన్నాను నేను .

''సామీ .. నా  పెద్ద కొడుకు గూడా  ఇంత  దైర్నం  చెప్పలేదు  నాకు ''అని నా  రెండు  చేతులు పట్టుకొని ఏడ్చినాడు  గోవింద  రెడ్డి .

                                                          ******************

ఆంధ్రా  బాంక్  హెడాఫీసు లో  నా  ఫ్రెండ్ ఒకడు  జిఎమ్  హోదా లో పని చేస్తున్నాడు . వాడితో మాట్లాడి కలకడ  బ్రాంచి కి  ఫోన్  చేయించి నాను . గోవింద  రెడ్డి  కట్ట వలసిన అప్పు వడ్డీతో  సహా  అన్ని మినహాయింపులు పోను రూ . 268311/- అన్నారు. నేను  నా అక్కౌంట్ నుండి  డ్రా చేసి  డిమాండు డ్రాఫ్టు ద్వారా కలకడ  బ్రాంచ్ కి పంపించాను .  గోవింద రెడ్డి అప్పు  క్లియర్  అయింది .

ఇరవై  రోజుల తర్వాత గోవింద  రెడ్డిని కలకడ కి రమ్మని చెప్పి , నేను  బస్సులో  కలకడలో  దిగినాను . గోవింద  రెడ్డి కి  సంబంధించిన తనఖా  పత్రాలన్నింటిలో సంతకాలు  చేయించి , భూమికి  సంబంధించిన  దస్తా  వేజులన్నింపంటలు టిని విడిపించి ఇప్పించి నాను . గోవింద  రెడ్డి  సంతోషానికి అవధులు లేక పోయింది . ఇరవై  ఎకరాల  భూమి  అతని  స్వంతమయింది .
'' గోవింద రెడ్డి .. నువ్ ఇక  తలెత్తు కొని ఊర్లో తిరగాలి . మునపటి లాగా  పెద్ద రాయుడి లా బతకాలి . నేను వ్యవసాయాధి కారులతో మాట్లాడి  నీకు విత్తనాలు వగైరా  సబ్సిడీ తో ఇప్పిస్తాను . అలాగే  స్ప్రిం క్లర్ ఇరిగేషన్ తో నువ్వు  సేద్యం
 చేద్దువు  గానీ !'' అన్నాను నేను .

''నువ్వు  వెయ్యేళ్ళు బతకాలి మహారాజా '' అని దీవించాడు  గోవింద రెడ్డి

                                                           *****************

అనుకోన్నట్లుగానే  గోవిందరెడ్డి  తన పొలంలో టమోటా ,వంకాయ , బెండ కాయ , గుమ్మడి  లాంటి  కూరగాయలు , తమల పాకులు , అరటి తోటలు పెంచ సాగాదు.  బోర్ వేసిన  వేళా  విశేషమో  ఏమో గాని , నీళ్ళు  బాగానే పడ్డాయి .  సూక్ష్మ సేంద్రియ  విధానంతో మంచి వాణిజ్య పంటలు పండించ సాగాడు . ఊర్లో  మళ్ళి  గోవింద రెడ్డి  పరపతి  బాగా పెరిగింది . పది మంది  కూలీలు వద్దంటే  పలుకు తున్నారు . అంతా డబ్బు మహిమ . నేను అప్పుడప్పుడు  వ్యవసాయ  అధికారులతో మాట్లాడి సాగు లోని  మెలుకువ లన్ని తెలుసుకొని , తగిన జాగ్రత్తలు  అన్ని చెప్పి,  మంచి దిగుబడి వంగడాలను  చెపుతూ  గోవింద  రెడ్డిని ఒక  ఆదర్శ రైతు గా తీర్చి దిద్దినాను ఒక్క సంవత్సరంలో . మదన పల్లి, తిరుపతి ,బెంగుళూరు  మార్కెట్  లలో  వచ్చిన  దిగుబడి నంతా  అమ్మ వలసిందిగా , దానికి  కావాల్సిన  వనరులన్నీ  సరి  చేసి పెట్టాను .  ఒక చిన్న ఆటో ట్రాలీ కొనుక్కోవడానికి  పాతిక వేలు పంపించాను .
                                                          ****************
ఒక్క సంవత్సరం తర్వాత
ఆ రోజు  శని  వారం . ఉదయం  ఏడు  గంటలు
హాల్లో  కూర్చొని , పేపర్  తిర గేస్తూ  , కాఫీ  తాగుతున్నాను .
ఇంతలో  కాలింగ్  బెల్లు  మ్రోగింది . తలుపు తెరచి  చూశాను .
చక్కని నాణ్యమైన గ్లాక్సో పంచె , కద్దరు  చొక్కా , మీద ఒక  కండువా   , కొత్త  చెప్పులు వేసుకొని ఆకర్షణీయంగా పరిశుభ్రమైన  శరీరంతో వాకిట్లో  ప్రత్యక్ష  మయ్యాడు  గోవింద  రెడ్డి .

గోవింద  రెడ్డి  ని  చూసి  ఆశ్చర్య  పొయ్యాను  నేను . అనుకోకుండా  వచ్చిన  అతిధి ని  చూసి  లోపలికి రమ్మన్నాను .
'' సామీ .. బాగుండారా !'' అన్నాడు .పెద్ద  సిమెంట్ గోనె  సంచి  నిండుకు కూరగాయలు , అరటి గెల , పూలు , పళ్ళు ,   స్వీట్లు  బాక్స్ తో ప్రత్యక్ష  మయ్యాడు  గోవింద రెడ్డి .

'' ఇవన్నీ  మన  తోటలో  పండినవే !'' నవ్వుతూ  అన్నాడు  గోవింద రెడ్డి .

శ్రీమతి  ఆశ్చర్యంతో  గోవింద రెడ్డి వంకే  తదేకంగా  చూస్తూ  ఉండి పోయింది .

'' నీ  దయ  వల్ల  మళ్ళి నేను  నిల  దొక్కు  కొన్నాను  సామీ !'' 

'' సరే .. ఇలా సడెన్  గా   వచ్చేసావేమి ? '' అని అడిగాను .

''నిన్ను  సూడల్లా అని అన్పించింది .వచ్చేశాను . '' అన్నాడు  గోవింద రెడ్డి .

ఇంతలో  గోవింద  రెడ్డికి కాఫీ  తెచ్చి  ఇచ్చింది  శ్రీమతి .

గోవింద రెడ్డి వెంటనే  ఇంకొక  మూట  విప్పి , అందులోని  కాగితాల  సొరుగులో  దాగిన  నోట్ల  కట్టల్ని  బయటకి  తీసి టీ పాయి మీద  ఉంచాడు .
'' ఏమిటది  గోవింద రెడ్డి ?'' అన్నాను నేను .

''ఈ సారి అరటి కాయల పలసాయం  బాగా కలిసొచ్చింది . రేటు గుడా  బాగా పలికింది . బెంగుళూరు లో అరటి లోడ్లు అమ్మేసి వస్తా ఉండాను . నాలుగు లక్షలు వచ్చింది . నీకు  ఇవ్వాల్సిన పైకం వడ్డీ తో సహా ఈ నాలుగు లక్షలు  తీసుకోండి.''
అన్నాడు కృతజ్ఞతా  భావంతో  గోవింద రెడ్డి .

నా ఆశ్చర్యానికి  అంతే లేకుండా పోయింది . భూమి తల్లిని నమ్ము కొన్న  వాడు  ఎన్నటికీ  చెడిపోడని పెద్ద  వాళ్ళు  ఊరికే  అనలేదు .
'' నువ్వు నా కివ్వ వలసిన  పైకం 268311/- రూపాయలు మాత్రమే . వడ్డీ   నేను  తీసుకొను  '' అని అన్నాను  నేను .
అతనిచ్చిన డబ్బు నంత వరకే  లెక్క బెట్టి , మిగిలిన దంతా  జాగ్రత్తగా  కాగితాల్లో  చుట్టి పెట్టి గోవింద రెడ్డి కి  వాపసు చేసినాను .
గోవింద రెడ్డి  ఏమనుకోన్నాడో  , ఏమో గానీ  నా పాదాలకు  నమస్కరించ బోయ్యాడు .
'' నా తండ్రి  లాంటి  వాడవు , నా కేల  నమస్కారం  చేస్తావు ?'' అన్నాను నేను  అతన్ని  వారిస్తూ .

'' ఈ  రోజు నుండి  నువ్వే  నా  పెద్ద  కొడుకువి సామీ  !' అన్నాడు
.
ఆయన  గొంతులో మాటలు పెగలడం  లేదు . రుమాలుతో  కళ్ళను  ఒత్తుకోంటూ  బయలు  దేరాడు  గోవింద రెడ్డి .
---------------------------------------  The  End ---------------------------------------------------------------------


pratilipi  bhavagiti kathala poti-- got a special prize. 6000 readers and  100 comments stood highly regarded by readers as the best social story.




Tuesday, September 13, 2016

మనం కవులమా ?

మనం  కవులమా ?

------------------------------------------------------------

మనం మనుషులమా ?
మనం  కవులమా??


భార్య  శవాన్ని  పది మైళ్ళు  మోసుకెళ్లిన  నిర్భాగ్యుని   అసహాయతను చూసి గూడా
ఉలిక్కి పడని  ప్రజా స్వామ్య దేశపు  బూటకాన్ని  ఎండ గట్టే కవిత్వం  రాదేంటి  ? ?

డబ్బుల్లేని  గర్భిణీ    కాలి  నడకన  చేరి  ఆసుపత్రి గేటు బయట
ప్రసవిస్తే  ఆ మాతృ మూర్తి  వేదన కవిత్వమై బయటకు రాదేంటి ??

మృగాలాంటి మనుషులకు  వత్తాసు పలికే
రాజకీయ నాయకుల  ద్వంద వైఖరిపై  దుమ్మెత్తి పొసే  కవిత్వం రాదేంటి ??

మతం ముష్కరుల  మరణ హోమం లో  సమిధలై పోతున్న
నానా జాతీయుల బాధా  సర్ప ద్రష్టల  ఆక్రందనలు  కవిత్వమై రాదేంటి ??

అడ్డమైన లెక్కలతో  కోట్లాది జనాల కష్టార్జితాన్ని బడా బాబులు  దిగ మింగుతుంటే
కడుపు నిండని అన్నార్తుల ఆకలి మంటల మీద కవిత్వం రాదేంటి ??

కవుల్లారా
కనులుండి నిజాల్ని  దాచి
అబద్దాలను  రాస్తున్నారా ??

సన్మానాలకోసం , శాలువలకోసం , చప్పట్ల  కోసం
అడ్డమైన  కవిత్వాల్ని    రాస్తున్నారా  ??

ఒక్క సారి  జనం కోసం జన్మ నెత్తిన
మహా కవులు  ఏమన్నారో  వినండి !

కవులు నిజాల్ని రాస్తారు
కవులు  జీవితాల్ని  రాస్తారు
కవులు  కన్నీళ్ల  సిరాతో  కవిత్వాన్ని రాస్తారు
కవులు  దరిద్రులయినా  మంచి కవిత్వం రాసి  మహా రాజులవుతారు
కవులు  జనం కోసం  మరణిస్తారు !!



12. 09. 2016